‘మా బ్యాగులో బాంబు ఉంది'.. ఎయిర్పోర్ట్లో గంటన్నర సేపు సిబ్బందికి, ప్రయాణికులకు చుక్కలు చూపించిన జంట
సరదా కోసం ఎయిర్పోర్ట్లో ఓ జంట చేసిన పని.. సిబ్బంది విధులతో పాటు ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగించింది. తమ బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో ఒక్కసారిగా కంగారు పడిపోయిన ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది.. ఆందోళనలో పడిపోయారు. చివరికి ఫ్లైట్ లేట్ అవడంతో పాటు ఆ జంట కేసు నమోదైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
గోవాలోని తాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత మంగళవారం(నవంబర్ 14) న రాత్రి ఓ సంఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లో ఎప్పటిలాగే, ప్రయాణికులందరికీ ఫ్లైట్ ఎక్కే ముందు భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల బ్యాగులను విడివిడిగా తనిఖీ చేస్తున్నారు.

ఆ సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన 29 ఏళ్ల అతుల్ కుమార్ కేవత్, కోల్కతాకు చెందిన 29 ఏళ్ల త్రితి జానా.. సెక్యూరిటీ చెకింగ్ క్యూలో నిలుచున్నారు. వారు గోవా నుంచి బెంగళూరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. కాసేపటికి వారిద్దరూ సమీపంలోని ప్రయాణికుడికి ఒక బ్యాగ్ని చూపి ఆ బ్యాగ్లో బాంబు ఉందని చెప్పారు.
ఇది విన్న ప్రయాణికుడు ఒక్కసారిగా కంగారుపడి సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సెక్యూరిటీ అధికారులు వారిని విచారించి వారు తెచ్చుకున్న బ్యాగును సోదా చేశారు. ఇదంతా మంగళవారం రాత్రి 11:40 గంటల సమయంలో జరిగింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

అంతే కాకుండా వారు ఎక్కాల్సిన విమానాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఏమీ లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారణంగా విమానం దాదాపు 90 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. కానీ ఇలా బాంబు ఉందని అబద్ధం చెప్పి అందరికీ ఆటంకం కలిగించిన ఈ ఇద్దరు ప్రయాణికులను ఎక్కేందుకు సిబ్బంది అనుమతించలేదు. అధికారులు వారిని అరెస్టు చేశారు.
విమానయాన భద్రతా విభాగం అధికారులు వారిద్దరిపై ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఎందుకిలా చేశారని వారిని ప్రశ్నించారు. అయితే వీరిద్దరూ విహారయాత్ర కోసం గోవాకు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఎయిర్పోర్ట్లో ఇలా మాట్లాడటం ద్వారా ఇలాంటి రిజల్ట్ ఉంటుందని వారు కూడా ఊహించి ఉండరు.

అయితే ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు విమానాశ్రయం లోపల ఉన్న వారు కొన్ని మాటలు మాట్లాడకూడదని గుర్తుంచుకోవాలి. కొన్ని అభ్యంతరకర పదాలు మాట్లాడితే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ లోపల ఉన్నప్పుడు గన్, బాంబ్, టెర్రరిస్ట్ అనే మూడు పదాలను ఉపయోగించకూడదు. ఇలాంటి పదాలను కేవలం విమానాశ్రయ భద్రతా సిబ్బంది మాత్రమే వాడాలి.
ఎయిర్పోర్ట్, ఫ్లైట్లో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు తెలిసీ, తెలియక మాట్లాడినా భద్రతా అధికారులు వారిపై చర్యలు తీసుకుంటారు. ప్రయాణికుల భద్రత, విమానాశ్రయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే వారిని అదుపులోకి తీసుకుని పీఎస్లో అప్పగిస్తారు. వారి గురించి పూర్తిగా విచారిస్తారు.

ఇలాంటి పదాలను మాట్లాడి ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తే వారిని ఫ్లైట్లోకి కూడా అనుమతించరు. భద్రతా కారణాల దృష్ట్యా వాటిని నిలిపివేసి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, భద్రతా అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే విమానాన్ని టేకాఫ్కు అనుమతిస్తారు. ఇదంతా చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. అందుకే ఇలాంటి తప్పుడు సమాచారంతో ఆందోళనకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు.
ఈ ప్రత్యేక సంఘటనలో, గోవా విమానాశ్రయం పోలీసులు ఐపీసీ చట్టం 55 ప్రకారం బహిరంగ ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించినందుకు తమ బ్యాగ్లో బాంబు ఉందని చెప్పిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దీని ప్రకారం వీరు కోర్టులో హాజరై దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
సాధారణంగా విమానాశ్రయాలు అధిక భద్రతా పర్యవేక్షణ ఉన్న ప్రాంతాలు. ఇక్కడ భారీ బందోబస్తు డ్యూటీలో భాగంగా పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. అందుకే అధికారులు చిన్న విషయానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఇక్కడ ప్రయాణికులు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. దీని ద్వారా భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








