Chandrayaan-3 చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా ఉపయోగం ఏంటి..? జూలై 14న జరగబోయేది ఇదే..!
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్రీమ్ మిషన్ చంద్రయాన్-3ని జూలై 14న ప్రయోగించనున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రెండు నెలల పాటు ఈ ప్రయాణం కొనసాగనుంది. చంద్రయాన్ 3 మిషన్ వ్యోమనౌక 2నెలు ప్రయాణించిన తరువాతే చంద్రుడిపై అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడిని అన్వేషించడం ఓ పెద్దకలగా నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా దాదాపు 2008లో చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా ఇస్రో ఈ ఘనత సాధించింది. చంద్రయాన్-1 ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టి చంద్రుడి గురించి వివిధ సమాచారాన్ని భూమికి పంపింది. చంద్రుడిపై నీటి ఉనికి సహా చంద్రుడి గురించి ఇస్రో అనేక సమాచారాన్ని వెల్లడించడం ద్వారా సైన్స్లో కొత్త విప్లవం తీసుకువచ్చింది.

రెండోసారి 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో చంద్రుడిని ఢీకొట్టింది. చంద్రయాన్ ల్యాండర్, రోవర్ రెండూ క్రాష్ అయ్యాయి. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కారణంగా ఇస్రో నిరాశకు గురైంది. ప్రపంచం అంతా భారత్ ఒక్కసారిగా చిన్నబోయినట్లైంది.
చంద్రయాన్ -2 నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా చంద్రయాన్ -3 వ్యోమనౌకను రూపొందించే పనిలో ఇస్రో ఉంది. అందుకు అనుగుణంగానే గతసారిలా కాకుండా ఈసారి చంద్రయాన్-3 భారత వ్యోమనౌక సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అన్ని సవాళ్లను నిలదొక్కుకుని నిల్చునేలా చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం చంద్రయాన్ -3ని పూర్తిగా సిద్ధం చేసి క్యాప్సూల్ కు సీల్ చేసి రాకెట్ లో పెట్టారు. ప్రయోగానికి సిద్ధంగా ఉన్న లాంచ్ ప్యాడ్ లో రాకెట్ ను ఉంచారు.
జూలై 14న మధ్యాహ్నం 14.00 గంటలకు చంద్రయాన్-3 ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. భారతదేశపు అత్యంత బరువైన వ్యోమనౌకను మోసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని ప్రయోగించనున్నారు.
జీఎస్ఎల్వీ రాకెట్ పేరును ఎల్వీఎం3-ఎం4గా ఇస్రో మార్చింది. ఇది మూడు వేలు కిలోల నుంచి 6 వేలు కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. మొత్తం మూడు దశల్లో ఈ రాకెట్ ను రూపొందించారు. ఈ రాకెట్కు అత్యంత శక్తివంతమైన రెండు స్ట్రాపాన్ బూస్టర్లు వుంటాయి.
మొదటి దశను ఎస్-200 సాలిడ్ స్టేజ్ అంటారు. ఇది ఘన ఇంధనంతో నడిచే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన తొలి ఇంజిన్ ఇదే కావడం విశేషం. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్లో 200 టన్నుల ఘన ఇంధనం వుంటుంది. మొదటిదశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో వున్న 400 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు.
110 టన్నుల ద్రవ ఇంధనంతో (ఎల్-110)తో రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ-25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్ను రూపకల్పన చేశారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకోసం యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై రసాయనాలు, అక్కడి మట్టి, నీటి అణువులను పరీక్షించనున్నారు. దీని ద్వారా చంద్రుడి గురించి మరిన్ని విశేషాలు మనకు తెలిసే అవకాశముంది. చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపిస్తున్నారు. వీటి సాయంతో చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, ఉష్ణోగ్రతలపై కూడా అధ్యయనం చేపట్టేందుకు ఇది సహాయపడనుంది.
డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: చంద్రయాన్ -3 భారతదేశ డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రపంచం మొత్తం చంద్రుడిని ఆశ్చర్యంగా చూస్తున్న తరుణంలో అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎంత పెద్ద వృద్ధి సాధించిందో చెప్పడానికి చంద్రుడిపై భారత్ దీనిని ప్రయోగిస్తుండటం నిదర్శనం. ఈ సారి ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే ధీమా శాస్త్రవేత్తల్లో కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








