2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్.. దేశంలోనే సంచలన నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని క్యాబినెట్ సోమవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సరికొత్త ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026కు క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సరికొత్త పాలసీ ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రతిపాదనలను తదుపరి ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తరంజీత్ సింగ్ సంధూకు పంపించారు. ఎల్జీ ఆమోదం లభించిన తర్వాత, ఈ విధానం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీ గడువు మార్చి 31, 2030 వరకు ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సరికొత్త పాలసీ ప్రకారం ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.

ముఖ్యంగా రూ.30 లక్షల బడ్జెట్ లోపు ఉండే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే ఎలాంటి రోడ్ టాక్స్ గానీ, రిజిస్ట్రేషన్ ఫీజు గానీ కట్టాల్సిన అవసరం లేదు. దీనితో పాటు మీ దగ్గర ఉన్న పాత బీఎస్-4 (BS-IV) లేదా అంతకంటే పాత ఫోర్-వీలర్ వాహనాలను స్క్రాప్ చేసి, కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే ఏకంగా రూ.1 లక్ష వరకు స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తుంది. అయితే, హైబ్రిడ్ వాహనాలు కొనేవారికి మాత్రం ఈ పాలసీ కింద ఎలాంటి సబ్సిడీలు వర్తించవని, కేవలం జీరో-ఎమిషన్ వాహనాలకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ టూ-వీలర్స్, త్రీ-వీలర్స్ కొనుగోలును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంవత్సరాల వారీగా సబ్సిడీలను డిజైన్ చేసింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (బైకులు, స్కూటర్లు) కొనుగోలు చేసే వారికి మొదటి సంవత్సరంలో రూ.30,000, రెండో సంవత్సరంలో రూ.20,000, మూడో సంవత్సరంలో రూ.10,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది.

అదేవిధంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (ఆటోలు) పై మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.30,000 చొప్పున రాయితీ ఇస్తారు. సరుకు రవాణా చేసే ఎన్1 (N1) కేటగిరీ ఎలక్ట్రిక్ ట్రక్కులను కొనుగోలు చేసే వారికి కూడా రూ.1 లక్ష వరకు భారీ ఇన్సెంటివ్ అందజేస్తారు. గ్రామీణ సేవా వాహనాలకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది.
ఈ పాలసీలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యంత కీలకమైన మైలురాళ్లను నిర్దేశించుకుంది. దీని ప్రకారం జనవరి 1, 2027 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది. కొత్త పెట్రోల్ లేదా సీఎన్జీ ఆటోలను అనుమతించరు. అంతేకాకుండా, ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ (CNG) టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లను దశలవారీగా పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ తేదీ తర్వాత కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ఇన్సెంటివ్స్ పొందడానికి ఎలాంటి వాహనాల సంఖ్య పరిమితి లేదని సీఎం తెలిపారు.

ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా మార్చే ఈ మహా యజ్ఞం కోసం రాబోయే నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడులు, ప్రయోజనాలను అంచనా వేస్తోంది. ఈ మొత్తం బడ్జెట్లో దాదాపు రూ.7,000 కోట్లను కేవలం కస్టమర్లకు ఇన్సెంటివ్లు, సబ్సిడీలు ఇవ్వడానికే ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.8,000 కోట్ల నిధులను నగరవ్యాప్తంగా సరికొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాక్స్ మినహాయింపుల కోసం కేటాయించారు.
వాహనదారుల సౌకర్యార్థం నగరవ్యాప్తంగా ఏకంగా 32,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఇప్పటికే స్థలాలను కూడా సేకరించారు. సబ్సిడీల దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను కూడా తీసుకురానున్నారు.
దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు రెండింతలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య ఏకంగా 5 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా.
గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ కార్ల సగటు నెలవారీ అమ్మకాలు కూడా 40% పెరిగి.. ప్రతి నెలా సుమారు 26,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. గత మూడు నెలల డేటా ప్రకారం.. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహనాలలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 6.1%కి పెరగడం విశేషం.


Click it and Unblock the Notifications