ఇల్లు వదిలి కరోనా బాధితులకు సర్వీస్ చేస్తున్న ఐటీ ఉద్యోగి
కరోనా సెకండ్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రజలను బలిగొంటుంది. ఈ మహమ్మారి బారిన పడి కొట్టుమిట్టాడుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రోజుకి రోజుకి కరోనా భాదితుల సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో హాస్పిటల్స్ లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత మరియు అంబులెన్సులు కొరత చాలా తీవ్రంగా ఉంది.

దేశంలో అంబులెన్సులు కొరత ఎక్కువగా ఉన్న కారణంగా ఎంతో మంది ప్రజలు సమయానికి హాస్పిటల్స్ కి వెళ్లలేకపోతున్నారు. ఈ సమయంలో ఎంతోమంది స్వచ్చందంగా ప్రజలకు సేవ చేయడానికి తమ వాహనాలను అంబులెన్సులుగా మార్చి కరోనా బాధితులను ఆదుకుంటున్నారు.

కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయడానికి ఆటో డ్రైవర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే తమ ఆటోలను కరోనా బాధితులకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే తరహాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ నివాసి అయిన నాగియా తన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారును ప్రజల ఉపయోగార్ధం ఎమర్జెన్సీ వెహికల్ గా మార్చేశాడు. ఈ ఎమర్జెన్సీ వాహనంలో ఆక్సిజన్ సిలిండర్, మెడిసిన్, ఆక్సిమీటర్, ఆహారం మరియు నీరు వంటివి అందించబడతాయి.

నివేదికల ప్రకారం నోయిడాకు చెందిన ఐటి కంపెనీ ఉద్యోగి నాగియా గత నెల నుంచి కోవిడ్-19 రోగులకు సహాయం చేయడం ప్రారంభించినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది. ఇతడు రోగులకు ఈ విధంగా సర్వీస్ చేయడం ఏప్రిల్ నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి సమయంలో కరోనా పీడితులకు ఆక్సిజన్ ఎంతగానో అవసరం కావున అవసరమైన వారికి ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. గత కొన్ని రోజులకు ముందు ఆక్సిజన్ కి చాలా డిమాండ్ ఉంది కావున ఆ సమయంలో మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేదు. కానీ ఏదో ఒక విధంగా మేము రాజౌరి గార్డెన్లోని గురుద్వారా నుండి ఆక్సిజన్ సిలిండర్ను ఏర్పాటు చేసామని నాగియా చెప్పారు.

అప్పటి నుండి నాగియా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అవసరమైన వారికి వివిధ రకాలుగా సర్వీస్ చేయడానికి నాగియా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతని కారుని అంబులెన్స్గా మార్చాడు. ఈ కారు ద్వారా నాగియా ఇప్పటికే దాదాపు 23 మంది కరోనా బాధితులను తరలించాడు.

దేశంలో ఢిల్లీ మరియు ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరిగాయి. ఇదే సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఆ సమయంలోనే తన కారుని కరోనా రోగులకు సన్నద్ధం చేయాలనే ఆలోచన తట్టిందని నాగియా చెప్పాడు.

ఈ విధంగా ఆలోచించిన వెంటనే అతని కారుని కరోనా బాధితులకు అనుకూలంగా ఉండే విధంగా మార్చాడు. దీనికయ్యే మొత్తం ఖర్చవు కూడా అతడే పెట్టుకున్నాడు. కరోనా రోగులకు సేవచేయడం కోసం ఏకంగా ఒక నెల రోజుల పాటు కుటుంబానికి మరియు అతని పిల్లలకు దూరంగా ఉంటూ కారులోనే గడిపాడని కూడా అతడు తెలిపాడు.

ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఆదివారం రోజు కేవలం 1,000 కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిసింది. ఈ సమయంలో కూడా నాగియా అవసరమైన వారికి తాగునీరు మరియు ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications








