హైవేపై వెళ్తున్నారా? ఫాస్టాగ్ ఉంటే సరిపోదు.. ఈ 5 తప్పులు చేస్తే డబుల్ ఫైన్ పడటం ఖాయం
భారతదేశంలో నేషనల్ హైవేలపై ప్రయాణం ఇప్పుడు పూర్తిగా హైటెక్గా మారిపోయింది. ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడాల్సి వచ్చేది, కానీ ఫాస్టాగ్ (FASTag) పుణ్యమా అని ఇప్పుడు చిటికెలో టోల్ చెల్లించి ముందుకు కదులుతున్నాం. అయితే, 2026 సంవత్సరానికి గానూ ఫాస్టాగ్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి. చాలా మంది వాహనదారులకు ఈ నియమాలు తెలియక టోల్ ప్లాజాల వద్ద అనవసరంగా భారీ జరిమానాలు కడుతున్నారు. మీరు కూడా హైవేలపై తరచుగా ప్రయాణించే వారైతే, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 అతి ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుందాం.
1. పెరిగిన యాన్యువల్ పాస్ ధరలు:
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరించింది. పాత ధర కంటే ఇప్పుడు రూ.75 అదనంగా పెంచారు. ప్రస్తుతం ఈ వార్షిక పాస్ ధర రూ.3,075 గా ఉంది. ఈ పాస్ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే.. ఒక సంవత్సరంలో గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్ల వరకు మీరు ప్రతిసారీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా నాన్-కమర్షియల్ వాహనాలు, అంటే మన సొంత కార్లు లేదా జీపులకు ఇది వర్తిస్తుంది. మీరు డబ్బులు కట్టిన రెండు గంటల్లోనే ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది. తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం.

2. సరిగ్గా అతికించకపోతే డబుల్ టోల్:
చాలా మంది ఫాస్టాగ్ స్టిక్కర్ను కారు లోపల డ్యాష్ బోర్డు మీదో లేక చేత్తో పట్టుకునో చూపిస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం.. ఫాస్టాగ్ స్టిక్కర్ ఖచ్చితంగా కారు విండ్స్క్రీన్ (ముందు అద్దం)కు సరిగ్గా అతుక్కుని ఉండాలి. ఒకవేళ అది ఊడిపోయినా లేదా మీరు కావాలని అతికించకపోయినా, స్కానింగ్లో ఇబ్బంది ఎదురైతే మీరు డబుల్ టోల్ ల్లించాల్సి ఉంటుంది. స్టిక్కర్ సరిగ్గా లేకపోవడం వల్ల టోల్ ప్లాజా వద్ద సమయం వృధా అవుతుందని, అందుకే ఇలాంటి కఠిన నిబంధనలు తెచ్చామని అధికారులు చెబుతున్నారు.
3. రోడ్డు పనులు జరుగుతుంటే సగం టోల్:
హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎక్కడైనా రోడ్డు విస్తరణ పనులు లేదా మరమ్మతులు జరుగుతుంటే వాహనదారులకు భారీ ఉపశమనం లభిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. రోడ్డు పనులు పూర్తి కానంత వరకు ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలకు కేవలం 50 శాతం టోల్ మాత్రమే వసూలు చేయాలి. ఉదాహరణకు ఒక టోల్ ప్లాజా వద్ద సాధారణ ఫీజు రూ.100 ఉంటే, అక్కడ రోడ్డు బాలేదు లేదా పనులు జరుగుతున్నాయి అంటే మీరు కేవలం రూ.50 కడితే సరిపోతుంది. ఈ విషయం తెలియక చాలా మంది పూర్తి ధర చెల్లిస్తున్నారు.

4. ఫాస్టాగ్ లేకపోతే పెనాల్టీల మోత:
నేటికీ కొందరు ఫాస్టాగ్ లేకుండానే హైవేలపైకి వచ్చేస్తున్నారు. ఇలాంటి వారు టోల్ లైన్ లోకి వెళ్తే భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుంది. మీరు నగదు (Cash) రూపంలో చెల్లిస్తే సాధారణ టోల్ కంటే రెండు రెట్లు (డబుల్) వసూలు చేస్తారు. ఒకవేళ యూపీఐ (UPI) ద్వారా కడతామంటే, సాధారణ ధర కంటే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాలి. అంటే రూ.100 టోల్ ఉన్న చోట, క్యాష్ ఇస్తే రూ.200, యూపీఐ అయితే రూ.125 కట్టాలి. ప్రజలందరూ ఫాస్టాగ్ వాడాలనే ఉద్దేశంతోనే ఈ జరిమానాలు విధిస్తున్నారు.
5. ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్:
మీ ఫాస్టాగ్ వాలెట్ నుంచి పొరపాటున ఎక్కువ డబ్బులు కట్ అయినా, లేదా టోల్ ప్లాజా సిబ్బంది మీతో దురుసుగా ప్రవర్తించినా వెంటనే మీరు 1033 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయవచ్చు. ఇది నేషనల్ హైవేల కోసం కేటాయించిన ప్రత్యేక నంబర్. దీనితో పాటు రాజ్మార్గ్ యాత్ర (Rajmarg Yatra) అనే యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. ఈ యాప్ ద్వారా మీకు దగ్గరలో ఉన్న టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం వంటివి క్షణాల్లో తెలుస్తాయి.
హైవే ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా మార్చుకోవడానికి ఈ నిబంధనలు పాటించడం చాలా అవసరం. ఫాస్టాగ్ ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవడం, కేవైసీ అప్డేట్ చేసుకోవడం వల్ల ఎలాంటి చిక్కులు లేకుండా మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.


Click it and Unblock the Notifications








