Tips for Safe Train Journey ఇలా చేస్తే రైలు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు..
గత వారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం భారతదేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతుండగా.. రైలు ప్రమాదానికి సంబంధించి కొన్ని ముఖ్య కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్లాకింగ్ మరియు బాండింగ్ పద్ధతిలో సమస్య ఉందని అధికారులు చెప్పారు.
జూన్ 2వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో షాలిమార్ నుంచి చెన్నైకి వెళ్లే కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు మరియు గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దేశంలో ఇది 3వ అత్యంత దారుణమైన రైలు ప్రమాదం.

ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘోర రైలు ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. రైలు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ మరియు పాయింటింగ్ సిస్టమ్లో సమస్య తలెత్తడంతో ప్రమాదానికి దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ప్రమాదం ఎలా జరిగిందనే తీరును పరిశీలిస్తే బాలాసోర్ పక్కన ఉన్న బజార్ రైల్వే స్టేషన్లో మొత్తం రెండు ప్రధాన లైన్లు మరియు రెండు లూప్ లైన్లు ఉన్నాయి. బజార్ రైల్వే స్టేషన్ చిన్న స్టేషన్ కావడంతో చాలా వరకు రైళ్లు అక్కడ ఆగవు.

ఇతర ముఖ్యమైన రైళ్లు వచ్చినప్పుడు సాధారణ రైళ్లను నిలిపివేసేలా ఇక్కడ లూప్ లైన్లను రూపొందించారు. దుర్ఘటన జరిగిన రోజు ఇక్కడ రెండు లూప్ లైన్లలో సరుకు రవాణా రైళ్లను నిలిపివేశారు. ఒక ప్రధాన లైన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్, మరో మెయిన్ లైన్లో బెంగళూరు - హౌరా ఎక్స్ప్రెస్ వెళ్లేందుకు సంకేతాలు ఇచ్చారు.
ఆ తర్వాత మెయిన్లైన్కు బదులు కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు లూప్లైన్లో మారి గూడ్స్ రైలును ఢీకొట్టిందని సమాచారం. లూప్ లైన్లోకి వెళ్లేలోపే రైలు పట్టాలు తప్పిందని మరికొందరు అంటున్నారు. ఇప్పుడు మెయిన్లైన్లో వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి ఎలా మారిందన్నదే అసలైన సందేహం.

లూప్ లైన్లో ఉన్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ముందున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ట్రాక్లోని బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ యొక్క చివరి కొన్ని బోగీలను మాత్రమే ఢీకొట్టింది, ఈ ఘటనలో మూడు రైళ్లు దెబ్బతిన్నాయి. ప్యాసింజర్ రైలులో ఉన్న పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
లూప్ లైన్ మరియు మెయిన్ లైన్ మధ్య రైలు మారడం ఇంటర్లాకింగ్ అనే సిస్టమ్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది రైలు స్థానం, సిగ్నలింగ్ సిస్టమ్ మరియు సిగ్నల్ కంట్రోల్ రూమ్ కలయిక. ట్రాక్ స్థానం మరియు సిగ్నల్స్ కంట్రోల్ రూమ్లో ఇచ్చిన సిగ్నల్కు స్వయంచాలకంగా మార్చబడతాయి.

ఈ ప్రమాదంపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి.. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి పట్టుబడ్డాడని అన్నారు. ఈ ప్రమాదంపై ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రమాదమా.. లేక మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదమా.. లేక సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఏర్పడిందా అనేది విచారణ ముగిశాక తెలుస్తుంది.
అయితే ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి పాల్ వోర్లీ కొన్ని సూచనలు చేశారు. వాటిని పాటించడం ద్వారా రైలు ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చని చెబుతున్నారు.

రైలులో ప్రయాణించేటప్పుడు ముందు, వెనుకా బోగీలలో కాకుండా మధ్య బోగీలలో కూర్చోవడం ఉత్తమమని వోర్లీ చెబుతున్నారు. ముందు వెనుకా బోగీలలో అధిక శక్తి కేంద్రీకృతమై ఉంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్కడ నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
రైలులో ప్రయాణించేటప్పుడు ఇంజిన్కు ఫేస్ చేస్తూ కూర్చోవడం కంటే ఇంజిన్కు వెనుకవైపు కూర్చోవాలని వోర్లీ పేర్కొన్నారు. దీని వల్ల రైలు చిన్నగా కదిలినా లేదా సడెన్గా ఆగిపోయినా ముందుకు పడకుండా సీట్లోనే వెనక్కి వాలే అవకాశం ఉంది. దీని ద్వారా కింద పడిపోయే అవకాశం తక్కువ.

ట్రైన్లో వెళ్లేటప్పుడు విండో సీట్ను ఇష్టపడని వారుండరు. కానీ ట్రైన్ జర్నీలో విండో పక్కన కూర్చోవడం రక్షణగా ఉంటుందని వోర్లీ అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా, సిబ్బంది నుంచి హెచ్చరికలు జారీ అయినా.. ఎమర్జెన్సీ విండోను ఓపెన్ చేసి బయటకు దూకేయొచ్చు
అత్యవసర పరిస్థితి ఎదురైతే ట్రైన్ డోర్ ద్వారా బయటకు వెళ్లవచ్చు. వాటిని మాన్యువల్గా తెరవడానికి ఒక మార్గం ఉంది. దేశంలోని ప్రతి రైలులో అత్యవసర సంకేతాలు ఉంటాయి. ఆ గుర్తును చూడగలిగితే, రైలు తలుపు తెరవవచ్చు. తలుపు పక్కన ఉన్న ప్యానెల్లో లాక్ని ఎత్తాలి. రింగ్ని తెరిచి, ఆపై రెడ్ హ్యాండిల్ను క్రిందికి నెట్టాలి. తలుపులు కొద్దిగా తెరుచుకుంటాయి. ఆ తర్వాత సునాయాసంగా డోర్లు తెరవచ్చు.


Click it and Unblock the Notifications








