2026 నాటికి భారత్లో ‘ఎగిరే కారు'.. గంటన్నర జర్నీ కేవలం 7 నిమిషాల్లోనే చేసేయొచ్చు.!!
భారత్లో త్వరలో ఎయిర్ ట్యాక్సీ(Air Taxi Service)లు రాబోతున్నాయి. ర్యాపిడో, ఉబర్, ఓలా అందించే ట్యాక్సీ సర్వీసుల మాదిరిగా ప్రజలకు సేవలందించేందుకు కొత్తగా గాల్లో ఎగిరే ట్యాక్సీలు రాబోతున్నాయి. అంటే దీని ద్వారా మీరు ఎంచక్కా గాల్లో ప్రయాణిస్తూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అయితే ఇది ఎలా అని ఆలోచిస్తున్నారా.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత్లో ఎయిర్ ట్యాక్సీ సర్వీసును ప్రవేశపెట్టేందుకు ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్(Interglobe Enterprises), ఆర్చర్(Archer Aviation) ఏవిషేషన్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు 2026 నాటికి భారత్లో ఎగిరే ట్యాక్సీ(ఎగిరే కారు) సర్వీసును ప్రారంభించాలని రెండు కంపెనీలు నిర్ణయించుకున్నారు. అయితే మొదటగా ఈ సర్వీసు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి గుర్గావ్ వరకు ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా కేవలం ఏడే నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ ఏ మేరకు ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇలా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం కన్నాట్ నుంచి గుర్గావ్ వరకు 27 కి.మీ దూరాన్ని రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వాహనదారులు, ప్రయాణికులకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. ఈ మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి MOU పై గురువారం(నవంబర్ 9) నాడు రెండు సంస్థలు సంతకాలు చేశాయి.

ఈ కార్యక్రమంలో ఇంటర్గ్లోబ్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా, ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయల్ పాల్గొన్నారు. భారత్లో ఎయిర్ ట్యాక్సీని తీసుకువచ్చేందుకు ఈ రెండు సంస్థలు నిర్ణయం తీసుకోగా.. ఈ మేరకు రెండు కంపెనీలు ప్రభుత్వం నుంచి అనుమతి కోరనున్నాయి. ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లయితే 2026 నాటికి ఢిల్లీలో ఎయిర్ ట్యాక్సీలను చూడవచ్చు.
కాగా ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్లో ఇండిగో ఓ భాగంగా ఉంది. ఇండిగో దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ. కాగా ఆర్చర్ సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాలు, విమానాలను అద్దెకు ఇస్తోంది. అయితే సాధారణంగా ఈ ఎయిర్ ట్యాక్సీలను మెట్రో నగరాల్లోనే కాకుండా వివిధ కమర్షియల్ సేవల్లో కూడా ఉపయోగించాలని కంపెనీలు భావిస్తున్నాయి.

కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఎయిర్ ట్యాక్సీలు(ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్లు) పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రైవేట్ సంస్థలకు కూడా వీటిని అద్దెకు ఇవ్వాలని కంపెనీలు యోచిస్తున్నాయి. కాగా ఎయిర్ ట్యాక్సీ సేవల కోసం 200 ఆర్చర్ మిడ్నైట్ విమానాలను కొనుగోలు చేయబోతున్నారని తెలుస్తోంది.
ఒక్కో విమానంలో ఒకేసారి నలుగురు ప్రయాణించేలా.. వేగంగా ఛార్జ్ అయ్యేలా రూపొందించున్నారు. ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఎండీ రాహుల్ భాటియా దీనిపై మాట్లాడుతూ.. భారతీయులకు అతి తక్కువ బడ్జెట్లో మెరుగైన సేవలందిస్తున్నట్లు చెప్పారు. రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య పెరుగుతుండటంతో తాము తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ సేవలు పరిష్కారాన్ని అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో టెక్నాలజీ ద్వారా ఆటో రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ట్యాక్సీ.. అంటే ఈ ఎగిరే కారు అమల్లోకి వస్తే నిజంగా మరో విప్లవాత్మకమైన మార్పు అనే చెప్పవచ్చు. ఈ ఎయిర్ టాక్సీలు హెలికాప్టర్లు లేదా విమానాల కంటే తక్కువ సౌండ్ను జనరేట్ చేస్తాయట. గరిష్ఠంగా గంటకు 200 మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 మైళ్ల వరకు ప్రయాణిస్తుందట.


Click it and Unblock the Notifications








