టూ వీలర్స్ వినియోగంలో రికార్డ్ సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే నెం.1 గా..
భారత్లో టూ వీలర్ లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. మధ్య తరగతి ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ వారికి అభిరుచికి అనుగుణంగా టూ వీలర్స్ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టూ వీలర్ రిజిస్ట్రేషన్ లిస్ట్లో మనం దేశం రికార్డు సృష్టించింది.
'రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇయర్(Road Transport Year)' బుక్ ప్రకారం ఇండియాలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. ఇది భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరియు ఆటో రంగంలో అతిపెద్ద మార్కెట్గా నిలవడానికి దోహదపడింది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్ 2020 డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదికల ప్రకారం, ప్రపంచంలో అత్యధిక ద్విచక్ర వాహనాలను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచింది. తర్వాతి స్థానంలో ఇండోనేషియా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక కార్లు ఉన్న దేశాలను పరిశీలిస్తే.. మొదటి మూడు స్థానాల్లో చైనా, అమెరికా, జపాన్ ఉండగా, భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
నివేదిక ప్రకారం, 2020లో భారతదేశంలో మొత్తం 32.63 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఈ నిర్దిష్ట గణాంకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల డేటా ఆధారంగా సేకరించారు. ఈ డేటా ప్రకారం, 2020లో 32.63 కోట్ల వాహనాల్లో 75 శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అదేవిధంగా, గత మూడేళ్లలో దేశంలో రెండు కోట్లకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

ఈ గణాంకాల ద్వారా ఈ జూలై మిడ్ వరకు ఉన్న మొత్తం గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వ వాహన్ పోర్టల్లో దాదాపు 34.8 కోట్ల వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా 3.78 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
3.49 కోట్ల వాహనాలతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 3.21 కోట్ల వాహనాలతో తమిళనాడు మూడో స్థానాన్ని దక్కించుకుంది. నగరాల విషయానికి వస్తే, ఢిల్లీ మరియు బెంగళూరు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలో దాదాపు 1.18 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉండగా, బెంగళూరులో 96.4 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, దేశ రాజధాని ఢిల్లీ నగరం గరిష్ఠ సంఖ్యలో రిజిస్టర్డ్ ప్రైవేట్ వాహనాలను కలిగి ఉంది. దాని పొరుగున ఉన్న నగరం ఫరీదాబాద్లో గరిష్ఠంగా 18.6 లక్షల రిజిస్టర్డ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కమర్షియల్ వాహనాలను కలిగి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కాగా దేశంలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల్లో 34 శాతం ప్రైవేట్ వాహనాలే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో తగినంత ప్రజా రవాణా లేకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ వాహనాలపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి దేశంలో కార్ల కంటే ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉండటంతో టూ వీలర్లపై ఎంతగా ఆసక్తి కనబరుస్తున్నారో స్పష్టమవుతోంది.
ముందుగా చెప్పినట్లుగా, మొత్తం వాహనాల సంఖ్యలో 75 శాతం ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. కాగా దేశంలో ద్విచక్ర వాహనాల వాటా పెరుగుతున్న కొద్దీ ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. టూ వీలర్ యూక్సిడెంట్లతో పోలిస్తే కారు ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో, 2021లో మరణించిన ద్విచక్ర వాహనదారుల సంఖ్య వరుసగా 69,385కి పెరిగింది. ఇది మొత్తం రోడ్డు ప్రమాద మరణాలలో 45 శాతంగా ఉంది. మలేసియా వంటి కొన్ని దేశాల్లో 50 శాతం వాహనాలు ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లేన్లను ఆ దేశ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశం కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








