సెలవంటూ వెళిపోతున్నావా.. అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు
'హిందుస్థాన్ మోటార్స్' యొక్క 'అంబాసిడర్' (Ambassador) కారు ఎంతోమంది సుపరిచయమే, ఎందుకంటే గొప్ప ధనవంతలు మరియు ప్రభుత్వ అధికారులు ఉపయోగించే వాహనంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. 1990 ల్లోనే ఈ కారు విపరీతమైన ప్రజాదరణ పొందినదిగా కీర్తి గడించి చాలా రంగాల్లో తన సేవలను అందించింది. ఇప్పటికి కూడా చాలామంది వాహన ప్రియులు ఈ అంబాసిడర్ కారుని కలిగి ఉన్నారు. మనం కూడా చాలా సందర్భాల్లో అక్కడక్కడా చూసే ఉంటాము.

భారతీయ మార్కెట్లో సుదీర్ఘ కాలంపాటు సేవలందించిన ఈ కారు 2014లో ఉత్పత్తి నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది. కానీ చాలామంది అధికారులు చాలా రోజుల వరకు వినియోగించారు. ముంబై రైల్వే విభాగంలో కూడా ఈ కారుని ఏకధాటిగా 35 సంవత్సరాలు వినియోగించారు. అయితే ఇటీవల ఈ కారు ముంబై రైల్వే విభాగానికి వీడ్కోలు పలికింది.

ఈ అంబాసిడర్ కారు 1985 జనవరి 22న ముంబై రైల్వే విభాగంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి కూడా వినియోగంలోనే వుంది. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ కారు డ్రైవర్ కూడా ఆ కారుతో పాటు రిటైర్ తీసుకున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం.

భారతదేశంలో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అమలులోకి వచ్చిన తరువాత కొన్ని నియమాలు సూచించడం జరిగింది. ఈ నియమాల కారణంగా పాత వాహనాలను స్క్రాపింగ్ చేయాలి. దీనిని కూడా స్క్రాపింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా ఆ అంబాసిడర్ కారుకి ఘనంగా వీడ్కోలు పలికారు.

అంబాసిడర్ కారుకి పూల మాలలతో అలంకరించి వీడ్కోలు పలికారు. ఆ కారు డ్రైవర్ కూడా ఆసందర్భంగా రిటైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముంబై రైల్వే అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆటోమోటివ్ శకాన్ని ప్రారంభించిన కారు ఈ 'అంబాసిడర్' కారు బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ కాకపోవడం వల్ల నిలిపివేయబడింది. హిందుస్థాన్ అంబాసిడర్ ఇప్పటికీ చాలా చోట్ల టాక్సీ మరియు క్యాబ్లుగా ఉపయోగిస్తున్నారు.

సెంట్రల్ రైల్వేస్ ముంబై డివిజన్ యొక్క చివరి అంబాసిడర్ కారు డ్రైవర్తో సహా మొత్తం 5 మంది వ్యక్తులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రారంభంలో దీనిని సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ యొక్క ఇంజినీరింగ్ విభాగం 1985 లో రూ. 75000 ధరతో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ కారు 6 జూన్ 1992న సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్లోని వాణిజ్య విభాగానికి మారింది. ఈ కారు సుదీర్ఘంగా డ్యూటీలో సేవలందించినా ఎటువంటి సమస్యలకు లోను కాలేదని అధికారులు తెలిపారు.

35 సంవత్సరాలు సేవలందించిన ఈ కారుకి డ్రైవర్ 'ముత్తు పాండి అండి నాడార్'. ఇతడు 1992 నుంచి ఈ కారును డ్రైవ్ చేస్తున్నాడు. అయితే యితడు 1984 లో సెంట్రల్ రైల్వేలో ఖలాసీగా చేరారు. ఆ తరువాత 1988లో డ్రైవర్ అయ్యాడు. 1992 లో ముత్తుకు ఈ కారు డ్రైవింగ్ బాధ్యతలు అధికారులు అప్పగించారు.

ఈ కారుకి వీడ్కోలు పలికే సందర్భంలో డ్రైవర్ ముత్తు మాట్లాడుతూ, నా యువరాణిని చాలా మిస్ అవుతున్నానని అన్నారు, అంతే కాకుండా.. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి సమస్యలకు మరియు ప్రమాదాలకు గురి కాలేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ కారుకి ఎక్కడా ట్రాఫిక్ చలానాలు కూడా కట్టే అవకాశం రాలేదని ఆయన గర్వంగా చెప్పాడు. అయితే ఈ రోజే ఈ కారుతో నా చివరి ప్రయాణం అని కూడా బాధపడ్డాడు.
NOTE: ఇక్కడ ఉపయోగించిన మొదటి ఫోటో తప్పా మిగిలినవి కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే


Click it and Unblock the Notifications