Push Ups on Moving Car కదులుతున్న కారుపై పుషప్లు.. జరిమానా విధించి ఝలక్ ఇచ్చిన పోలీసులు
బాడీ ఫిట్నెస్ కోసం చాలా మంది ఇంట్లో లేదా జిమ్లో పుషప్స్ చేస్తుంటారు. ఇంకాస్త ప్రశాంతంగా కావాలనుకుంటే పార్కులోనూ చేయవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇటీవల కొందరు యువకులు రహదారిపై అదీ కారుపై పుషప్స్ చేస్తూ పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఓవర్ నైట్ ఫేమస్ అవ్వడం కోసం ముఖ్యంగా యూత్ చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అంతే కాకుండా వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్పై విన్యాసాలు చేస్తూ కొందరు పోలీసులకు చిక్కితే.. మరికొందరు కారుపై పుషప్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

హరియాణా రాజధాని గురుగ్రామ్లో కొందరు యువకులు మద్యం సేవించి కారు నడపడమే కాకుండా విచిత్రకరమైన విన్యాసాలు చేశారు. మారుతి సుజుకి ఆల్టో కారుపై కూర్చుని మద్యం సేవిస్తూ ప్రమాదకరంగా ప్రయాణించడమే కాకుండా కారు డోర్లకు వేలాడుతూ కనిపించారు. కారులోని మరో యువకుడు పైకి ఎక్కి పుషప్లు చేశాడు. స్నేహితులు వద్దని వారించకుండా అతడిని ప్రోత్సహించారు.
పుషప్లే కాకుండా డ్యాన్స్ చేస్తూ పిచ్చి చేష్టలకు పాల్పడ్డారు. ఈ సన్నివేశాన్ని వీడియో తీసిన ఇతర వాహనదారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గంటల్లోనే ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

విషయం హరియాణా పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగి యువకులను గుర్తించారు. వారికి రూ. 6500 జరిమానా విధించారు. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ' ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మీ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.
రెండు నెలల క్రితం, షాహిద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'లోని సన్నివేశాన్ని అనుకరిస్తూ, కారు బూటులోంచి కరెన్సీ నోట్లను విసిరినందుకు గురుగ్రామ్లో యూట్యూబర్తో పాటు అతని ముగ్గురు సహచరులను అరెస్టు చేశారు. యూట్యూబర్ గోల్ఫ్ కోర్స్ రోడ్ అండర్పాస్లో కదులుతున్న కారులో నుంచి కరెన్సీ నోట్లను విసరమని తన భాగస్వామికి చెబుతాడు. రెండో వ్యక్తి కారు బూట్ నుంచి నకిలీ కరెన్సీ నోట్లను విసిరాడు.

కాగా ఇటీవల యూపీలో సైతం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు కారు వేగంతో ఉన్నప్పుడు స్టీరింగ్ వదిలేసి ఇలాగే కారు పైకి ఎక్కి పుషప్లు చేశాడు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతనికి జరిమానా విధించారు. పోలీసులు హెచ్చరిస్తూ వీడియో విడుదల చేయడంతో సదరు యువకుడు ఇంకెప్పుడూ ఇలా చేయనని హామీ ఇచ్చాడు.
కానీ ఇలాంటి ఘటనల్లో పోలీసులు హెచ్చరిస్తూ జరిమానాలు విధించినా తీరు మాత్రం మారడం లేదు. తాజాగా కర్ణాటక ఉడిపిలో కూడా యువకులు హైవేపై నిర్లక్ష్యంగా కార్లు నడుపుతూ హల్చల్ సృష్టించారు. డివైడర్పైకి ఎక్కి నడుపుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో రద్దీగా ఉండే రోడ్లపై విన్యాసాలు చేయడం నేరమని తెలిసినా.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాటిలో కొన్ని హాస్యం తెప్పించినా మరి కొన్ని భయాందోళన కలిగిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.


Click it and Unblock the Notifications








