Golden Hour ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. పైలట్ ప్రాజెక్టు ఎక్కడంటే.??
దేశంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచితంగా వైద్య సహాయం అందించనున్నారు. కాగా మొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో దీన్ని మొదటగా ప్రవేశపెట్టారు.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఏటా భారత్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, డ్రైవింగ్పై అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్ల నిత్యం వందలకొద్దీ ప్రాణాలు కోల్పోతుండగా.. వేలల్లో అంగవైకల్యం పొందుతున్నారు. సరైన సమయంలో క్షతగాత్రులకు చికిత్స అందకపోవడం కారణంగా కూడా వారిలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు భద్రతను, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా బాధితులకు త్వరితగతిన వైద్య సదుపాయం అందనుంది. క్యాష్లెస్ ట్రీట్మెంట్(Cashless Treatment For Road Accident Victims)గా ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్షతగాత్రులు చికిత్సను పొందవచ్చు.
కాగా ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలు అత్యంత క్లిష్టమైన సమయంగా పరిగణిస్తారు. దీనినే "గోల్డెన్ అవర్"(Golden Hour) అంటారు. ఈ గోల్డెన్ అవర్లో క్షతగాత్రుడు చికిత్స పొందడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ గోల్డెన్ అవర్ దాటి ఆసుపత్రికి చేరుకోవడంలో ఆలస్యం అయితే.. వ్యక్తి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ క్రమంలో కొందరికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్(Cashless Treatment In India) పొందడానికి ఆర్థిక పరమైన సమస్యలు రావచ్చు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం.. దీన్ని నివారించేందుకు ఆస్పత్రి ప్రమాద బాధితులందరూ ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా వైద్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం ప్రకారం, భారతదేశంలోని పౌరులు ఎవరైనా ప్రమాదానికి గురైతే వెంటనే వారిని సమీపంలోని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఆ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ వ్యక్తి నుంచి వైద్యులు ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు.. కేంద్రం ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి చికిత్సకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు ఆసుపత్రులు నేరుగా ప్రభుత్వానికి సంబంధిత వ్యక్తికి ట్రీట్మెంట్ అందించిన డాక్యుమెంట్స్ను సమర్పించి చికిత్స కోసం డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా ఈ పథకాన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా మాత్రమే కేంద్రం ప్రవేశపెట్టబడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా చండీగఢ్లో దీన్ని తీసుకువస్తోంది. ఈ ట్రయల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుందో పర్యవేక్షించిన అనంతరం దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చు.
నివేదికల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. 4.43 లక్షల మంది తీవ్రం గాయాలపాలయ్యారు. ఈ పథకం కార్యరూపం దాల్చినట్లయితే ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్య సహాయం అందడంతో పాటు వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.


Click it and Unblock the Notifications








