ఐదుగురి ప్రాణాలను బలిగొన్న పొగమంచు.. రోడ్డు కనిపించక చెరువులోకి దూసుకెళ్లిన కారు, వైరల్ వీడియో
తెల్లవారుజామున దట్టంగా కమ్ముకున్న పొగమంచు పలువురి ప్రాణాల్ని బలిగొంది. దారి కనిపించకోవడంతో జరిగిన రెండు ప్రమాదాల్లో అమాయకులు మృత్యువాత పడటం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఆదివారం, సోమవారం జరిగిన ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో..
దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఇలా తదితర కారణాల వల్ల నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ పొగమంచు కారణంగా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో దారి కనిపించకపోవడంతో(Fog Accident In Telangana) తెలంగాణలో సోమవారం(డిసెంబర్ 25న) రెండు ప్రమాదాలు జరగడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. అయితే రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ ఇలా జరగడం కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
నల్గొండ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ యువకుడి బంధువులు ఏడుగురు కలిసి ఓ ఆటో మాట్లాడుకొని ఘటనాస్థలానికి బయలుదేరారు. అలా బయలుదేరిన కొద్దిసేపటికే పొగమంచు(4 Died Due To Fog) దట్టంగా కమ్ముకోవడంతో ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

సోమవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై వేంపాడ్ శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం నీమానాయక్తండా శివారు మల్లెవానికుంటతండాకు చెందిన రమావత్ కేశవులు అలియాస్ శివ (19) అనే యువకుడు.. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి తండాకు వెళ్లేందుకు బైక్పై వెళ్లాడు.
ఆదివారం(డిసెంబర్ 24) రాత్రి 10:30కు నిడమనూరు మండలం వేంపాడ్ స్టేజీ వద్ద సైదులు అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. అతడిని శివ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. శివ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు ఏడుగురు కలిసి అతడిని చూసేందుకు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు తండా నుంచి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి ఆటోలో వెళ్లారు.

వేంపాడ్ శివారు సాయిబాబా విగ్రహం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో శివ పెదనాన్న రమావత్ గన్యా(40), మేనత్త మూడావత్ బుజ్జి(38), బావ దూపావత్ నాగరాజు(28), డ్రైవర్ రమావత్ పాండు(29) ఉన్నారు. కాగా శివ తండ్రి ప్రభాకర్, పాలక్ నాయక్, వినోద్లకు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఓ కారు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగే సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒకరు మృతిచెందగా మిగతావారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు గుణశేఖర్, సాగర్, రఘుపతి, పూజిత, మోహన్లు.. హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

క్రిస్మస్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో వీరంతా వికారాబాద్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వికారాబాద్కు సోమవారం తెల్లవారుజామున కారులో బయలుదేరారు. మోహన్ కారు నడుపుతుండగా.. ఉదయం 5.30 గంటల సమయంలో వికారాబాద్ సమీపంలోకి కారు చేరుకోగానే విపరీతమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న శివసాగర్ చెరువులోకి కారు దూసుకెళ్లి నీట మునిగింది.
వీరిలో రఘుపతికి ఈత రావడంతో కారు తలుపులు తెరిచి నీటిలో మునిగిపోతున్న సాగర్ను రక్షించగా.. అదృష్టవశాత్తు మోహన్, పూజితలు తక్కువ లోతు ఉన్న వైపు ఒడ్డుకు చేరుకున్నారు. కాగా గుణశేఖర్ నీట మునగడంతో మృతి చెందారు. అంతకుముందు గుణశేఖర్ను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.


Click it and Unblock the Notifications








