గంటకు 60 కాదు.. 600 కిమీ వేగంతో ప్రయాణించే ట్రైన్.. ఎక్కడంటే..?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే రైలును చైనా తయారు చేసింది. గంటకు గరిష్టంగా 600 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే మాగ్లెవ్ రైలును చైనా మంగళవారం ప్రారంభించింది. అత్యధిక టాప్ స్పీడ్తో ప్రస్తుతం ఇదే ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరులుగులు తీసే ట్రైన్గా రికార్డు నెలకొల్పింది.

చైనా తీరప్రాంత నగరమైన కింగ్డావోలో కొత్త మాగ్లెవ్ రైలును ప్రారంభించినట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ హై స్పీడ్ మాగ్లెవ్ రైలు ప్రాజెక్టును అక్టోబర్ 2016లో ప్రారంభించారు. కాగా, 2019లో 600 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు యొక్క నమూనాను తయారు చేశారు.

జూన్ 2020లో ఈ ట్రైన్ యొక్క ట్రైల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఇది అక్కడి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలులో మొత్తం 10 బోగీలు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క బోగీలో 100 మంది ప్రయాణికుల చొప్పున మొత్తం 1000 మంది ఇందులో ప్రయాణించవచ్చు.

ఈ రైలు కోసం మొత్తం 1,500 కిలోమీటర్ల ప్రత్యేకమైన ట్రాక్ను ఏర్పాటు చేశారు. సాంప్రదాయిక రైళ్ల మాదిరిగా మాగ్లెవ్ రైలు చక్రాలు రైల్ ట్రాక్తో సంబంధంలోకి రావు, అందువల్ల అవి అధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

మాగ్లెవ్ రైలు విద్యుత్తు ద్వారా సృష్టించబడిన అయస్కాంత తరంగాలను ఉపయోగించి ట్రాక్లపై తేలుతాయి. దీనినే లీవియేటింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. రైలు పట్టాలు మరియు రైలు చక్రాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ లేకపోవడం వలన ఇది అతి ఎక్కువ వేగాన్ని పొందుతుంది.

ఈ రైళ్లు మరియు ట్రాక్ల నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఇవి చాలా తక్కువ దేశాల్లో కనిపిస్తాయి. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ వంటి దేశాలలో ఈ తరహా రైళ్లను ఉపయోగిస్తున్నారు. చైనా దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ రైళ్లను పరిమిత స్థాయిలో ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం, మెగాసిటీ అయిన షాంఘైలో విమానాశ్రయం నుండి నగరానికి వెళ్ళడానికి చిన్న మాగ్లెవ్ లైన్ కూడా ఉంది. చైనాలో ప్రస్తుతం ఇంటర్సిటీ లేదా ఇంటర్-ప్రావిన్స్ మాగ్లెవ్ లైన్లు లేవు, అయితే షాంఘై మరియు చెంగ్డు వంటి కొన్ని నగరాలను ఈ లైనుతో కలిపేందుకు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్లో పేర్కొన్న సమాచారం ప్రకారం, మాగ్లెవ్ రైలు ప్రస్తుతం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హై-స్పీడ్ రైళ్లు మరియు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విమానాల మధ్య అంతరాన్ని పూరించడానికి సహాయపడుతుందని తెలిపింది.

ఈ రైలును అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, రైలు యొక్క బ్రేకింగ్ వ్యవస్థ చాలా సమర్థవంతంగా తయారు చేయబడింది, తద్వారా ఇది బ్రేకింగ్ దూరాన్ని 16 కిమీ నుండి 10 కిమీకి తగ్గిస్తుందని చైనా తెలిపింది. ఈ రైలులో ప్రయాణీకులకు ఇంటర్నెట్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యాలను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
Image Courteys: China Xinhua News And China News


Click it and Unblock the Notifications