కారు కడిగితే రూ. 5000 ఫైన్.. ఇదెక్కడి గోల అనుకుంటున్నారా.?? అసలు విషయం ఇదే.!!
ఎండాకాలం సమీపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీటి ఎద్డడి ఏర్పడుతోంది. అందుకు అనుగుణంగా అధికారులు నీటి సరఫరా తగిన విధంగా ఉండేలా పొదుపు పాటిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో మాత్రం వాహనదారులకు నీటి సరఫరా అధికారులు గట్టి షాక్నే ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసులు నీటి కష్టాలను(Water Supply In Bengaluru) ఎదుర్కొంటున్నారు. అసలైన వేసవి ప్రారంభం కాకముందే.. భానుడు ప్రతాపం చూపిస్తుండగా.. బెంగళూరులో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అనవసరంగా నీటిని వినియోగిస్తే జరిమానా విధిస్తామని బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు(BWSSB) హెచ్చరికలు జారీ చేసింది.

బెంగళూరులో నీటి కొరత దృష్ట్యా ప్రజలు అనవసరంగా నీటిని వృథా చేయొద్దంటూ BWSSB ఆదేశాలు జారీ చేసింది. వాహనాలను కడగడం, నిర్మాణాలు, తోటపనుల వంటి వాటితో పాటు నీటి ఫౌంటెయిన్ల వంటి వినోద ప్రయోజనాల కోసం నగరవాసులు త్రాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ BWSSB ఇటీవల ఒక ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరు నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో.. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు నీటిని వృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని.. నగరవాసులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. జరిమానా కూడా విధించనున్నారు.

మొదటిసారి అనవసరంగా తాగునీటిని వినియోగిస్తే రూ. 5,000 జరిమానా విధిస్తామని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదేపదే తప్పు చేస్తే ఈ జరిమానాకు అదనంగా రూ. 500 విధిస్తామని తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించకుండా.. ప్రజలు తాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని BWSSB అధికారులు విజ్ఞప్తి చేశారు.
బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు జిల్లా యంత్రాంగం నగరంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అర్బన్, రూరల్ జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనం కడగాలంటే ఉప్పునీటిని మాత్రమే వాడాలని సూచించారు.

బెంగళూరులోని చాలా మంది కార్ల యజమానులు మంచి నీళ్లతో తమ వాహనాలను శుభ్రం చేసుకునేవారు. నగరంలో తాగునీరు స్వచ్ఛమైన తాగునీరు కావడంతో చాలా మంది తమ కార్లు, బైక్లు శుభ్రం చేసుకోవడానికి తాగునీటిని మాత్రమే వినియోగిస్తున్నారు. తాగునీటి ద్వారా మాత్రమే వాహనాలు శుభ్రంగా, మెరుస్తూ ఉంటాయి.
అంతేకాకుండా బెంగళూరులోని అన్ని మాల్స్ మరియు సినిమా థియేటర్లలో తాగునీటి అవసరాలకు మాత్రమే తాగు నీరు ఉపయోగించాలని BWSSB సూచించింది. క్లీనింగ్ కోసం వాడవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినా.. ఏమైనా సందేహాలున్నా.. 1916 కాల్ సెంటర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
అయితే BWSSB ఆదేశాలతో బెంగళూరులో ట్యాంకర్ లారీల ద్వారా సరఫరా చేసే నీటి ధర భారీగా పెరిగింది. గతంలో 6000 లీటర్ల ట్రక్కులో తాగునీరు కావాలంటే రూ.450 నుంచి 600 వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు దాని ధర 2000 నుండి 3000 రూపాయల వరకు పెరిగింది. దీంతో బెంగళూరు వాసులు షాక్కు గురవుతున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








