కార్ల ధరలు భారీగా పడిపోనున్నాయి! దీపావళి తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది పెద్ద దెబ్బ అవుతుందా?
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన తన ప్రసంగంలో, దీపావళి నాడు భారత ప్రజలకు ఒక పెద్ద బహుమతి అందిస్తామని సూచనప్రాయంగా చెప్పడం, ఆ బహుమతి GST రూపంలో ఉండబోతుందని అర్థమవుతోంది. దీని వలన దేశవ్యాప్తంగా పన్ను విధానాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వాహనాల రంగంలో ఈ మార్పులు ప్రభావం చూపబోతున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాహనాలపై 28 శాతం వరకు GST పన్ను విధిస్తున్నారు. దీని వలన వాహనాల ధరలు మరింతగా పెరిగి వినియోగదారులపై భారమవుతున్నాయి.
అయితే దీపావళి సమయానికి ఈ పన్ను 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించవచ్చని సమాచారం వెలువడింది. పన్ను తగ్గింపుతో వాహనాల ధరలు తగ్గడం ఖాయం కావడంతో, ఆటోమొబైల్ రంగం మరింత పుంజుకునే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే, గత కొంతకాలంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండటం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం వంటి అంశాలు వినియోగదారులను EVల వైపు మళ్లించాయి.

అయితే GST పన్ను తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఐసీఈ ఇంజిన్ వాహనాలే వినియోగదారుల దృష్టిని ఆకర్షించవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. HSBC ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, GST తగ్గింపు తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోల్/డీజిల్ వాహనాల మధ్య ధర వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా, వినియోగదారులు తక్కువ ధరలో లభించే ICE ఇంజిన్ కార్లను కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొంది.
ఈ పరిస్థితి పర్యావరణ పరిరక్షణకు ప్రతికూలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును పూర్తిగా రద్దు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదును మరింత తగ్గించడం ద్వారా మాత్రమే వినియోగదారులను వాటి వైపు ఆకర్షించగలరు. లేదంటే, రాబోయే నెలల్లో ICE ఇంజిన్ వాహనాల అమ్మకాలు మళ్లీ ఊపందుకోవడం, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం మందగించడం తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన పురోగతి సాధించినా, ఇంకా ఇది పూర్తిస్థాయి అభివృద్ధి దశలోకి ప్రవేశించలేదని చెప్పాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విభాగం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉందని నిపుణులు భావిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి, మౌలిక వసతుల కొరత, అధిక ప్రారంభ ఖర్చులు వంటి అనేక అంశాలు ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FADA) విడుదల చేసిన తాజా గణాంకాలు దీనికి నిదర్శనం. టాటా మోటార్స్ ఆధ్వర్యంలో జూలై నెలలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 93 శాతం పెరిగాయి. ఈ వృద్ధి శాతం భారత వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై చూపుతున్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో GST పన్నులు యథాతథంగా కొనసాగితే, అంటే వాటిలో ఎటువంటి మార్పులు లేకపోతే, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పన్ను స్థాయిలు తగ్గకపోయినా, వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఆసక్తితో ఈ వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, ఇంధన ధరల పెరుగుదల, పర్యావరణ అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు వంటి అంశాలు ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈవీలపై ఉన్న పన్నులను పూర్తిగా తొలగిస్తే, రానున్న రోజుల్లో వీటి అమ్మకాలు భారీగా పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ రాబోయే కొత్త GST ద్వారా ధరలు భారీగా తగ్గితే ప్రజలు ICE ఆధారిత వాహనాలపై మరింత ఆసక్తి కనబరిచి ఈవీలపై తక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








