నవంబర్లో భారీగా తగ్గిన డీజిల్ సేల్స్.. అసలు కారణం ఇదే.!!
భారత్లో డీజిల్(Diesel Sales) అమ్మకాలపై పండుగల సీజన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లుగా తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా సెలవు దినాలు ఎక్కువగా ఉండటంతో సరుకు రవాణా వాహనాలు ఎక్కువగా తిరగకపోవడంతో డీజిల్ అమ్మకాలు తగ్గినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.
దేశీయ రవాణా వ్యవస్థలో ఇంధన విక్రయాలు చాలా కీలకమైనవి. దేశ ఆర్థిక వృద్ధిలో ఫ్యూయెల్ సేల్స్ ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఇందులో భాగంగా ప్రతినెలా దేశంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎంత నమోదు అవుతున్నాయో లెక్కించడం ఆనవాయితీ.. కాగా ఈ ఏడాది నవంబర్లో డీజిల్ విక్రయాల శాతం 7.5 శాతం తగ్గినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గతేడాది నవంబర్లో డీజిల్ విక్రయాలు 7.33 మిలియన్ టన్నులు నమోదు కాగా.. ఈ ఏడాది నవంబర్లో 6.78 మిలియన్ టన్నుల డీజిల్ను విక్రయించారు. ఈ గణాంకాల ప్రకారం గతేడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో 7.5 శాతం క్షీణించింది.
అయితే ఈ క్షీణతకు కారణం.. ఈ సారి నవంబర్ మధ్యలో దీపావళి పండుగ రావడంతో చాలా మంది ట్రక్కు డ్రైవర్లు పండుగ సెలవులు తీసుకున్నారు. దీంతో చాలా వరకు కార్గో వాహనాలు నడవలేదు. ఈ క్రమంలో డీజిల్కు డిమాండ్కు తగ్గడంతో ఒక్కసారి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.

కాగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఇంధనం డీజిల్. పెట్రోలియం ఉత్పత్తుల్లో 40% వాటాను డీజిల్ కలిగి ఉంది. ఇందులో 70 శాతం గూడ్స్ వాహనాలకు సంబంధించినవే.. ఒకవైపు డీజిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టగా, మరోవైపు పెట్రోల్ అమ్మకాలు పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు 7.5 శాతం పెరిగి 2.86 మిలియన్ టన్నులకు చేరుకుంది.
అంతేకాకుండా గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్ ప్రారంభంలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం పడిపోయింది. అక్టోబర్ డీజిల్ అమ్మకాలతో పోలిస్తే నవంబర్ డీజిల్ అమ్మకాలు 3.6 శాతం పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కాగా, వర్షాకాలంలో వ్యవసాయ రంగంలో డీజిల్కు డిమాండ్ తక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో చాలా మంది వ్యవసాయానికి వాహనాలను ఉపయోగించరు. కాబట్టి డీజిల్ అవసరం ఉండదు. డీజిల్ డిమాండ్ తగ్గడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. సాధారణంగా వేసవి కాలంలో భారత్లో ఫ్యూయెల్ సేల్స్ ఎక్కువగా నమోదవుతాయి. ప్యాసింజర్ కార్లలో ఎక్కువగా AC ఉపయోగిస్తారు కాబట్టి.. ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాగా ప్రస్తుతం డీజిల్ అమ్మకాలు తగ్గడం తాత్కాలికమే అని చెప్పవచ్చు.
ఈ ఏడాది నవంబర్లో జెట్ ఇంధన విక్రయాలు 6.1 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 6.20 లక్షల టన్నుల ఫ్యూయెల్ను విక్రయించారు. కానీ నవంబర్ 2019 నాటి కరోనాకు ముందు కాలంతో పోలిస్తే, అమ్మకాలు 7.5% తక్కువగా నమోదయ్యాయి. కరోనా తర్వాత చాలా విమానయాన సంస్థలు తమ సేవలను ప్రారంభించకపోవడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
కాగా 2021 నవంబర్లో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక అమ్మకాలను పోల్చి చూస్తే, అమ్మకాలు 31.6 శాతం పెరిగాయి. అనేక విమానయాన సంస్థలు కొత్త విమానాలను ప్రారంభించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో గత అక్టోబర్ అమ్మకాలతో పోలిస్తే నవంబర్లో విమాన ఇంధన విక్రయాలు 1.4 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అదేవిధంగా వంటగ్యాస్ విక్రయాల్లోనూ 0.9 శాతం క్షీణత నమోదైంది. గత నవంబర్లోనే 2.57 మిలియన్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ అమ్ముడుపోయింది. దేశంలో ఇంధన విక్రయాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. నవంబర్ విక్రయాల్లో డీజిల్ అమ్మకాలు తగ్గిినా.. పెట్రోల్ అమ్మకాలపై మాత్రం పండుగ సీజన్ ప్రభావం చూపించలేదు.


Click it and Unblock the Notifications








