ప్రమాద సమయంలో తెరుచుకోని ఎయిర్బ్యాగ్లు... కార్ల తయారీ సంస్థకు భారీ జరిమానా..!!
మారుతి సుజుకి (Maruti Suzuki) ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా భారీ సంఖ్యలో ఈ కార్లు అమ్ముడవుతున్నాయి. అయితే మారుతి కార్లకు సంబంధించి తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
భద్రతలో వైఫల్యం జరిమానా విధింపు : మారుతి సుజుకి కార్లు అనేక సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విఫలం అవుతున్నాయి. తాజాగా ప్రమాద సమయంలో మారుతి కారులోని ప్రయాణికుడికి సరైన భద్రత కల్పించడంలో విఫలం అయినందుకు మారుతి సుజుకి సంస్థ భారీ జరిమానా విధిస్తూ వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.

ప్రమాద సమయంలో ఎయిర్బ్యాగ్లు తెరుచుకోలేదని.. : కేరళలోని ఇండియానూర్కు చెందిన మహమ్మద్ ముస్లియర్ కొన్ని రోజుల క్రితం మలప్పురం జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. తాను ప్రయాణిస్తున్న మారుతి సుజుకి వాహనం ప్రమాదం సమయంలో సరైన రక్షణ కల్పించలేదని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఎయిర్బ్యాగ్లు తెరుచుకోలేదని, ఫలితంగా తనకు తీవ్ర గాయాలు అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మూడేళ్ల నాటి కేసులో.. : 2021 జూన్ 30వ తేదీన మహమ్మద్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా డ్యామేజీ అయింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్బ్యాగ్లు (Airbags) తెరుచుకోలేదు. ఫలితంగా మహమ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. దీంతోపాటు ప్రమాద సమయంలో కారులోని ఎయిర్బ్యాగ్లు తెరుచుకోలేదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నివేదిక కూడా ఇచ్చారు.

కారు కొనేందుకు చెల్లించిన నగదును తిరిగివ్వాలని ఆదేశం : మహమ్మద్ వాదనను పరిగణనలోకి తీసుకున్న వినియోగదారుల కమిషన్ మారుతి సంస్థకు భారీ జరిమానా విధించింది. కారు కొనుగోలు చేసేందుకు మహమ్మద్ వెచ్చించిన మొత్తం రూ.4.35 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీంతోపాటు కోర్టు ఖర్చుల కింద రూ.20000 అదనంగా చెల్లించాలని మారుతి సుజుకి సంస్థను ఆదేశించింది.
ఆలస్యం అయితే 9 శాతం వడ్డీ చెల్లించాలని : ఈ తీర్పును నెలరోజుల్లోగా అమలు చేయకుంటే 9 శాతం వడ్డీతో చెల్సించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే తయారీ లోపాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి తయారీ లోపాలను గుర్తించిన కొన్ని సంస్థలు అప్పుడప్పుడు వాహనాలను రీకాల్ చేస్తాయి. ఇప్పటికే అనేక సంస్థలపైన వినియోగదారుల కమిషన్ జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఫోర్ట్ కూడా ఇటీవల జరిమానాను ఎదుర్కొంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








