భారతీయ రైల్వేలో మరో సంచలనం.. గంటకు 280 కిమీ వేగంతో వెళ్లే హైస్పీడ్ రైలు..
భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని కొత్తగా తయారవుతుంది. ఇటీవల మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వందే భారత్ రైళ్లను తీసుకురాగా ఇవి దేశంలో పరుగులు పెడుతున్నాయి. ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కూడా ఇవి మరింత వేగంతో ప్రయాణిస్తూ ప్రయాణికుల జర్నీ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాయి. ఈ రైళ్ల రాకతో భారతీయ రైల్వే గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇతర దేశాల్లో ఇలాంటి రైళ్లను తయారు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ భారత్ మాత్రం దేశీయంగానే అతి తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేసి, ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. వీటి తయారీకి తక్కువ ఖర్చు అయినప్పటికి వీటిలో అన్ని అధునాతన సదుపాయాలే ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్ ధరలు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది.
భారతీయ ప్రజలు కూడా క్రమంగా ఫాస్ట్గా వెళ్లే రైళ్లకు అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైల్వేను మరో మెట్టు పైకి తీసుకెళ్లడానికి భారీ మొత్తంలో ఈ శాఖకు కేటాయిస్తుంది. కొత్తగా అధునాతన రైళ్లను ప్రవేశపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్రమంలో హైస్పీడ్ రైళ్లు తీసుకురావడానికి గతంలోనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని తెలుస్తుంది.

అన్ని కుదిరినట్లుతే అతి త్వరలోనే భారత్లో మొట్టమొదటి హైస్పీడ్ రైలు పట్టాలెక్కనుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది. భారతీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, గంటకు 280 కి.మీ వేగంతో దూసుకుపోయే హైస్పీడ్ రైలును త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఇవి అధునాతన టెక్నాలజీతో తయారు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు అనంత నాయక్, సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నలకు రాత పూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి తన వివరణలో, ఒక్కో హైస్పీడ్ రైలు తయారీకీ పన్నులు మినహా దాదాపు రూ.28 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపారు. వీటిని ప్రస్తుతం చెన్నైలోని ICF(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ)లో BEML(భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) జాయింట్ వెంచర్గా ఈ హైస్పీడ్ రైళ్లను రూపొందించాలని చూస్తున్నారు.

ప్రపంచంలోని ఇతర దేశాల్లో హస్పీడ్ రైళ్ల తయారీకి అవుతున్న ఖర్చుతో పోలిస్తే భారత్లో తయారవుతున్న హస్పీడ్ రైళ్ల ఖర్చు చాలా తక్కువే అని, ఇలాంటి వాటిని నిర్మించడానికి చాలా సంక్లిష్టమైన, టెక్నాలజీ అవసరమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఈ హైస్పీడ్ రైలు ఏరోడైనమిక్ డిజైన్ను కలిగి ఉంది. చాలా అధునాతన ఫీచర్లతో దీన్ని రూపొందిస్తున్నారు. స్టేషన్లలో ఆగినప్పుడు ఆటోమెటిక్గా తెరుచకునే డోర్లు, CCTV కెమెరాలు వంటివి ఉంటాయి.
ఇంకా, సరికొత్త హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, మొబైల్ ఛార్జింగ్, మెరుగైన లైటింగ్,ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని అధునాతన సౌకర్యాలు ఈ రైళ్లలో ఉంటాయి. అధిక వేగంతో ప్రయాణించే రైళ్ల డిజైన్, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్ల కెపాసిటీని గుర్తించిన ఇతర దేశాలు, ఈ రైళ్లను తమకు ఇవ్వాలని కోరుతున్నాయి.
త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో దూసుకుపోయే రైళ్లను తీసుకు వచ్చినట్లయితే భారతీయ రైల్వే గురించి ప్రపంచంలోని ఇతర దేశాలు గొప్పగా మాట్లాడుకుంటాయి. ఎక్కువ ఖర్చుతో వీటిని రూపొందిస్తున్న దేశాలు కూడా క్రమంగా ఈ రైళ్ల కోసం తక్కువ వ్యయంతోనే తయారు చేసే భారత్ వైపు చూస్తాయి.


Click it and Unblock the Notifications








