మద్యం మత్తులో రైల్వే ట్రాక్పై కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్
విపరీతంగా మద్యం సేవించి నడిరోడ్లపై కొందరు మందుబాబులు హల్చల్ చేయడం చూసుంటాం. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదాలకు గురైన ఘటనలూ చూశాం. తాగుబోతుల తప్పిదాల కారణంగా వారి ప్రాణాలకే కాదు ఇతరులకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఓ ఘటన వైరల్గా మారింది.
మద్యం మత్తులో ఓ డ్రైవర్ తన కారును రైలు పట్టాలపై నడిపిన ఇటీవల చోటుచేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేరళలోని కన్నూర్లో ఈ ఘటన జరిగింది. జూలై 18న మద్యం మత్తులో నగరంలోని తాజీ రైల్వే క్రాసింగ్పై ఓ వ్యక్తి రోడ్డుగా భావించి కారు నడిపాడు. ట్రాక్పై ఉన్న కారు కొన్ని మీటర్లు ప్రయాణించిన తర్వాత ముందుకు కదలడం ఆగిపోయింది.

ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, రైల్వే గేటు కీపర్ కారును రైల్వే ట్రాక్పై చూసి వెంటనే కారును ట్రాక్పై నుంచి సురక్షితంగా పక్కకు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోటారు వాహన చట్టం, రైల్వే చట్టాల ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపిన జయప్రకాష్(49)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఒకవేళ ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో లీటరుకు 0.85 మి.గ్రా ఆల్కహాల్ ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇది చట్టపరంగా అనుమతి ఉన్న పరిమితికి మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. అంతలా డ్రింక్ చేసి రైలు పట్టాలపై కారు డ్రైవ్ చేస్తున్నాడంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.
అనంతరం కారును పోలీసులు సీజ్ చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజే జయప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ఆదమరిచి రైల్వే ట్రాక్పై కారును నడపడం పట్ల నెటిజన్లు విపరీతంగా స్పందించారు.
గత నెలలో కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్ బస్టాండ్ వద్ద ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. యశప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో స్టాండ్లో ఆగి ఉన్న కల్యాణ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టి డివైడర్పైకి ఎక్కి ప్రమాదానికి కారణమయ్యాడు. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
తాజా ఘటనలో మద్యం మత్తులో జయప్రకాశన్ అనే వ్యక్తి రైలు పట్టాలపై కారు నడిపాడు. అయితే స్థానికులు సరైన సమయంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రమించి సురక్షితంగా కారును పక్కకి తరలించారు. సమీపంలోని రైల్వే స్టేషన్కు సమాచారం ఇవ్వడం ద్వారా సమాజం పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు. మద్యం సేవించి వాహనాల నడపడం ఎంత ప్రమాదమో ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది.
దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం, బైక్లపై అతివేగంగా ప్రయాణిస్తూ అసభ్యకర చేష్టలకు పాల్పడటం, సిగ్నల్ జంప్ చేసి ప్రమాదాలకు కారణమవ్వడం లాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీరి వల్ల ఇతర వాహనదారులు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అవి పోలీసుల దృష్టికి వేగంగా చేరుకుంటున్నాయి. దీంతో పోలీసులు తక్షణమే వారికి జరిమానా విధిస్తున్నారు. అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా సైతం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications








