ఆ రాష్ట్రంలో రూ. 200 కంటే ఎక్కువ పెట్రోల్ పోయరు.. కార్లకు రూ. 500 మాత్రమే.. ఎందుకంటే?
త్రిపుర రాష్ట్రాన్ని ఇంధన కొరత సమస్య వేధిస్తోంది. రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడటంతో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోల్, డీజీల్ తగినంత లభించడం లేదు. కొండచరియలు కూడా విరిగిపడటంతో ఈ సమస్య మరింత జఠిలం అయ్యింది. దీంతో ఇంధనం కోసం ఆ రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధల్ని తీసుకువచ్చింది.
త్రిపురలోని ఈశాన్య సరిహద్దు రైల్వేలోని లుమ్డింగ్ డివిజన్ పరిధిలో గల జటింగా-లంపూర్ మరియు న్యూ హరంగాజావో స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సంఘటన జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని Northeast Frontier Railway (NFR) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డి ధృవీకరించారు.

రైళ్ల రాకపోకలు నిలిచి పోవడంతో ఈ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం వస్తువుల రవాణా పరిమితం చేయబడిన కారణంగా ఇంధన సరఫరాలో పరిమితిని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలపై పరిమితిని విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ నియమాలు తక్షణమే అమల్లోకి వస్తాయని మే 2న ఈ ప్రకటన విడుదల చేసింది.
త్రిపుర రాష్ట్రం విడుదల చేసిన ఆంక్షల ప్రకారం ఇకపై ద్విచక్ర వాహనాలకు రోజుకు రూ.200 పెట్రోల్ని మాత్రమే విక్రయించనున్నారు. ఇక ఫోర్ వీలర్స్కి రూ. 500, బస్సులు ఇతర హెవీ వెహికిల్స్కి రోజుకు 60 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. ఇక మినీ బస్సులకు రోజుకు 40 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే అందిస్తారు. ఇక ఆటోలకు కేవలం 15 లీటర్ల ఫ్యూయెల్ మాత్రమే నింపుకొనే అవకాశం ఉంది.

ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఆకస్మిక భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తోందని త్రిపుర రాష్ట్రానికి చెందిన వాహన యజమానులు వాపోతున్నారు. దీనిపై సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని వారు కోరారు.
ఇంజిన్ పట్టాలు తప్పిన కారణంగా ఏప్రిల్ 27 నుంచి జటింగా-లంపూర్ మరియు న్యూ హాఫ్లాంగ్ మార్గాల్లో రైళ్ల రాకపోకలపై NFR ఆంక్షలు విధించింది. త్వరిగతన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టడం కోసం ఈ మార్గాల్లో ఆంక్షలను అమలు చేసింది. అస్సాంతో పాటు త్రిపుర, మణిపూర్ మరియు మిజోరాంతో సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన జటింగా-లంపూర్ మరియు న్యూ హాఫ్లాంగ్ మార్గంలో పునరుద్దరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

10కి పైగా భారీ యంత్రాలతో పాటు 300 మందికి పైగా కార్మికులు మరియు సాంకేతిక నిపుణులు రైలు సేవల పునరుద్ధరణలో భాగం అయ్యారు. కొండ చరియల వల్ల భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు రైళ్ల పట్టాల పర్యవేక్షణ కొనసాగుతుందని వారు తెలిపారు.
ప్రస్తుతం 80 శాతానికి పైగా సాంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలపై పరిమితులు వాహనాదారులకు ఇబ్బందులు కలిగించవచ్చు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి సమయాల్లోనే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుంటే ఈ గడ్డు సమస్యలను అధిగమించవచ్చు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహిస్తుండటం శుభసూచికం.


Click it and Unblock the Notifications








