ఫుట్పాత్పై నడిచినా ‘నో సేఫ్టీ'.. వేగంగా వచ్చి ఐదుగురిని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, వీడియో వైరల్
ఫుట్పాత్పై వెళ్తున్న ఐదుగురు యువతులను వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. కర్ణాటక మంగళూరు(Mangalore Accident)లోని లేడీహిల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
దేశంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు(Road Accidents) నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ ఎక్కడో ఏదో ఓ మూల వందలకొద్దీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, డ్రైవర్ నిర్లక్ష్యం ఇలా పలు కారణాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సీసీటీవీ కెమెరాలు, కార్లలో అమర్చిన అధునాతన టెక్నాలజీ కారణంగా ప్రమాదాలు జరిగిన తీరు మనం తెలుసుకోగలగుతున్నాం.

తాజాగా కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఓ యాక్సిడెంట్ గూస్బంప్స్ను కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత ఫుట్పాత్పై జనాలకి రక్షణ లేదా అనిపిస్తుంటుంది. సాధారణంగా హై స్పీడ్తో వెళ్తున్న కార్లు డివైడర్ను లేదంటే ఇతర వాహనాలను ఢీకొట్టిన సంఘటనలు చూసుంటాం. కానీ ఇక్కడ ఫుట్పాత్పై వెళ్తున్నా వీరికి రక్షణ లేకుండా పోయింది.
మంగళూరులోని లేడీ హిల్లో ఫుట్పాత్పై వెళ్తున్న ఐదుగురు యువతులను వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా మందుకు దూసుకెళ్లి పోయింది. ఈ ఘటనలో రూపశ్రీ(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా స్వాతి (26), హితన్వి (16), కార్తీక (16), యతిక (12)లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరగగానే కారు డ్రైవర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. యాక్సిడెంట్పై పాండేశ్వర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కారు డ్రైవర్ను కమలేష్ బలదేవ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఒకరు.. ఇద్దరు యువతులు, ముగ్గురు బాలికలు ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తుండగా.. వేగంగా వచ్చిన కారు వారిని వెనుక నుంచి ఢీకొట్టిందని పేర్కొన్నారు.
ప్రమాదానికి సంబంధించిన CCTV ఫుటేజీని సిటిజన్ మూవ్మెంట్ ఈస్ట్ బెంగళూరు తన 'X'(గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఈ ప్రమాదం ద్వారా రోడ్డుపై ఫుట్ పాత్ కూడా సురక్షితం కాదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. పబ్లిక్ రోడ్లపై స్పీడ్ లిమిట్ను మెయింటైన్ చేయాలి.

నెటిజన్ల కామెంట్లతో వీడియో వైరల్గా మారింది. రోడ్డు ఖాళీగా ఉన్నా.. ఫుట్పాత్పైకి కారు ఎలా వచ్చిందంటూ.. ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు.. హత్య అంటూ మరొకరు కామెంట్ చేశారు. దేశంలో ఫుట్పాత్లపై కూడా ప్రజలకు రక్షణ లేదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు.
కాగా దేశంలో రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుగుణంగా నిర్దేశిత వేగ పరిమితిలో వాహనాన్ని నడపాలని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు దీనిని పాటించడం ద్వారా ప్రమాదాలు జరగవు. అంతే కాకుండా బైక్ లేదా కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ఇంకా, ధరించడం చాలా అవసరం.

ఇంకా మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు. వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడటం లేదా ఇయర్ఫోన్లలో పాటలు వినడం చేయకూడదు. దీంతో రోడ్డుపై దృష్టి సారించలేరు. ఇంకా ముఖ్యంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకూడదు. హైవేపై లేన్ క్రమశిక్షణను పాటించాలి. సమీపంలో వస్తున్న వాహనాలపై ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








