ఒకప్పుడు రూపాయికే కంపెనీ అమ్మేద్దామనుకున్నారు.. ఇప్పుడు ఏకంగా టీమీండియాకే స్పాన్సర్
భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ లభించింది. అపోలో టైర్స్ బీసీసీఐతో మూడేళ్ల కాలానికి 579 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు 2027 వరకు భారత క్రికెట్ జట్టు అపోలో టైర్ లోగో ఉన్న జెర్సీతో ఆడుతుంది.
అయితే, ఒకప్పుడు టీమ్ ఇండియా జెర్సీని స్పాన్సర్ చేసిన ఈ కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒకానొక దశలో తండ్రి తన కుమారుడికి కేవలం ఒక రూపాయికి కంపెనీని అమ్మాలని ఆఫర్ చేశారు. కానీ ఆ రోజులు ఇప్పుడు లేవు, ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు బీఎస్ఈలో దాదాపు రూ.31,000 కోట్లు.

1975 ఎమర్జెన్సీ సమయంలో కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ, వ్యవస్థాపకుడు రౌనక్ సింగ్ ఈ నష్టాల వ్యాపారాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు ఓంకార్ కన్వర్కు ఒక రూపాయికి కంపెనీని అమ్మాలని ప్రతిపాదించారు.
డీఎన్ఏ నివేదిక ప్రకారం.. ఓంకార్ కన్వర్ ఈ సవాలును స్వీకరించారు. అపోలో టైర్స్ను దాని కష్టకాలం నుండి బయటకు తీసుకువచ్చారు. అతను దానిని వేల కోట్ల రూపాయల సంస్థగా, ప్రపంచ టైర్ పరిశ్రమలో ఒక ముఖ్యమైన కంపెనీగా మార్చారు.

కంపెనీ వెబ్సైట్ ప్రకారం, అపోలో టైర్స్ ప్రయాణం 1972లో భారతదేశంలోని గురుగ్రామ్లో ప్రారంభమైంది. 1975లో కేరళలోని పెరంబ్రాలో మొదటి ఫ్యాక్టరీ ప్రారంభమైంది, ఇది క్వాలిటీ గల టైర్లను తయారు చేయడం ద్వారా కంపెనీని కొత్త శిఖరాలకు చేర్చింది. క్రమంగా అపోలో 100 కంటే ఎక్కువ దేశాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
2009లో కంపెనీ నెదర్లాండ్స్ వ్రెడెస్టీన్ బాండెన్ బీ.వీని కొనుగోలు చేసింది. దీనికి అపోలో వ్రెడెస్టీన్ అని పేరు పెట్టారు. నేడు అపోలోకు భారతదేశంలో ఐదు ఫ్యాక్టరీలు, నెదర్లాండ్స్, హంగేరీలో ఒక్కొక్కటి ఉన్నాయి.

1980లో కంపెనీ వ్యవస్థాపకుడు రౌనక్ సింగ్ నుండి తనయుడు ఓంకార్ కన్వర్ కంపెనీ కంట్రోల్ తీసుకున్నారు. తర్వాత ఒక పెద్ద పునరుద్ధరణను ప్రారంభించారు. కంపెనీని తిరిగి నిలబెట్టడానికి అతను కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకున్నారు. భారతీయ రోడ్లు, లోడ్ పరిస్థితుల కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ దేశీయ ట్రక్ టైర్ మార్కెట్పై దృష్టి పెట్టారు. ఉద్యోగుల జీతాలను ఉత్పాదకతతో అనుసంధానం చేయడం ద్వారా సంబంధాలు, సామర్థ్యాన్ని మెరుగుపరిచారు.
కంపెనీ బలోపేతం అవుతున్న కొద్దీ, భారతదేశంలో విస్తరణ ప్రారంభించింది. 1991లో గుజరాత్లోని లిమ్డాలో రెండవ ప్లాంట్ను ప్రారంభించింది. 1995లో ప్రీమియర్ టైర్స్ లిమిటెడ్ను స్వాధీనం చేసుకుని కేరళలో మూడవ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. అలాగే 1990లలో కంపెనీ భారతీయ రేడియల్ టైర్ విభాగంలో అగ్రగామిగా, దేశంలో అత్యధికంగా టైర్లను ఎగుమతి చేసే సంస్థగా మారింది.
అపోలో టైర్స్ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ టైర్ కంపెనీలలో ఒకటి. దాని ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే.. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.30,916.71 కోట్లు. జెర్సీ స్పాన్సర్ చేసే వార్త తర్వాత అపోలో టైర్ లిమిటెడ్ షేర్లలో పెరుగుదల కనిపించింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 1.56 శాతం పెరిగి రూ.486.80 వద్ద ముగిసాయి.


Click it and Unblock the Notifications








