Rahul Gandhi లారీలో ప్రయాణించి ఆశ్చర్యపరచిన రాహుల్ గాంధీ.. అధికారులకు కాసేపు చుక్కలు..!
భారత్ జోడో యాత్ర పేరిట గత సెప్టెంబరులో పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో జయభేరి మోగించిన రాహుల్ గాంధీ.. ఫుల్ జోష్లో ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులు దోచుకున్నారు.
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ బీఎంటీసీ బస్సులో సాధారణ వ్యక్తిలా ప్రయాణించి మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. అంతే కాకుండా ఫుడ్ డెలివరీ బాయ్ బైక్పై ప్రయాణించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు 'భారత్ జోడో యాత్ర' తర్వాత రాహుల్ గాంధీ సామాన్యులతో మరింతగా మమేకమవుతున్నారు.

తాజాగా రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణించి సామాన్య ప్రజలతో పాటు నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు. అర్ధరాత్రి వేళ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లారీలో ప్రయాణించారు. సోమవారం అర్ధరాత్రి వేళ ఢిల్లీ నుంచి చండీగఢ్ మార్గంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాహుల్ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉన్న తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీలను కలవడానికి ఢిల్లీ నుంచి వెళ్ళినట్లు సమాచారం. మార్గమధ్యలో హర్యానాలోని సోనిపట్ హైవేపై ట్రక్కులు నిలిపి ఉన్న చోట వాహనం ఆపి వాటి డ్రైవర్లను రాహుల్ కలిశారు. అక్కడ వారితో మాట్లాడి వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అంబాలా మీదుగా లారీలోనే చండీగఢ్ వరకూ వెళ్లారు.

దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అర్ధరాత్రి వేళ ప్రయాణించడంపై ఆయన ధైర్యాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. డ్రైవర్లతో ఆయన సంభాషణ, సింప్లిసిటీ పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణిస్తున్న వీడియోను కాంగ్రెస్ నేతలు షేర్ చేస్తూ, 'మీడియా కథనాల ప్రకారం, భారతదేశంలోని రోడ్లపై సుమారు 90 లక్షల మంది డ్రైవర్లు వివిధ వాహనాలను నడుపుతున్నారు. వారి సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు. ఆయన ఈ దేశ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. నెమ్మదిగా ఈ దేశం రాహుల్ గాంధీతో కదులుతోంది'' అని పోస్టు చేశారు.

రాహుల్ లారీలో ప్రయాణిస్తున్న వీడియోపై ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హి తన ట్విట్టర్ ఖాతాలో.. రాహుల్ గాంధీ ట్రక్కు లోపల కూర్చుని అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. 'ఆయన ట్రక్ డ్రైవర్లతో సమయం గడిపి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.'' అని అన్నారు. కాంగ్రెస్ నేతలు మరొక అడుగు ముందుకేసి దీనిని మన్ కీ బాత్గా అభివర్ణించారు.
రాహుల్గాంధీ అంత పెద్ద నాయకుడు సాదాసీదాగా ఎలాంటి సెక్యురిటీ లేకుండా ట్రక్కులో ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని రాహుల్గాంధీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. అయితే రాహుల్గాంధీ సెక్యురిటీ లేకుండా లారీలో ప్రయాణించడంపై ప్రశంసలతో పాటు విమర్శలు వస్తున్నాయి. అంత పెద్ద నాయకుడు సెక్యురిటీ లేకుండా ఎలా ప్రయాణిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సిమ్లాలో ఉన్నారు.


Click it and Unblock the Notifications








