చంద్రయాన్ 3 పై ఇస్రో అప్డేట్.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఎప్పుడు యాక్టివేట్ కానున్నాయంటే..
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఈ ఘనత సాధించిన తొలిదేశంగా భారత్ చరిత్ర సాధించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్లో ఇస్రో విక్రమ్ ల్యాండర్ను చంద్రుడిపైకి ప్రవేశపెట్టింది. ఈ ఘనత సాధించినందుకు ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తిని, ఇస్రో శాస్త్రవేత్తల కృషిపై ప్రశంసల జల్లు కురిసింది.
జూలై 14న చంద్రయాన్ 3 అంతరిక్షంలోకి దూసుకెళ్లగా.. 41 రోజుల పాటు ప్రయాణించి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇస్రో ప్రవేశపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, చంద్రుడిపైకి దిగి తమ కార్యాచరణను ప్రారంభించాయి. ఆ రోజు నుంచి 14 రోజుల పాటు చందమామపై పలు పరిశోధనలు జరిపాయి.

ఈ క్రమంలో 14 రోజుల తర్వాత.. చీకటి వాతావరణం ఏర్పడటంతో ప్రస్తుతం చంద్రునిపై నిద్రిస్తున్న చంద్రయాన్-3 వ్యోమనౌక విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. అక్కడ పగటి వాతావరణం ప్రారంభమైన వెంటనే.. రెండూ నిద్రాణస్థితి నుండి బయటకు వచ్చి తమ మిషన్లను ప్రారంభిస్తాయని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తయిన అనంతంరం.. ల్యాండర్ మరియు రోవర్ తమ మిషన్లను నిర్వహించి, చంద్రుడిపై పరిశోధించిన సమాచారాన్ని భూమికి పంపాయి. చంద్రుడిపై ల్యాండర్ మరియు రోవర్ రెండూ సౌరశక్తితో పనిచేసేలా రూపొందించబడ్డాయి. కనుక చంద్రునిపై వెలుతురు వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేలా వీటిని రూపొందించారు.
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత 14 రోజుల పాటు, దాని ల్యాండింగ్ సైట్లో సూర్యకాంతి ఉంటుంది. ఆ సూర్యరశ్మిని ఉపయోగించి ల్యాండర్ మరియు రోవర్ పనిచేశాయి. చంద్రునికి పగలు 14 రోజులు మరియు రాత్రి 14 రోజులు ఉంటాయి. 14 రోజుల పరిశోధన తర్వాత, ల్యాండర్ మరియు రోవర్ సూర్యాస్తమయం సమయంలో విశ్రాంత స్థితిలోకి వెళ్లేలా శాస్త్రవేత్తలు ఆపరేట్ చేశారు.
చంద్రునిపై 14 రోజుల పాటు చీకటిగా ఉండటంతో విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. దీంతో ల్యాండర్ మరియు రోవర్కు ఇప్పుడు ఇస్రోతో సంబంధం లేదు. అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు అక్కడ పగటి వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సందర్భంలో విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్లు సూర్యకాంతి తిరిగి ప్రారంభమైనప్పుడు అవి స్వయంగా యాక్టివేట్ అయ్యే విధంగా ఇస్రో సైంటిస్ట్లు రూపొందించారు. దీని ప్రకారం, విక్రమ్ ల్యాండర్ పనిచేస్తున్న ప్రాంతంలో సూర్యరశ్మి ఎప్పుడు వస్తుందనే సమాచారాన్ని ఇస్రో విడుదల చేసింది.
ఈ నెల 22వ తేదీన చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతంలో పగటి వాతావరణం మొదలుకానుంది.. సూర్యరశ్మి రాగానే విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ తమను తాము పునరుద్ధరించుకుని చంద్రునిపై తమ పరిశోధనను ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అన్నీ ప్రణాళిక ప్రకారం జరగడంతో ల్యాండర్ మరియు రోవర్ నిద్ర నుంచి మేల్కొంటాయని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. యాక్టివేట్ అయితే అవి తమ పరిశోధన పనులను తిరిగి ప్రారంభించి భూమికి సమాచారాన్ని పంపిస్తాయి. అవి పంపించే డేటా ద్వారా చంద్రుని గురించి మరింత లోతైన అవగాహన కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుందని ISRO తెలిపింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి ఇస్రో మనుషులను పంపినప్పుడు కూడా ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని సమాచారం.


Click it and Unblock the Notifications








