కాలగర్భంలో కలిసిపోయిన కార్లు - ఇవన్నీ మీకు గుర్తున్నాయా?
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి కొత్త రంగులు పులుముకుంటోంది. ఈ తరుణంలో కొత్త కార్లు వస్తున్నాయి. పాత కార్లు కనుమరుగవుతున్నాయి. అయితే మనం ఈ కథనంలో కాలంలో కలిసిపోయిన కార్లు ఏవి? కారణం ఏంటనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
టాటా బోల్ట్ / టాటా జెస్ట్
2015లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టాటా కంపెనీకి 'బోల్ట్' హ్యాచ్బ్యాక్ 2019 నాటికి నిలిపివేయబడింది. అంటే కేవలం ఐదు సంవత్సరాల సమయంలోనే నిలిపివేయబడింది. దీనికి ప్రధాన కారణం కస్టమర్లను ఆకర్సిండంలో విఫలమవ్వడమే. ఆ తరువాత టాటా జెస్ట్ కూడా మార్కెట్లో ఆశించినంత సక్సెస్ పొందలేకపోయింది. ప్రజలు కూడా ఈ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపించకపోవడంతో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

టాటా బోల్ట్ మరియు జెస్ట్ అనేవి సింపుల్ డిజైన్ కలిగి, మంచి ఫీచర్స్ పొందినప్పటికీ అమ్మకాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు పోలేకపోయాయి. అంతే కాకుండా అప్పట్లో మారుతి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ ఐ20 వంటివి అమ్మకాల్లో గట్టి పోటీ ఇచ్చాయి. దీంతో బోల్ట్ మరియు జెస్ట్ కాలంతో పాటు ఇవి కూడా కనుమరుగైపోవాల్సి వచ్చింది. అయితే ఈ కార్లకు వారసత్వంగా టియాగో, టిగోర్ మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి.
డాట్సన్ గో
ఒకప్పుడు భారతీయ మార్కెట్లో అతై తక్కువ కాలంలో ఎక్కువ అమ్మకాలు పొందిన కార్లలో ఒకటి 'డాట్సన్ గో'. 2014లోనే మంచి క్రేజుని సంపాదించుకున్న ఈ కారు విక్రయాలు 2020 నాటికి నిలిచిపోయాయి. దీనికి కారణం ఈ కారులో క్వాలిటీకి సంబంధించిన సమస్యలు, ఆధునిక ఫీచర్స్ లేకపోవడం మరియు పాత డిజైన్ వంటివి మాత్రమే కాకుండా క్రమంగా డిమాండ్ తగ్గిపోవడమే అని తెలుస్తోంది.

డాట్సన్ గో డిమాండ్ తగ్గడం ప్రత్యర్థుల పోటీ ఎక్కువ కావడం వల్ల 2022లో భారతదేశంలో బ్రాండ్ మూసివేతకు కారణమయ్యాయి. బ్రాండ్ వైఫల్యానికి ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. ఉత్పత్తి మరియు అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయినప్పటికీ నేటికీ ఈ కార్లు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. డాట్సన్ గో మారుతున్న కాలంతో పాటు కొంత అప్డేట్స్ పొంది ఉంటే మార్కెట్లో మంచి సక్సెస్ సాధించి ఉండేదేమో అని పలువురు భావిస్తున్నారు.
మహీంద్రా క్వాంటో
మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు నేడు భారతదేశంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన అమ్మకాల పరంగా దూసుకెళ్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఒకప్పుడు కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'క్వాంటో' సరైన అమ్మకాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయిందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. 2012లో ప్రారంభమైన ఈ మినీ కారు పట్టణ కొనుగోలుదారులనే లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో ముందుకు పోలేకపోయింది.

మహీంద్రా క్వాంటో కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 100 హార్స్ పవర్ మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్ అందించింది. అయితే ఆకట్టుకోలేని డిజైన్ ఈ కారు పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతే కాకుండా అదే సమయంలో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. దీంతో క్వాంటో తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆశించిన విక్రయాలు పొందలేక, కాలంలో కలిసిపోయింది.
చేవ్రొలెట్ ఎంజాయ్
పేరుకు తగ్గట్టుగానే ఈ కారు మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించింది. కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. 2013లో ప్రారంభమైన ఈ కారు సెవెన్ సీటర్ కారుగా లాంచ్ అయింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఎంపికలతో అందుబాటులో ఉండేది. కానీ ఎక్కువ మంది ఈ కారుని కొనటానికి ఆసక్తి చూపించకపోవడం వల్ల 2016లో నిలిపివేయబడింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో దీనికి గిరాకీ అస్సలు లేదనే అర్థమవుతోంది.

నిస్సాన్ టెర్రానో
మాగ్నైట్ వంటి అమ్మకాలతో ముందుకు సాగుతున్న నిస్సాన్ కంపెనీ.. 2013లో టెర్రానో అనే ఒక కాంపాక్ట్ SUV లాంచ్ చేసింది. ప్రారంభంలో కొంత ఆశాజనకంగా ముందుకు సాగినప్పటికీ.. ఆ తరువాత కొంత కాలానికే నిలిపివేయబడింది. 2015లో హ్యుందాయ్ క్రెటా లాంచ్ చేసి అమ్మకాల పరంగా గట్టి పోటీ ఇచ్చింది. దీంతో నిస్సాన్ టెర్రానో అమ్మకాలు భారీగా పడిపోయాయి, ఈ కారణంగానే మార్కెట్లో నిస్సాన్ టెర్రానో కారు నిలిపివేయబడింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








