Swiggy, Zomato, Uber & Ola ఎలక్ట్రిక్ వాహనాలే వాడాలి.. ఎందుకంటే?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత కొంత కాలంగా రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికోసం చాలా వరకు సబ్సిడీలను కూడా అందిస్తున్నాయి.

అయితే ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం దేశంలోని ఈ-కామర్స్ కంపెనీలు, ఫుడ్ డెలివరీ సర్వీస్ మరియు క్యాబ్ సర్వీస్ వంటి కంపెనీలు కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని విజ్ఞప్తి చేసింది. దీనితో పాటు, సర్వీసుల వాహనాలకు వారి వెహికల్ పొల్యూషన్-అండర్-చెక్ (పియుసి) సర్టిఫికేట్ అందించిన తర్వాతే పెట్రోల్ పంపుల వద్ద ఇంధనం అందించాలని ప్రభుత్వం ఆదేశించబోతోంది. వాహనాలకు పీయూసీ లేకపోతే ఇంధనం అందించే అవకాశం ఉండదు. కావున వాహన వినియోగదారులు తప్పకుండా దీనిని గుర్తించాలి.

నివేదికల ప్రకారం, భారత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో వాహనదారుల వాటా దాదాపు 38 శాతం వరకు ఉంది. ప్రస్తుత వాహన కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి ప్రభుత్వం రెండు పెద్ద చర్యలు తీసుకోబోతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలో జొమాటో, స్విగ్గీ, ఓలా మరియు ఉబర్ మొదలైన అన్ని అగ్రిగేటర్లను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారమని ప్రభుత్వం ఆదేశిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన వాహనాల్లో ఈ సర్వీసులకు సంబంధించిన వాహనాలు దాదాపు 30 శాతం వరకు ఉన్నాయని సంబంధిత అధికారి తెలిపారు.

అంతే కాకూండా పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని డీలర్లు మరియు పెట్రోల్ పంపులను ఆదేశించాలని కూడా వారు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణ (రక్షణ) చట్టం కింద సూచనలు ఈ వారంలో జారీ చేయబడే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న జొమాటో, స్విగ్గీ, ఓలా మరియు ఉబర్ మొదలైన అన్ని అగ్రిగేటర్లను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారటానికి ఏదైనా గడువు అందించే అవకాశం ఉంటుందా.. అంటే, ఇది దశల వారీగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుంది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2020 ఆగష్టు నెలలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం 2024 నాటికి మొత్తం వాహన విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలోని పెద్ద ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్ మరియు ఫెడెక్స్ వంటివి 2030 మరియు 2040 నాటికి తమ డెలివరీ వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి కృషి చేస్తున్నాయి. మరోవైపు DHL తన వాహనాల కోసం 60 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని నిర్దేశించింది.

2021 అక్టోబర్లో ఢిల్లీ ప్రభుత్వం PUC సర్టిఫికేట్లను తనిఖీ చేయడానికి భారీ డ్రైవ్ను ప్రారంభించింది. దీనికోసం పెట్రోల్ పంపుల వద్ద సుమారు 500 బృందాలను మోహరించింది. మోటారు వాహనాల చట్టం, 1993 లోని సెక్షన్ 190(2) ప్రకారం, చెల్లుబాటు అయ్యే PUC లేని వాహన యజమానులకు రూ. 10,000 వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయి. కావున తప్పకుండా వాహన వినియోగదారులు తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి, లేకుంటే కఠిన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగానే వాహన వినియోగదారులు తమ వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో టెస్ట్ చేసుకోవాలి. నగరంలో పెట్రోల్ పంపులు మరియు వర్క్షాప్ల వద్ద దాదాపు 1,000 అధీకృత పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి.

అదేవిధంగా ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ కఠినమైన చర్య తీసుకుంటోంది. కావున డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తరువాత వాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కూడా అందించే అవకాశం లేదు. కావున మీరు అటువంటి వాహనాలను ఎక్కడా ఉపయోగించడానికి అవకాశం లేదు.

ఇప్పటికే ఢిల్లీ రవాణా శాఖ 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిండిన డీజిల్ వాహనాలకు ఎలాంటి ఎన్ఓసీ జారీ చేయబోమని స్పష్టం చేసింది. అంతే కాకూండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఢిల్లీ-NCR లో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్ మరియు నడపకుండా నిషేధించడానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications








