బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్
భోజనప్రియులకు ఓ గోల్డెన్ ఛాన్స్. మేము పెట్టిన బువ్వ పూర్తిగా తింటే, బుల్లెట్ బైక్ ఉచితంగా ఇస్తామంటూ ఓ వినూత్నమైన ఛాలెంజ్తో ముందుకొచ్చింది ఓ రెస్టారెంట్. మరి ఆ కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం రండి..

పూణేకి చెందిన 'హోటల్ శివరాజ్' అనే రెస్టారెంట్ 'బుల్లెట్ థాలి' ఛాలెంజ్ను ఆఫర్ చేస్తోంది. ఈ థాలిని పూర్తిగా వదలకుండా తిన్న వారికి రూ.1.65 లక్షల విలువైన సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను ఉచితంగా అందిస్తామంటూ ఛాలెంజ్ చేస్తోంది.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ 'బుల్లెట్ థాలి' ప్లేట్ను 1 గంటలోపు పూర్తిగా తినేయాలి. ప్లేటులో ఏ కొంచెం మిగిలినా వారు ఈ పోటీకి అనర్హులు అవుతారు. ఈ బుల్లెట్ థాలిలో సుమారు 4 కిలోల బరువైన ఆహారం ఉంటుంది. ఇందులో మటన్ మరియు వేయించిన చేపలతో పాటుగా సుమారు 12 రకాల వంటకాలతో కూడిన ఆహారం ఉంటుంది.

ఈ స్పెషల్ బుల్లెట్ థాలీలో ఫ్రైడ్ సూర్మాయి, పోమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలుంబి బిర్యానీలతో పాటుగా మొత్తం 12 రకాల వంటకాలు ఉంటాయి. కస్టమర్ల కోసం ఈ నాన్-వెజ్ ప్లేట్ను సిద్ధం చేయడానికి దాదాపు 55 మంది పనిచేస్తారు.

హోటల్ పేర్కొన్న సమయంలో ఈ ప్లేట్ పూర్తి చేసిన వారికి రెస్టారెంట్ నుండి ఉచితంగా బుల్లెట్ బైక్ ఇవ్వబడుతుంది. కానీ, ఈ ప్లేట్ పూర్తి చేయడం అంత తేలికైన విషయం కాదు. బుల్లెట్ థాలి ప్లేట్ ఛాలెంజ్కు రెండు ఆప్షన్లు ఉన్నాయి.

ఇందులో మొదటి రూ.4,444 విలువైన పెద్ద బుల్లెట్ ప్లేట్. ఈ ప్లేట్ను ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక గంట వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా తిన్నవారు పూర్తి ఉచితంగా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

అలాకాకుండా, ఒక్కరే ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే, రెండవ ఆప్షన్ అయిన రూ.2500 విలువైన చిన్న బుల్లెట్ ప్లేట్ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లేట్ను కూడా ఒక గంట వ్యవధిలోనే పూర్తిగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వ్యక్తిని కొత్త ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్ వరిస్తుంది.

కోవిడ్-19 పరిస్థితుల్లో కస్టమర్లు రెస్టారెంట్లకు రావటానికి సంకోచిస్తున్న నేపథ్యంలో, తమ రెస్టారెంట్కు కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ సరికొత్త ఛాలెంజ్ను ప్రారంభించినట్లు హోటల్ యజమాని తెలిపారు. తమ హోటల్లో కోవిడ్-19 నిబంధనలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ బుల్లెట్ థాలి ఛాలెంజ్ కోసం సదరు రెస్టారెంట్ ఓనర్ తన హోటల్ ముందు 5 సరికొత్త బుల్లెట్ బైక్లను ఉంచాడు. పూణేలోని ఓల్డ్ ముంబై-పూణే హైవేలోని వాడ్గావ్ మావల్ వద్ద ఈ హోటల్ శివరాజ్ అనే రెస్టారెంట్ ఉంది.

కొంతకాలం క్రితం ఈ రెస్టారెంట్ వారు 8 కిలోల రావన్ థాలిని కూడా ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఈ థాలిని పూర్తి చేసిన వారికి 5000 రూపాయల నగదు బహుమతిని కూడా అందించారు. అంతేకాకుండా, రావన్ థాలికి వసూలు చేయాల్సిన డబ్బును కూడా కస్టమర్ల నుండి తీసుకోలేదు.

కాగా, సోలాపూర్ జిల్లాకు చెందిన సోమ్నాథ్ పవార్ అనే వ్యక్తి ఈ స్పెషల్ బుల్లెట్ థాలీని నిర్ణీత టైమ్లో ఫినిష్ చేసి సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ను గెల్చుకున్నాడని సదరు రెస్టారెంట్ పేర్కొంది.


Click it and Unblock the Notifications