ఫ్లైఓవర్పై రాష్ట్ర డిప్యూటీ సీఎం బైక్ రైడ్.. సినిమా హీరోలా వింటేజ్ బైక్తో హల్చల్..
బెంగళూరు నగరాన్ని దేశంలోని ఐటీ హబ్గా, స్టార్టప్ల రాజధానిగా ప్రపంచం గుర్తించింది. ఈ గుర్తింపు పొందినప్పటి నుండి నగర జనాభా ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఉద్యోగార్థులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఈ నగరంలోకి అడుగుపెడుతున్నారు. ఫలితంగా మౌళిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రవాణా వ్యవస్థపై ఈ ఒత్తిడి అత్యధికంగా కనిపిస్తోంది. ఉదయం ఉద్యోగాలకు వెళ్ళే సమయం, సాయంత్రం తిరిగి వచ్చే సమయం .. ఈ రెండు పీక్ అవర్స్లో నగరమంతా వాహనాల రద్దీతో నిండిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగిపోవడం, ఒక్కో కిలోమీటర్ కదలడానికి అరగంట వేచిచూడడం, అత్యవసర పనులకీ సమయానికి చేరుకోలేక ఇబ్బంది పడడం, ఇవన్నీ బెంగళూరు జీవనశైలిలో భాగమైపోయాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హెబ్బల్ ప్రాంతం ఈ సమస్యకు ప్రధాన కేంద్రంగా మారింది. నగరంలోని ఉత్తర భాగాన్ని విమానాశ్రయానికి కలుపుతూ, పలు ముఖ్యమైన రహదారులను కలుపుతూ ఉండే హెబ్బల్ జంక్షన్ ఎప్పుడూ వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఇక్కడి ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కొంతకాలంగా ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్గా నిలిచింది. ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా హెబ్బల్ ప్రాంతంలో ఒక కొత్త ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది.

ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఆగస్టు 18న అధికారికంగా ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రివర్గ సహచరులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వందలాది మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఫ్లైఓవర్ ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని 30 శాతం తగ్గిస్తుందని అన్నారు.
హెబ్బల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం బెంగళూరులో ఒక వేడుక వాతావరణాన్ని సృష్టించింది. నగర ట్రాఫిక్ సమస్యలకు కొంత ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆనందపడుతుండగా, ఈ వేడుకలో ఒక విశేషం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్వయంగా బైక్పై ఎక్కి ఫ్లైఓవర్ను తొలిసారి దాటుతూ ఆనందం వ్యక్తం చేశారు. బైక్ నడుపుతున్న ఉప ముఖ్యమంత్రిని చూసిన ప్రజలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టి స్వాగతించారు.

ఈ సంఘటన అక్కడి ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగించింది. రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా, ఒక బైక్ ప్రియుడిగా ఆయనలోని వైఖరిని బయటపెట్టిన ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. డి.కె. శివకుమార్కు బైక్లంటే చిన్నప్పటి నుంచే ఇష్టం. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న పాత యెజ్డి రోడ్కింగ్ 250 బైక్కు ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ బైక్ను ఆయన తన కళాశాల రోజుల్లో కొనుగోలు చేశారు.
ఆ రోజుల్లో యువతలో అత్యంత పాపులర్గా ఉన్న ఈ యెజ్డి బైక్ ఆయనకు గర్వకారణమైంది. కానీ కాలక్రమేణా బాధ్యతలు, రాజకీయ జీవితం పెరిగేకొద్దీ ఆ బైక్ ఆయన నివాసంలో వాడకుండా నిలిచి పోయింది. అయినా కూడా ఆయన దానిని అమ్మకుండా దాచుకున్నారు. అయితే ఇటీవలే డి.కె. శివకుమార్ తన యెజ్డి రోడ్కింగ్ 250 బైక్ను పునరుద్ధరించారు. హెబ్బల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో, ఆయన తన యెజ్డి రోడ్కింగ్ 250పై స్వయంగా ప్రయాణించారు.
ఆ క్షణం చూసిన వారందరికీ ప్రత్యేక అనుభూతి కలిగింది. ముఖ్యంగా ఆయన నిబంధనలకు అనుగుణంగా హెల్మెట్ ధరించి బైక్ నడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బైక్ గురించి చూసినట్లయితే దీనిలో 250cc 2-స్ట్రోక్ ఇంజిన్ అమర్చబడి ఉంది. గరిష్టంగా 18 bhp శక్తిని, 24 Nm టార్క్ను అందించేలా ట్యూన్ చేయబడింది.ఇంజిన్కు 4-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ జత చేయబడింది.


Click it and Unblock the Notifications








