చంద్రయాన్- 3 పై చైనా సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు.. భారత్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా.??
చంద్రయాన్- 3(Chandrayaan-3) మిషన్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగ్విజయంగా దిగడంతో అక్కడ 14 రోజుల పాటు ల్యాండర్, రోవర్ అధ్యయనాలు జరిపి దేశానికి పలు సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్- 3 ల్యాండర్, రోవర్ అసలు దక్షిణ ధ్రువంపై దిగలేదని చైనా వాదిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జూలైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పంపిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టులో చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. అక్కడ 14 రోజుల పాటు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పలు అధ్యయనాలు జరిపి భారత్కు సంకేతాలు పంపించింది. ఈ క్రమంలో చంద్రయాన్-3 ల్యాండర్ మరియు రోవర్ని విజయవంతంగా చంద్రుడిపై దిగడాన్ని చైనా అంగీకరించలేకపోతోంది.

భారత్, చైనా మధ్య వార్ అంతరిక్షానికి వ్యాపించింది. చంద్రునిపై ల్యాండింగ్ సైట్ ధ్రువానికి సమీపంలో చంద్రయాన్-3 మిషన్ ఎక్కడా లేదని చైనా(China Scientist )లో ప్రముఖ శాస్త్రవేత్త ఓయాంగ్ జియువాన్ తెలిపారు. ఈ వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చైనా సైంటిస్ట్ ఎందుకిలా అన్నారు.. అసలేం జరిగింది..
భారీ బడ్జెట్ సినిమా కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో.. ఇటీవల చంద్రయాన్-3 ప్రాజెక్టును విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఎందుకంటే ఇంతవరకూ ఏ దేశం కూడా చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవ్వలేదు. ఆ క్రెెడిట్ భారత్కే దక్కింది.

అయితే ఈ మిషన్ విజయవంతం అయిన తర్వాత, ఆస్ట్రేలియా తీరానికి సమీపంలో చంద్రయాన్-3 శిథిలాలు కనిపించాయని నకిలీ వార్తలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇంకా దీని గురించి అంతరిక్ష సంస్థలు కూడా ఎలాంటి అధికారిక పత్రాలను విడుదల చేయలేదు. ఈ క్రమంలో చంద్రయాన్- 3 పై చైనా సైంటిస్ట్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే భారత్ విజయాన్ని చైనా జీర్ణించుకోవడం లేదా అని అనిపించడం కామన్.
చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్లను చంద్రుడి దక్షిణ ధ్రువంపై దింపలేదని చైనాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ ఓయాంగ్ జియువాన్ మీడియాకు తెలిపారు. తన ప్రకటనను వివరిస్తూ, చంద్రయాన్-3 ధ్రువ ప్రాంతానికి 619 కిలోమీటర్ల దూరంలో ఉందని సైంటిస్ట్ ఓయాంగ్ వెల్లడించారు. చైనాలో మూన్ మిషన్ కార్యక్రమానికి పితామహుడిగా పేరొందిన ఓయాంగ్ జియువాన్ చైనీస్ భాషా వార్తాపత్రిక సైన్స్ టైమ్స్తో ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో 69 డిగ్రీల దక్షిణ అక్షాంశానికి చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ధ్రువానికి దగ్గరగా లేదని, ఇది 88.5 మరియు 90 డిగ్రీల మధ్య ల్యాండింగ్ అయినట్లు జియువాన్ పేర్కొన్నారు. అయితే చంద్రయాన్ -3 ఇతర అంతరిక్ష మిషన్లకు దక్షిణంగా ఉన్నట్లు ఇప్పటివరకూ ఉన్న సమాచారం.
చంద్రయాన్- 3 ప్రాజెక్టుపై చైనా శాస్త్రవేత్త వ్యాఖ్యలను ప్రపంచంలోని మరే దేశం అంగీకరించడంలేదు. ఇస్రో శాస్త్రవేత్తల విజయాలను మసకబార్చేందుకు ఇదో ఎత్తుగడగా పలువురు అభిప్రాయపడుతున్నారు. జియువాన్ వ్యాఖ్యలపై రానున్న రోజుల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
చంద్రయాన్ 1 మొదటిసారిగా 2008లో ఇస్రో ప్రయోగించింది. ఇది విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించి చంద్రునిపై అధ్యయనం జరిపింది. దీని తరువాత, చంద్రయాన్- 2 ప్రాజెక్టును 2019 లో చేపట్టారు. కానీ చివరి దశలో మిషన్ కంట్రోల్ కోల్పోయి చంద్రుడిపై కుప్పకూలిపోయింది.
చంద్రయాన్- 2 ఫెయిల్యూర్తో ఇస్రో చంద్రయాన్-3ని సవాల్గా స్వీకరించి ప్రపంచంలోని అగ్ర దేశాలతో సమానంగా ఈ మిషన్ను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్ 2 కోసం ఇస్రో దాదాపు రూ. 978 కోట్లు ఖర్చు చేయగా... చంద్రయాన్ 3 కోసం కేవలం రూ. 630 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు. చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ఈ రోవర్ తన పని పూర్తి చేసిందని చెప్పారు. నిద్రాణస్థితి నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.
కాగా చంద్రుని ఉపరితలంపై ఈ నెల 22 న సూర్యోదయం అయినప్పటి నుంచి.. నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను తిరిగి మేల్కొలిపేందుకు ఇస్రో తన ప్రయత్నాలు చేపట్టింది. కానీ.. ఇంతవరకు వాటి నుంచి ఎలాంటి స్పందన లేదు. రోజులు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడంతో, అవి తిరిగి మేలుకుంటాయన్న ఆశలు తగ్గిపోతున్నాయి. చంద్రయాన్-3లోని పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులకు తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








