Rains in Telugu States తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన వందలాది వాహనాలు.. భయపెడుతున్న వీడియోలు!
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రెండు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా అక్కడి స్థానిక ప్రజలు అల్లాడుతున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగాయి. ఈ వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లడంతో వందల సంఖ్యలో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి.
గతంలో ఎన్నడూ లేనంత విధంగా వరుణ దేవుడు ప్రతాపం చూపడంతో రెండు రాష్ట్రాల్లోని రోడ్లు, రైల్వే ట్రాకులు, ఇతర ఆనకట్టలు పూర్తిగా తెగిపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. ప్రస్తుతం వీటిని పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో రానున్న మరో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో మంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ప్రస్తుతం విజయవాడ, ఖమ్మం అంధకారంలో ఉండగా.. సామాజిక మాధ్యమాల్లో ఈ వర్షాలకు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. చాలాచోట్ల బైక్లు కార్లు వర్షాల్లో కొట్టుకుపోతున్న వీడియోలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాహనదారులు తేరుకునే లోపే వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వీటి సంగతి పక్కన పెడితే వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ముందుగా తమను, తమ కుటుంబాలను రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
భారీ వరదల కారణంగా కరెంటు కష్టాలు, రవాణా స్తంభించిపోవడం, ఆకలి ఆర్తనాధాల మధ్య తెలుగు రాష్ట్రాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే విజయవాడలోని ఓ షోరూంలో నిలిపిన 300కు పైగా కొత్త కార్లు పూర్తిగా నీటిమట్టమయ్యాయి. అయితే ఇవి ఓ డీలర్షిప్ వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అన్ని కొత్త కార్లు పూర్తిగా నీటిమట్టం కావడంతో ఈ విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

చాలా వరకు కార్లు, బైక్లు, ఇతర వాహనాలు జేసీబీలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయీయి. తప్పిపోయిన వాహనాలన్నీ ఇప్పుడు వరద నీరు తగ్గిన చోట ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే పూర్తి వర్షం నీటిలో మునిగిపోవడంతో వీటికి ఖర్చు చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వినియోగదారులకు అదనపు ఖర్చు కానుంది. అయితే చాలామంది వాహనాలు ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. కచ్చితంగా ఏదో ఒకచోట తమ వాహనం దొరుకుతుందని భావిస్తున్నారు.
వర్ష ప్రభావంతో రెండు రాష్ట్రాలకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ NH 65 హైవే 30 గంటల రాకపోకలు స్థభించిపోయాయి. వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వాహనాలను అనుమతిస్తున్నారు. ఇది ప్రధాన రహదారి కావడంతో రెండు రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వర్ష ప్రభావంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి.
నిన్న, మొన్న వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా పంట నష్టం, ఆస్తి నష్టం ఇతర పునరావాస కేంద్రాలపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నాయి. వరద ఉధృతితో నిరాశ్రయులుగా మిగిలిపోయిన వారికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. అధికార యంత్రాంగం, ఎన్జీవోలు, ఇతర సామాజిక సేవా సంస్థలు ఈ సహాయక చర్యలు పాల్గొంటున్నాయి.
పూర్తిగా దెబ్బతిన్న పట్టణాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా సహాయక కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితి సహాయక చర్యలకు సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.


Click it and Unblock the Notifications








