కరోనా ఎఫెక్ట్; 4 రోజులు, 300 కి.మీ సైకిల్ ప్రయాణం.. కొడుకు కోసం తండ్రి చేసిన సాహసం
భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా వ్యాపించి ఎంతో మంది ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. కరోనా వైరస్ సామాన్య మానవుడి పాలిట శాపంగా మారింది. అయితే ఈ మహమ్మారిని నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుని లాక్ డౌన్ విధించారు.

కరోనా లాక్ డౌన్ వల్ల కరోనా సంక్రమణ కొంతవరకు తగ్గుతోంది. అయితే రోజు వారీ కూలీలు మొదలైన వారి బ్రతుకే కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక తండ్రి తన కొడుక్కి మందులు తీసుకురావడానికి ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించిన ఒక హృదయ విషాద సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

కన్నబిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతటి సాహసమైన చేసేందుకు వెనుకాడరు అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ మనం చూస్తున్న సంఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం మైసూర్ జిల్లా టి.నరసిపురా తాలూకాలోని కొప్పలు గ్రామానికి చెందిన ఆనంద్(45) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భైరాశ్ అనే కుమారుడు ఉన్నాడు. చిన్నారికి అరుదైన వ్యాధి సోకటం వల్ల గత 10 సంవత్సరాల నుంచి బెంగళూరులోని నిమ్హాన్స్ హాస్పిటల్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

కావున మందులు కొనసాగిస్తేనే ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మందులు ఒక్క రోజు లేకపోయినా పరిస్థితి విషమిస్తుంది. దీనికోసం ఆనంద్ ప్రతి 2 నెలలకు ఒకసారి బెంగళూరు వెళ్లి మందులు తీసుకువస్తాడు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల కర్ణాటక రాష్ట్రం మొత్తం లాక్డౌన్ విధించటం వల్ల బెంగళూరు వెళ్లేందుకు ఎలాంటి వాహన సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి. బంధువులు, స్నేహితులను కూడా కరోనా వైరస్ కి భయపడి ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు.
ఆనంద్ కి ఇక ఏమి చేయాలో పాలుపోక తానే స్వయంగా వెళ్లి మందులు తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. దీనికోసం అతని వద్ద ఉన్న ఒక పాత సైకిల్పై మే 23న తన ప్రయాణం మొదలు పెట్టాడు. అతడు మార్గం మధ్యలో పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు కూడా తిన్నాడు.

ఏది ఏమైనా మొత్తానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఆనంద్ మే 25 న బెంగళూరు చేరుకున్నాడు. అతడు చేసిన ఈ సాహసానికి హాస్పిటల్ లోని డాక్టర్లు నివ్వెరపోయారు. అతనికి మందులు ఇచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళమని చెప్పారు. అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలు పెట్టిన ఆనంద్ ఇల్లు చేరాడు. ఇల్లు చేరిన అతనికి తన కొడుకుని చూడగానే పడ్డ కష్టం మొత్తం మరిచిపోయాడు.
Source: The New India Express


Click it and Unblock the Notifications








