Maruti Suzuki Flying Cars భారత్కు ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్.. ఇంటిపైనే ల్యాండింగ్.!!
భారత్లో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన మాతృ సంస్థ 'సుజుకీ'(Suzuki Motors)తో కలిసి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు- ఎగిరే కార్ల(Flying Cars)ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. త్వరలోనే ఈ ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఈ మినీ ఎయిర్ కాప్టర్ల ద్వారా ట్రాఫిక్ రద్దీ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
భారత్లోని ప్రధాన నగరాల్లో ప్రజలను నిరంతరం వేధించే సమస్య ట్రాఫిక్.. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వాలు సైతం అనేక చర్యలు చేపడుతున్నాయి. అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు, మెట్రోలు ఇలా అనేక రకాలుగా రవాణా వ్యవస్థను విస్తరిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు.

కానీ ఇంతటి ట్రాఫిక్ ఉన్న రోడ్లపై కొంచెం ఎత్తులో గాల్లో విహరిస్తూ వెళ్తుంటే ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. కిక్కిరిసిపోయే ట్రాఫిక్ను(Electrifying Flying Cars) దాటేస్తూ నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ కల తొందరలోనే నెరవేరనుంది. ఎందుకంటే ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో ఎగిరే కార్లు.. చిన్న హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకురానుంది.
సుజుకీ తయారు చేయనున్న ఈ ఎయిర్ కాప్టర్లు డ్రోన్(Drones)ల కంటే పెద్దవిగా.. హెలికాప్టర్లతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. ఈ ఎగిరే కార్లలో పైలట్ సహా ముగ్గురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన ట్రాఫిక్లో సైతం ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన నిర్దేశిత గమ్యస్థానానికి చేరుకునేందుకు ఇవి దోహదపడనున్నాయని సమాచారం.

కాగా సుజుకి మొదటగా ఈ ఎగిరే కార్లను(Electric Aircopters) జపాన్ మరియు యుఎస్లలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత భవిష్యత్తులో భారత్లో అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరితగతిన ఈ ఎగిరే కార్ల కార్యకలాపాలు అందుబాటులోకి వస్తే.. ప్రపంచ రవాణా వ్యవస్థలోనే ఇదో పెద్ద విప్లవం కానుంది.
ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో ఈ ఎయిర్ కాప్టర్లను ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకి కూడా భారీగా ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎగిరే కార్లను స్థానికంగానే తయారు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వీటిని తయారు చేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)తో కూడా చర్చలు జరుగుతున్నాయని సుజుకీ మోటార్ అధికారులు వెల్లడించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

కాగా ఈ ఎగిరే కార్లకు SkyDrive అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను 2025 జపాన్లో జరిగే ఒసాకా ఎక్స్పోలో విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. భవిష్యత్తులో 'మేక్ ఇన్ ఇండియా' కింద ఈ స్కైడ్రైవ్లను భారత్కు పరిచయం చేయాలని మారుతీ సుజుకి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారత్లో ఈ ఎగిరే కార్లకు మంచి స్పందన ఉంటుందా లేదా అనేది కూడా సంస్థ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
ఇక భారత్లో ఈ ఎగిరే కార్లకు మంచి డిమాండ్ ఉండాలంటే.. అవి సరసమైన ధరలో అందుబాటులో ఉండాలి. ఈ మేరకు సుజుకి మోటార్స్ కూడా అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. అందుకు సాధ్యాసాధ్యాలపై పరిశీలనలు చేస్తోంది. కాగా ఈ ఎయిర్ కాప్టర్ టేకాఫ్ సమయంలో 1.4 టన్నుల బరువు ఉంటుందట.
ఇది హెలికాప్టర్ బరువులో సగం కాగా.. బహుళ అంతస్థుల భవనం పైభాగంలో ఎయిర్ కాప్టర్లను ల్యాండ్ చేసే విధంగా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఈ ఎయిర్ కాప్టర్ వాడకం భారతదేశంలోని పట్టణ నగరాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణె, ఢిల్లీ మరియు కోల్కతా వంటి పెద్ద నగరాల్లో మొదటి దశలో దీనిని ఉపయోగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








