Gaganyaan ప్రాజెక్టు.. శనివారం ఎంతో కీలకం.. అసలు ఏం జరగనుంది?
చంద్రయాన్-3, ఆదిత్య మిషన్ల విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో మరో కీలక ప్రాజెక్టును చేపట్టనుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేసేందుకు వీలుగా గగన్యాన్ ప్రాజెక్టు తొలి దశ టెస్టింగ్ శనివారం జరగనుంది.
అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గగన్యాన్ (Gaganyaan Project) ప్రయోగంలో వినియోగించే ఫ్లైట్ టెస్ వెహికల్ అబార్డ్ మిషన్ తొలి పరీక్షకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

అక్టోబర్ 21 ఉదయం 8 గంటలకు ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కే్ప్ సిస్టమ్ను 17 కి.మీ ఎత్తుకు తీసుకెళ్తుంది. అనంతరం అక్కడ విడిచిపెడుతుంది. తర్వాత పారాచూట్ సాయంతో బంగాళాఖాతంలో పడుతుంది. దీన్ని భారత నావికాదళం తీరానికి చేర్చనుంది. ఈ ప్రయోగం మొత్తం 8.5 నిమిషాల్లో పూర్తికానున్నట్లు తెలుస్తోంది.
2025లో ప్రయోగం : ఈ తొలి దశ టెస్టింగ్ పూర్తయితే, తర్వాత దశ గగన్యాన్ ప్రాజెక్టుకు మార్గం సుగమం అవుతుంది. అనంతరం మరో రెండు పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలు విజయవంతం అయితేనే 2025లో గగన్యాన్ను ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.

గగన్యాన్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన పైలెట్లను రష్యాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బృందానికి బెంగళూరులో శిక్షణ కొనసాగుతోంది. వీరికి మరిన్ని కీలక విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అన్ని పరీక్షలు, శిక్షణ సక్రమంగా పూర్తయితే 2025 నాటికి గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేయాలని ఇస్రో భావిస్తోంది.
గగన్యాన్ తొలి పరీక్ష ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇస్రో అధికారిక వెబ్సైట్, అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతోపాటు దూరదర్శన్లోనూ ఈ లైవ్ వీక్షించవచ్చు. ఉదయం 7:30 గంటల నుంచి ఈ లైవ్ అందుబాటులో ఉంటుందని ఇస్రో వెల్లడించింది.

గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర సామర్థ్యాన్ని ఇస్రో ప్రదర్శించనుంది. అందులో భాగంగా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. 400 కిలోమీటర్ల కక్ష్యలో మూడు రోజుల పాటు వివిధ రకాల పరిశోధనలు అనంతరం వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
ఆగస్టు 23న ఇస్రో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండ్ను సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై వివిధ రకాల పరిశోధనలు చేసింది. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం మినహా మిగిలిన ప్రాంతంలో రష్యా, అమెరికా, చైనా విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.

చంద్రయాన్-3 ప్రయోగం అనంతరం ఇస్రో కీలక ఆదిత్య L1 ప్రాజెక్టు ప్రయోగించింది. ఇందులో భాగంగా భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న లాంగ్రాజ్ పాయింట్ నుంచి సూర్యుడి పరిస్థితులను నిశితంగా గమనించనుంది. ఇందులో భాగంగా 7 కీలక పేలోడ్లను పంపింది. జనవరి నాటికి ఆదిత్య L1.. లాంగ్రాజ్ పాయింట్కు చేరుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








