చేసేది చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం.. కానీ రూ.14 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు, సూపర్ బైకులు కొన్నాడు.. అదెలా?
చేసేది ప్రభుత్వ ఉద్యోగం, జీతం నెలకు రూ.1.5 లక్షలు. కానీ ఆయన లైఫ్స్టైల్ మాత్రం ఏకంగా అత్యంత ధనవంతులు ఉండే విధంగా ఉంటుంది. కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు, బైకులు అతని వద్ద ఉన్నాయి. లక్షల జీతం అందుకునే వ్యక్తి ఇలాంటి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడనే అనుమానంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయగా, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతని వద్ద పోర్షే, ల్యాండ్ రోవర్ సహా లగ్జరీ కార్లు, ట్రయంఫ్, BMW వంటి బ్రాండ్లకు చెందిన ఖరీదైన బైక్లను చూసి అధికారులు కంగుతిన్నారు. కార్లు, బైకులతో పాటు ఆస్తుల విలువను లెక్కగట్టగా దాదాపు రూ.14 కోట్లకు పైగా ఉంది. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, రాజస్థాన్లో ఛత్రపాల్ సింగ్ అనే వ్యక్తి ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ రాజ్కాంప్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ గ్రూప్ జనరల్ మేనేజర్ (టెక్నాలజీ)గా పనిచేస్తున్నారు. అతను తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఛత్రపాల్ సింగ్కు సంబంధించిన ఆస్తులపై దాడులు చేశారు.

జైపూర్, హనున్ఘర్, ఢిల్లీ, ఘజియాబాద్తో సహా ఇతర ప్రాంతాల్లో అతని సంబంధికుల ఇళ్లు, ఇతర ఆస్తులపై దాడులు చేయగా, ఈ దర్యాప్తులో అధికారులు ఛత్రపాల్ సింగ్ లగ్జరీ లైఫ్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కోట్ల ఆస్తులతో పాటు, కోట్ల ఆదాయాన్ని సంపాదించే వారు ఉపయోగించేటటువంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు, బైకులు అతని వద్ద ఉన్నట్లు తెలిసింది.
అధికారులు కనిపెట్టిన వాటిలో 2 కోట్ల రూపాయల విలువైన పోర్షే కెయెన్ ఎస్యూవీ ఉంది. సాధారణంగా దీనిని కొనాలంటే కొన్ని లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా కోటిన్నర రూపాయలకు పైగా ఉండే ల్యాండ్ రోవర్ డిఫెండర్,షెవర్లే క్రూజ్, మహీంద్రా స్కార్పియో N 4×4 వేరియంట్ హై-ఎండ్ మోడల్, దీని ధర దాదాపు రూ. 25 లక్షలు, థార్ 4×4 మోడల్ ధర దాదాపు రూ.20 లక్షలు.

ఇవే కాకుండా, లక్షల విలువ చేసే ట్రయంఫ్, BMW మోటోరాడ్ వంటి బ్రాండ్లకు చెందిన ఖరీదైన బైక్లు కూడా ఛత్రపాల్ సింగ్ వద్ద ఉన్నాయని అధికారులు కనిపెట్టారు. ఇవి మాత్రమే కాకుండా అజ్మీర్ రోడ్డులో ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే, మహదేవ్ నగర్లో అతని సొంత ఇంట్లో రూ.6 లక్షల నగదు లభ్యమైంది.
రెండు ఖరీదైన ఫ్లాట్ల పత్రాలు, రాజా పార్క్ వద్ద సింప్లీ డివైన్ పేరుతో స్పా సెంటర్కు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు గుర్తించారు. అశోక్ నగర్లో హ్యాపీ హార్ట్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ను కూడా నిర్వహిస్తున్నాడు. ఈ రెండు సంస్థలను కూడా అతని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఛత్రపాల్ సింగ్తో పాటు అతని సంబంధికుల బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు పరిశీలించారు.

బీమా పాలసీలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు సోదాల్లో కనిపెట్టారు. బ్యాంకు లాకర్లతో పాటు అన్ని ఆస్తులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వారు, విదేశాల్లో కూడా అతనికి ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఖరీదైన రిసార్ట్లలో బస చేయడంపై కూడా విచారణ జరుపుతున్నారు.
తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లకు పడగలెత్తిన ఛత్రపాల్ సింగ్ను అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మరింత సమాచారం ఆయన నుంచి రాబట్టడానికి విచారణ ప్రారంభించారు. ఈ అవినీతిలో అతనికి ఎవరైనా సహకరించారా అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications








