అమెరికాలో నౌక ఢీకొట్టడంతో కుప్పకూలిన వంతెన.. షిప్లో 22 మంది భారతీయులే.. నదిలో పడిన కార్లు
అమెరికాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం(US Bridge Collapse) చోటుచేసుకుంది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కుప్పకూలిపోయింది. వంతెన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వైరల్ అయ్యాయి.
మంగళవారం తెల్లవారుజామున బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు పటాప్స్కో నదిలో నౌక వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా అమెరికాలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను ఢీకొట్టింది సింగపూర్కు చెందిన సినెర్జీ మెరైన్ గ్రూప్నకు చెందిన 'డాలీ' అనే నౌకగా అధికారులు గుర్తించారు.

నదిలో ప్రయాణిస్తుండగా నౌకలో ఇద్దరు పైలెట్లు(US Bridge Collapse Incident) సహా 22 మంది సిబ్బంది ఉన్నట్లు సినెర్జీ మెరైన్ సంస్థ వెల్లడించింది. అయితే వీరంతా భారతీయులేనని.. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో వంతెన కూలినప్పుడు పైనుంచి ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి 12 తర్వాత(Indians In US Bridge Incident).. బాల్టిమోర్ నుంచి శ్రీలంక వైపు నౌక కంటెనర్లతో వెళ్తుండగా ప్రయాణ సమయంలో నౌక తాను వెళ్లాల్సిన మార్గం నుంచి కాకుండా మరో వైపు మళ్లింది. ఆ సమయంలో నౌకలో లైట్లు వెలుగుతూ ఆగుతూ కనిపించగా.. కాసేపటి తర్వాత నౌక నుంచి పొగ వెలువడింది.

ఆ కాసేపటికే నౌక బ్రిడ్జిని ఢీకొట్టింది. అయితే ఈ నౌక అలా దారి ఎందుకు మళ్లిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాద సమయంలో వంతెనపై కొందరు నిర్మాణ కార్మికులు విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వంతెన కూలిపోతుండగా వాహనాలు నీట పడిపోవడంతో.. దాదాపు 20 మంది నీటమునిగినట్టు అధికారులు చెబుతున్నారు. బాధితుల్లో ఇద్దరిని సహాయ సిబ్బంది వెలికితీయగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
పూర్తిగా భారతీయ సిబ్బందితో కూడిన డాలీ కంటైనర్ షిప్ ఒక్కసారిగా ట్రాక్షన్ను కోల్పోయి వంతెనపైకి దూసుకెళ్లింది. నౌకలో ప్రయాణిస్తున్న 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారు. కాగా బ్రిడ్జిపై గుంతలను సరిచేసే పనిలో ఉన్న నిర్మాణ సిబ్బందిలోని ఆరుగురు విధుల్లో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

నదిలో మునిగిపోయిన ఇతరుల కోసం చర్యలు చేపట్టినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ షానన్ గిల్రెత్ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువే ఉండొచ్చని బాల్టిమోర్ సిటీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి కెవిన్ కార్ట్రైట్ భావిస్తున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని గాలింపు చర్యలు ముమ్మరం చేశారన్నారు. నదిలో పడిపోయిన వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటివరకూ మృతుల వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఘోర ప్రమాదంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారతీయుల కోసం హెల్ప్లైన్ను జారీ చేసింది. నదిలో ప్రయాణిస్తుండగా.. నౌక దాని దిశను నియంత్రించలేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనపై మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ స్పందించారు. నౌక దారి తప్పి వంతెనను సమీపించడంతో హెచ్చరిక జారీ అయినట్లు తెలిపారు. ఆ వెంటనే వంతెన వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయని.. దీంతో చాలామంది ప్రాణాలు కాపాడగలిగినట్లు వెస్ మూర్ పేర్కొన్నారు. వంతెన నుంచి వేరే మార్గంలో దారి మళ్లించినట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఓడ నుంచి ఫ్యూయెల్స్ లాంటివి చిందకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కాగా ఈ ఘటనలో వంతెనకు సంబంధించి చాలా భాగం నీటిలో మునిగిపోయి ఉంది. నౌక కూడా సంఘటనా స్థలంలోనే ఉంది. ఆ నౌకలో చాలా కంటెనర్లు లోడ్ చేసి ఉండటాన్ని చూడవచ్చు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అయితే అక్కడి వాతావరణం బాగా చల్లగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








