ఇండిగో ఎయిర్లైన్స్ తప్పిదం.. 24 గంటలపాటు ఎయిర్పోర్టులోనే వెయిట్ చేసిన వృద్ధ దంపతులు
ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్(Indigo Airlines) తప్పిదంతో ఓ భారతీయ జంట రోజంతా విమానాశ్రయంలోనే గడపాల్సి వచ్చింది. ఈ ఘటన విమాన ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఇది ఎక్కడ జరిగింది.. 24 గంటల పాటు ఎయిర్పోర్టులోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది.. సిబ్బంది పట్టించుకోలేదా??.. పూర్తి వివరాలు ఈ కథనంలో..
దంపతులు రాజేష్ షా(64), అతని భార్య రష్మిషా రాజేష్ షా(59) బెంగళూరు(Couple waits at Istanbul Airport)లో ఉంటున్నారు. వారి కుమారుడు లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె బెంగళూరులో ఉంటోంది. ఇటీవల ఇద్దరూ లండన్లోని తమ కుమారుడు ఇంటికి వెళ్లారు. అనంతరం ఇండియాలో ఉన్న కుమార్తె వద్దకు రావాలని నిశ్చయించుకుని.. లండన్ నుంచి ముంబయికి టికెట్ బుక్ చేసుకున్నారు.

అయితే నేరుగా లండన్ నుంచి ముంబయికి ఫ్లైట్ లేకపోవడంతో ముందుగా లండన్ నుంచి ఇస్తాంబుల్కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. అక్కడి నుంచి ముంబయికి చేరుకోవడానికి ఇండిగో విమాన టికెట్ కొనుగోలు చేశారు. ప్రయాణం రోజు లండన్లో సురక్షితంగా విమానం ఎక్కి.. ఇస్తాంబుల్లో ల్యాండ్ అయ్యారు.
ఇదిలా ఉండగా రాజేష్ షా హార్ట్ పేషెంట్ కావడంతో ఆయన వీల్ చైర్లోనే ప్రయాణించారు. అతని భార్య కూడా అతనితో పాటే వచ్చింది. ఇస్తాంబుల్లో దిగిన అనంతరం ఎయిర్పోర్టు సిబ్బంది దంపతులకు సహాయం చేసి ఇండిగో బోర్డింగ్ ప్రాంతానికి సేఫ్గా తీసుకువెళ్లారు.

అనంతరం ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు సిబ్బంది వారిని వేచి ఉండమని చెప్పి అక్కడి వెళ్లిపోయారు. అయితే గంటల తరబడి వేచి చూసినా సిబ్బంది నుంచి స్పందన లేదు. రష్మీ షా వెంటనే విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించి ఫ్లైట్ వివరాలను అడిగారు. సిబ్బంది చెప్పిన సమాధానం విని షాక్కు గురయ్యారు.
వారు ఎక్కాల్సిన ముంబయి ఇండిగో ఫ్లైట్ అప్పటికే టేకాఫ్ అయిందని చావు కబురు చల్లగా చెప్పారు. అయితే అప్పటికే బోర్డింగ్ పాస్ తీసుకున్న తమకు.. ఎలాంటి సమాచారం లేకుండా ఫ్లైట్ ఎలా టేకాఫ్ అయిందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎయిర్లైన్స్ సిబ్బంది వచ్చి వారితో చర్చించి.. ఇస్తాంబుల్ నుండి ముంబయికి నేరుగా టిక్కెట్లు ఇస్తామని సమాధానమిచ్చారు.

దీని ప్రకారం మరుసటి రోజు ఇస్తాంబుల్ నుంచి ముంబయికి వెళ్లేందుకు టికెట్ ఇచ్చారు. అయితే మరుసటి రోజు ఫ్లైట్ టైంకి 24 గంటల సమయం ఉంది. దీంతో వారు గత్యంతరం లేక ఎయిర్పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. సిబ్బంది ఇచ్చిన వీల్ఛైర్లోనే ఫుడ్ కనీసం తాగడానికి నీరు కూడా లేకుండా వేచి ఉన్నారు. వయసు పై బడిన వారికి ప్రత్యేక గది ఏర్పాటు చేయలేదు. ఈ ఘటన ఆగస్టు 17న జరిగింది.
ఇస్తాంబుల్లో తాము ఎక్కకుండానే ఫ్లైట్ టేకాఫ్ అవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఎయిర్లైన్స్ సిబ్బంది చెబుతున్నారని దంపతులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇండియాలో ఉన్న తమ కూతురు రిచా భారత్లోని ఇండిగో ఎయిర్లైన్స్ని సంప్రదించి సహాయం కోరిందని, అప్పుడే ఇస్తాంబుల్లో తమకు ఫ్లైట్ దొరికిందని వెల్లడించారు.

సాధారణంగా విమాన ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎయిర్లైన్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటారు. అందుకే చాలా మంది వృద్ధులను నిర్భయంగా విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఈ సంఘటన తర్వాత చాలా మంది షాక్ అవుతున్నారు.
ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో వేచి ఉన్న ఈ దంపతులు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించలేరు. దీంతో వారు అటు ముంబయికి వెళ్లలేక అటు దేశంలోకి వెళ్లలేక రాత్రంతా విమానాశ్రయంలోనే గడిపారు. ఇండిగో వివరణ ప్రకారం, విమానాశ్రయ సిబ్బంది పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని చెబుతున్నారు. అయితే ఇస్తాంబుల్లోని ఇండిగో స్టాఫ్ వారికి క్షమాపణలు చెప్పి వారు సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసిందని సమాధానమిచ్చారు.


Click it and Unblock the Notifications








