నిత్యం హైవేలపై తిరుగుతున్నారా? .. ఇక టోల్ గేట్ దాటాలంటే జేబు లూటీ కావాల్సిందే
జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ తగిలింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టు 15న సామాన్యుడిపై టోల్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ వార్షిక పాస్ విధానం, ఇప్పుడు ప్రియం కాబోతోంది. మార్చి 12న వెలువడిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాహనదారులపై అదనపు భారం పడనుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, నాన్-కమర్షియల్ (సొంత) వాహనదారులు వార్షిక పాస్ కోసం రూ.3,000 చెల్లిస్తున్నారు. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచిఈ ధర రూ.3,075 కి పెరగనుంది. అంటే నేరుగా రూ.75 భారం పెరిగింది. నేషనల్ హైవే ఫీజు రూల్స్ 2025 ప్రకారం, ప్రతి ఏటా ఈ ధరలను సమీక్షించి, సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 2.5 శాతం మేర ధరను పెంచింది. జాతీయ రహదారులపై టోల్ రేట్లు పెరిగే విధానంలోనే ఈ వార్షిక పాస్ రేట్లు కూడా మారుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వార్షిక పాస్ వల్ల కలిగే లాభం ఏంటంటే, ఒక్కసారి రూ.3,075 చెల్లిస్తే ఏడాది పొడవునా దేశంలోని ఏ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్దనైనా 200 సార్లు ఉచితంగా దాటవచ్చు. సాధారణంగా ఒక్కో టోల్ ప్లాజా వద్ద కారుకు రూ.100 నుంచి రూ.150 వరకు ఛార్జ్ ఉంటుంది. ఈ లెక్కన 200 సార్లు ప్రయాణిస్తే దాదాపు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఖర్చవుతుంది. కానీ ఈ పాస్ ఉంటే కేవలం రూ.3,075 తోనే ఆ పని పూర్తవుతుంది. అంటే ఒక్కో టోల్ దాటడానికి కేవలం రూ.15 మాత్రమే ఖర్చవుతుందన్నమాట. అందుకే ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఈ పాస్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం దేశంలో 5.9 కోట్ల ఫాస్టాగ్లు యాక్టివ్గా ఉండగా, అందులో దాదాపు 50 లక్షల మంది వాహనదారులు ఈ వార్షిక పాస్ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. అంటే మొత్తం సొంత కార్ల లావాదేవీల్లో 28 శాతం ఈ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. కేవలం ఆరు నెలల కాలంలోనే (ఆగస్టు 2025 నుంచిజనవరి 2026 వరకు) ఈ పాస్ ద్వారా 26.55 కోట్ల లావాదేవీలు జరగడం విశేషం. ఇది వాహనదారులకు ఎంతగా చేరువయ్యిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

ప్రాంతాల వారీగా చూస్తే చండీగఢ్ ప్రాంతంలో అత్యధికంగా 14 శాతం మంది ఈ వార్షిక పాస్ను ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తమిళనాడు 12.3 శాతం, ఢిల్లీ 11.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ-గురుగ్రామ్ బోర్డర్లోని బిజ్వాసన్ టోల్ ప్లాజా వద్ద అత్యధికంగా 57 శాతం కార్లు ఈ పాస్ ద్వారానే ప్రయాణిస్తున్నాయి. ముండ్కా టోల్ ప్లాజా వద్ద 53 శాతం మంది దీనిని వాడుతున్నారు. అంటే మెట్రో నగరాల్లో నివసించే వారికి ఇది ఒక వరంగా మారింది.
అయితే ఈ పాస్ విషయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇది కేవలం జాతీయ రహదారుల (NH) మీద ఉన్న సుమారు 1150 టోల్ ప్లాజాల వద్ద మాత్రమే పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ హైవే టోల్ ప్లాజాల వద్ద ఇది వర్తించదు. అక్కడ మీ ఫాస్టాగ్ లో ఉన్న రెగ్యులర్ బ్యాలెన్స్ నుండే డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫాస్టాగ్ అకౌంట్లో కొంత నగదు ఉంచుకోవడం మంచిది. అలాగే, ఒకవేళ మీరు ఏడాది లోపే 200 ట్రిప్పులు పూర్తి చేస్తే, ఆ పాస్ అప్పుడే ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్లీ కొత్తగా పాస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాది పూర్తయినా మీరు 200 ట్రిప్పులు వాడకపోతే, మిగిలిన ట్రిప్పులు మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు.
ఈ వార్షిక పాస్ పొందడం చాలా సులభం. ఎన్హెచ్ఏఐ (NHAI) వారి రాజ్మార్గ్యాత్ర (Rajmargyatra) మొబైల్ యాప్ ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 1, 2026 నుంచికొత్త ఫాస్టాగ్లకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను కూడా సులభతరం చేశారు. దీనివల్ల కొత్తగా ఫాస్టాగ్ తీసుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు ఉన్నవారు మాత్రమే ఈ వార్షిక పాస్ తీసుకోవడానికి అర్హులు. కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించదు.


Click it and Unblock the Notifications








