ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనేవారు కాస్త ఓపిక పట్టండి.. పీఎం ఇ-డ్రైవ్ వోచర్స్ ద్వారా తక్కువ ధరకే కొనొచ్చు!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ రంగానికి ఊతం ఇచ్చేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఇ-డ్రైవ్ (PM e-Drive) ప్రాజెక్ట్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు ఈ నిధులను ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీలు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించనున్నారు. ఈ నిర్ణయంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా వీటి ధరలు ధరలు కూడా తగ్గనున్నాయి. భవిష్యత్తులోనూ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు, ఇతర ప్రోత్సాహకాలు, ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన వంటి వాటికి ఊతం ఇవ్వనుంది. ఈ ప్రధానమంత్రి ఇ-డ్రైవ్కి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
కేంద్రం ప్రకటించిన పీఎం ఇ-డ్రైవ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు లభించనుంది. అయితే ఈ జాబితా నుంచి ఎలక్ట్రిక్ కార్లు, ఎస్యూవీలు, హైబ్రిడ్ కార్లను తొలిగించారు. తాజా సవరించిన జాబితా ప్రకారం టూవీలర్స్, త్రీ వీలర్స్, ఇ-బస్లు, ఇ-అంబులెన్స్లు, ట్రక్కులు మాత్రమే సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊపందుకోవడంతో వాటిని తొలగించారు.

ఈ ప్రాజెక్ట్ కింద రెండేళ్ల పాటు మొత్తం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ అందుతుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఈ-వోచర్ల ద్వారా ఈ ప్రోత్సాహకాలను అందిచనుంది. మీరు ఈవీని కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ సర్టిఫైడ్ ఈ-వోచర్ జనరేట్ చేయబడుతుంది.
ప్రత్యేక పోర్టల్ ద్వారా కస్టమర్కి వోచర్కి సంబంధించిన వివరాలు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి పంపిస్తారు. ఆ తర్వాత డీలర్లు పీఎం ఈ-డ్రైవ్ పోర్టర్లో సంతకం చేసి అప్లోడ్ చేస్తారు. ఇరు పక్షాలు సంతకం చేసిన వోచర్ని ఎస్ఎంఎస్ ద్వారా పొందుతారు. వాహన తయారీదారులు (OEM) క్లెయిమ్ చేసుకోవడానికి ఈ సంతకం చేసిన వోచర్ కీలకంగా ఉంటుంది.

దీని ద్వారాకింద వీటిలో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న 9 నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రజా రవాణా సంస్థల కోసం రూ. 4391 కోట్లు కేటాయించారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్ నగరాల్లో ఈ బస్సులను నడపనున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ ప్రజా రవాణా మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
దీనితో పాటు రూ. 2,000 కోట్ల బడ్జెట్తో ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల కోసం 22,100 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం 1,800, ఎలక్ట్రిక్ టూ మరియు త్రీవీలర్లకు 48,400 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయాలని కూడా ప్రతిపాదించింది.

ఈ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా పెరుగనుంది. పీఎం ఇ-డ్రైవ్ ద్వారా భారతదేశంలో స్థిరమైన రవాణా దిశగా ఒక కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడం ద్వారా క్లీన్ డ్రైవ్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఖచ్చితంగా భారతదేశంలో కాలుష్య స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధానం పెద్ద నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను కూడా బలోపేతం చేస్తుందని భావిస్తోంది.
ఎలక్ట్రిక్ అంబులెన్స్లు సైతం ఈ విభాగంలో చేర్చడం పట్ల దేశ ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏయే వాహనాలకు ఎంత డిస్కౌంట్ ఇస్తారు. ఎంత మొత్తంలో ఈ-వోచర్ ద్వారా రిడీమ్ చేసుకోవచ్చనే విషయంపై స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫేమ్ సబ్సిడీ ఇవ్వబడింది. ఫేమ్ గ్రాంట్ రెండో దశ పూర్తికావడంతో తాత్కాలికంగా గ్రాంట్ని కూడా ఇచ్చారు. బడ్జెట్లో ఫేమ్ సబ్సిడీ మూడో ప్రకటన కోసం ఎదురుచూడగా నిరాశే ఎదురైంది. అయితే తాజాగా కేంద్రం ప్రకటించిన పీఎం ఇ-డ్రైవ్ కాస్త ఉపశమనమనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








