ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 3.39 కోట్లు.. 4 కిలోల బంగారంతో తయారుచేసిన ఈ సైకిల్ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!!
దుబాయ్లో రూ.3.39 కోట్ల విలువైన సైకిల్ను విడుదల చేశారు. వామ్మో సైకిల్ ధర మూడున్నర కోట్ల రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారా.. సైకిల్ ధర ఇంత ఉండటానికి కారణమేంటని మీకు డౌట్గా ఉంది కదా.. ఎందుకంటే ఈ సైకిల్ను పూర్తిగా బంగారం(Golden Cycle)తో తయారు చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రధాన కేంద్రమైన షార్జా(Watch And Jewellery Expo In Sharjah)లో 52వ వాచ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పో జరిగింది. దుబాయ్లోని అల్ రొమైసన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ స్టోర్ ఈ బంగారు సైకిల్ను తయారుచేసి ప్రదర్శించింది. దుబాయ్ కరెన్సీలో ఈ గోల్డెన్ సైకిల్ ధర 15 లక్షల దిరంస్ ఉంటుందని సమాచారం. అంటే భారత కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాలా రూ.3.39 కోట్లు.

ఈ సైకిల్ను స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. అల్ రొమైసన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ స్టోర్ నిర్వాహకులు దీనిని జ్యువెలరీ ఎగ్జిబిషన్(Golden Cycle in Sharjah Exhibition)లో ప్రదర్శించారు. ఈ సైకిల్ను బ్రిటీష్ రేస్ సైకిల్ మాదిరిగా డిజైన్ చేయడం మరో ప్రత్యేకం. ఇందులో పూర్తిగా 24 క్యారెట్ల బంగారం వినియోగించారు.
కాగా ఈ గోల్డెన్ సైకిల్ మొత్తం బరువు 7 కిలోలు ఉంటుంది. ఇందులో 24 క్యారెట్ల బంగారం 4 కిలోలు మాత్రమే ఉపయోగించారు. ఈ సైకిల్పై హ్యాండిల్ బార్, వీల్ స్టేలు, గేర్లు మరియు చైన్లు అన్నీ పూర్తిగా బంగారంతో తయారు చేశారు. నిగనిగలాడే ఫినిషింగ్తో సైకిల్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
మరో విశేషమేమిటంటే ఈ బంగారు సైకిల్ను పూర్తిగా చేతితో తయారు చేశారు. ఇందుకోసం 20 మంది ఉద్యోగులు ఆరు నెలల పాటు పనిచేశారు. కంపెనీ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ మహ్మద్ అబ్బాసీ తొలిసారిగా గోల్డెన్ సైకిల్ను విడుదల చేశారు. ఈ సైకిల్ను ఎగ్జిబిషన్లో వీక్షించడమే కాకుండా కొనుగోలు చేయాలనుకునే వారు కూడా దాని కోసం పోటీపడవచ్చు.
ఈ సైకిల్ను కొనుగోలు చేసేవారు దానిని ఇంట్లో షోపీస్గా ఉంచడమే కాకుండా రోడ్డుపై కూడా ప్రయాణించేలా అన్ని సౌకర్యాలతో దీన్ని తయారుచేశారు. అందుకే మొత్తం 7 కిలోల గోల్డెన్ సైకిల్లో 4 కిలోల బంగారాన్ని మాత్రమే వినియోగించారు. ఇతర 3 కేజీల్లో సైకిల్ యొక్క స్థిరత్వం కోసం ఇతర లోహాలను ఉపయోగించారు.
షార్జాలో జరుగుతున్న ఈ జ్యువెలరీ ఎక్స్పోలో 500 స్థానిక మరియు అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొన్నాయి. వీరంతా తమ ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శించారు. అందులో ఈ బంగారు సైకిల్ పలువురి దృష్టిని ఆకర్షించింది. పలు గోల్డ్ కంపెనీలు వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించాయి.
భారత్లో చాలా మంది ప్రజలు చిన్న బంగారు వస్తువు కొనడానికే లక్షల్లో ఖర్చు అవుతుండగా.. మరి ఇప్పుడు ఈ బంగారు సైకిల్ను ఎవరు సొంతం చేసుకుంటారోనని ప్రజల్లో చాలా ఆసక్తి నెలకొంది. దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి ఈ సైకిల్ను రోడ్డుపై నడిపిస్తాడా అనే ప్రశ్న కూడా తలెత్తింది.
సాధారణంగా 24 క్యారెట్ల బంగారం ఉంటే అందులో బంగారు నగలు తయారు చేయలేరు. 22 క్యారెట్లు ఉంటేనే బంగారు ఆభరణాలు మంచిగా తయారు చేసే అవకాశం ఉంటుంది. అయితే షార్జాలోని ఈ నగల వ్యాపారి 24 క్యారెట్ల బంగారంతో సైకిల్ను తయారు చేయడం ఆశ్చర్యకరం. సైకిల్లోని అన్ని బంగారు భాగాలు 24 క్యారెట్ల బంగారంతో మాత్రమే తయారు చేశారు.
ఈ సైకిల్ ధర లగ్జరీ ఎస్యూవీ కారు రోల్స్ రాయిస్(Rolls Royce) ధరను మించిపోవడం ఆశ్చర్యకరం. సైకిల్ను ఎక్కువగా విద్యార్థులు, నిరుపేదలు నిత్యావసరాల కోసం వాడతారు. కానీ ఇప్పుడు సైకిళ్లు కూడా యూత్ను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా మార్కెట్లోకి తెస్తున్నారు. కానీ ఇప్పుడు ఇన్న కోట్ల విలువైన సైకిల్ను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications








