ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి
లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు చాలామంది తరచుగా మర్చిపోయే విషయం తమ కార్లలో ఉన్న ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడం. అప్పుడప్పుడు టోల్ ప్లాజాలోకి వెళ్ళిన తర్వాత సరిపడా బ్యాలెన్స్ లేదని తెలిస్తే చిరాకు కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ను ప్రవేశపెట్టింది.
ఆగస్టు 15 నుండి ఇది అమలులోకి వస్తుంది. ఈ పాస్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికే చాలామందికి తెలుసు. అయితే ఇది మొదలవడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. అవేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.

ఈ యాన్యువల్ పాస్ ప్రధానంగా ప్రైవేట్ వాహన యజమానులకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తుంది. బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఈ పాస్ వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ను యాక్టివేట్ చేయడానికి, రెన్యూవల్ చేయడానికి ప్రత్యేక లింక్ రాజ్మార్గ్ యాత్ర యాప్లో అలాగే ఎన్హెచ్ఏఐ, MoRTH అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ పాస్ పొందాలంటే మీ ఫాస్టాగ్ యాక్టివ్గా ఉండాలి. బ్లాక్లిస్ట్లో ఉండకూడదు.
కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం, రూ. 3000 చెల్లిస్తే, ఏడాదిలో 200 సార్లు టోల్ ప్లాజాలు దాటవచ్చు. అంటే ఒకసారి టోల్ ప్లాజా దాటడానికి కేవలం రూ.15 మాత్రమే ఖర్చు అవుతుంది. సాధారణంగా, తరచుగా టోల్ ప్లాజాలు ఉపయోగించేవారు ఏడాదికి దాదాపు రూ. 10,000 వరకు ఖర్చు చేస్తారు. ఈ కొత్త వార్షిక పాస్ ద్వారా వారికి దాదాపు రూ. 7,000 ఆదా అవుతుంది.

యాన్యువల్ పాస్ ఉందని అన్ని టోల్ ప్లాజాలకు వెళ్ళకూడదు. ఈ పాస్ కేవలం నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలలోని టోల్ ప్లాజాలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర రహదారులు లేదా స్థానిక సంస్థల టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ సాధారణ టోల్ రేట్ల ప్రకారం పనిచేస్తుంది. ఈ పాస్ భవిష్యత్తులో రాబోయే సెన్సార్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలకు అనుగుణంగా అప్డేట్ అవుతుంది.
గతంలో, 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూళ్ల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 55,000 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో ప్రైవేట్ కార్ల ద్వారా కేవలం రూ. 8,000 కోట్లు మాత్రమే లభించింది. ఏదేమైనా, ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం లేకుండా వాహనదారుల ఖర్చులను తగ్గించే ఈ వ్యవస్థ త్వరలోనే ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందుతుందని భావించవచ్చు.

ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచే దీనికి మంచి ఆదరణ లభించింది. ఉదాహరణకు, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే వారికి సాధారణంగా టోల్ ప్లాజాలలో రూ. 700 వరకు ఖర్చవుతుంది, కానీ రూ. 3000 వార్షిక పాస్ తీసుకుంటే టోల్ ఛార్జీలు రూ. 300 కన్నా తక్కువ అవుతాయని అంచనా. అయితే, ఈ ధరలు ఒక అంచనా మాత్రమే, అధికారిక టారిఫ్ విడుదలైన తర్వాతే కచ్చితమైన ధరలు తెలుస్తాయి


Click it and Unblock the Notifications








