నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. 4 రోజుల పసికందుతో సహా 9 మంది మృతి, దుర్ఘటనకు కారణాలివే.!!
హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం(Hyderabad Building Fire) చోటుచేసుకుంది. నాంపల్లి బజార్ఘాట్లోని ఓ కెమికల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 9 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నాలుగు రోజుల పసికందు కూడా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దీపావళి పండుగ సందర్భంగా టపాసుల మోతతో కోలాహలంగా ఉన్న హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం కలవరం సృష్టిస్తోంది. నాంపల్లి బజార్ఘాట్లోని ఓ ఐదంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చేలరేగి.. నాలుగు అంతస్తులకు(Nampally Godown Fire Accident) వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

కాగా తీవ్ర పరిస్థితి దృష్ట్యా ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 21 మంది మంటల్లో చిక్కుకోగా 9 మంది మృతి చెందారని తెలిసింది. ప్రస్తుతం 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో నాలుగు రోజుల పసికందు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఐదంతస్థుల అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో గోడౌన్ ఉండగా.. గోడౌన్ ముందు పార్క్ చేసిన కార్లు, బైకులు అగ్నికి ఆహుతై బూడిదయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. 7 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక శాఖ డీజీపీ నాగిరెడ్డి వెల్లడించారు. అపార్ట్మెంట్ గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద ఎత్తున కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచడమే ఇందుకు కారణంగా డీజీపీ తెలిపారు. ఐదంతస్థులు ఉన్న ఈ బిల్డింగులో పెద్ద ఎత్తున డ్రమ్ములు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు.
భవన యజమాని రమేష్ జైస్వాల్ను గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. కాగా అతనికి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉందని.. అందులో ఉపయోగించే రసాయన డబ్బాలను జనావాసాల మధ్య నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. 150కి పైగా కెమికల్ డ్రమ్ములు అక్కడ ఉన్నట్లు తెలిపారు. అక్కడే కారు రిపేర్ చేస్తుండగా.. గ్రౌండ్ ఫ్లోర్లోని కెమికల్ డ్రమ్ములో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ మంటలు భవనమంతా వ్యాపించినట్లు తెలుస్తోంది.

బిల్డింగులోని మూడు, నాలుగు అంతస్థుల్లో ఉండేవారిని రక్షించగలిగినా.. మొదటి రెండు అంతస్థుల్లో ఉండే వారిని కాపాడలేకపోయామని డీజీపీ తెలిపారు. బిల్డింగ్లో మొత్తం 21 మంది చిక్కుకోగా.. వారిలో 9 మంది మృతి చెందారన్నారు. మృతుల్లో నాలుగు రోజుల పసికందు కూడా ఉంది. మిగిలిన వారిలో 8 మంది అపస్మారక స్థితిలోకి చేరుకున్నారన్నారు. ప్రస్తుతం 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఈ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారు.. సమీన్, జాకీర్ హుస్సేన్, నిఖత్ సుల్తానా, మహ్మాద్ అజాం, హబీబుల్, రెహానా, తుహార ఫర్హీన్, తూబ, తరూబాగా పోలీసులు గుర్తించారు. ఘటనకు కెమికల్ డ్రమ్ములే కారణంగా ఫైర్ డీజీపీ నిర్ధారించారు. దుర్ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకుని.. సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.


Click it and Unblock the Notifications








