ఒక వైపు అమ్మగా మరోవైపు రేసర్గా.. ఫెరారీ రేసింగ్లో చరిత్ర సృష్టించడానికి సిద్ధమైన భారతీయ మహిళ
భారతీయ మోటార్స్పోర్ట్ ప్రపంచానికి ఇది ఒక చారిత్రాత్మక క్షణం. మహారాష్ట్రలోని పూణేకు చెందిన డయానా పుండోల్ ఇప్పుడు దేశానికి గర్వకారణమైన పేరుగా నిలిచింది. 32 ఏళ్ల వయస్సులో, ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న ఆమె, అంతర్జాతీయ స్థాయిలో ఫెరారీ రేసింగ్ సిరీస్లో పోటీ పడుతున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. డయానా ఈ నవంబర్ 2025 నుండి ఏప్రిల్ 2026 వరకు జరగబోయే ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ సిరీస్లో తన ప్రతిభను ప్రదర్శించనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఛాలెంజ్ దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల ఫార్ములా వన్ సర్క్యూట్లలో జరుగుతుంది. అక్కడ ఆమె ఫెరారీ 296 ఛాలెంజ్ కారును నడిపి భారత జెండాను ఎగురవేయబోతోంది.
ఈ ఘనత భారతీయ మోటార్స్పోర్ట్కు మాత్రమే కాదు, రేసింగ్ ట్రాక్లోకి అడుగుపెట్టే ప్రతి మహిళకు ప్రేరణగా నిలుస్తుంది. డయానా రేసింగ్లోకి అడుగుపెట్టిన ప్రయాణం కూడా అంతే ప్రేరణాత్మకం. 2018లో JK టైర్ ఉమెన్ ఇన్ మోటార్స్పోర్ట్ ప్రోగ్రామ్ కింద ఆమె తన రేసింగ్ కెరీర్ను ప్రారంభించింది. ఆరంభం చిన్నదే అయినా, ఆమె చూపిన పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఆమెను పెద్ద విజయాల దిశగా నడిపించాయి.

తదుపరి కాలంలో ఆమె ఇండియన్ టూరింగ్ కార్స్, ఫోక్స్వ్యాగన్ పోలో కప్ వంటి దేశీయ సర్క్యూట్లలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందింది. అయితే, ఆమె కెరీర్లో మలుపుతిప్పిన ఘట్టం 2024లో మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగిన MRF సెలూన్ కార్స్ నేషనల్ ఛాంపియన్షిప్. ఆ రేసులో విజయం సాధించడం ద్వారా ఆమె జాతీయ రేసింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్రలో తన పేరును నిలిపింది.
ఇప్పుడు ఆమె అడుగులు అంతర్జాతీయ ఫెరారీ రేసింగ్ సిరీస్ వైపుకు దూసుకెళ్తున్నాయి. ఒక భారతీయ మహిళ, అది కూడా ఇద్దరు పిల్లల తల్లి, ప్రపంచ స్థాయి ఫెరారీ ట్రాక్లలో రేస్ కార్ను నడపడం.. ఇది భారత మహిళల ధైర్యం, పట్టుదలకు ప్రతీక. డయానా పుండోల్ విజయం ప్రతి భారతీయ మహిళకు ఒక స్ఫూర్తి. మోటార్స్పోర్ట్ అనే పురుష ఆధిక్య రంగంలో ఆమె ప్రతిభ, భారతీయ మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించింది.

ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ వంటి హై-ప్రొఫైల్ సిరీస్లో పాల్గొనడం అంత తేలికైన విషయం కాదు. ఇందులో డయానా నడిపే రేస్ కారు.. Ferrari 296 Challenge సాంకేతిక అద్భుతం. ఇది Ferrari 296 GTB ఆధారంగా తయారైన ట్రాక్-ఫోకస్డ్ రేస్ కార్, ఇందులో ట్విన్-టర్బో V6 ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ గంటకు 250 కి.మీ కంటే ఎక్కువ టాప్ స్పీడ్ను అందుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
ఫెరారీ 296 ఛాలెంజ్ బాడీ డిజైన్ పూర్తిగా ఏరోడైనమిక్ ట్యూనింగ్తో రూపొందించబడింది, అంటే వేగంతో పాటు డౌన్ఫోర్స్, కంట్రోల్ మధ్య సమతౌల్యం సాధించేలా అభివృద్ధి చేశారు. ప్రతి సెషన్లో డ్రైవర్ పనితీరును అంచనా వేసేందుకు అధికారిక ఫెరారీ ఇంజనీరింగ్ బృందం ఉపయోగించే డేటా లాగింగ్ సిస్టమ్లు, టెలిమెట్రీ టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ సాంకేతిక వ్యవస్థలు ప్రతి మిల్లిసెకండ్లో డ్రైవర్ ప్రతిస్పందనను పరిశీలించి, రేసింగ్ పనితీరును మెరుగుపరచేందుకు సహాయపడతాయి.

పూణే నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రపంచ ఫెరారీ రేసింగ్ సర్క్యూట్ల వరకు చేరింది, ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు, భారతీయ మహిళల సామర్థ్యానికి సాక్ష్యం. భారతదేశం నుంచి ఫెరారీ రేస్ ట్రాక్ల వరకు ప్రయాణం చేసిన డయానా పుండోల్ ఇప్పుడు కొత్త తరం మహిళా రేసర్లకు మార్గదర్శకురాలు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని, భారతీయ మహిళల గర్వాన్ని ప్రపంచ వేదికపై మరింతగా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.


Click it and Unblock the Notifications








