కాలువలో చిక్కుకున్న నౌక; వణికిపోతున్న ప్రపంచ దేశాలు; ధరలు పెరిగే ప్రమాదం!
ఓ చిన్న కాలువలో చిక్కుకున్న ఓ పెద్ద నౌక ఇప్పుడు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. నౌకామార్గంలో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్ కాలువలో ఇప్పుడు ఓ అత్యంత భారీ నౌక కాలువకు అడ్డంగా నిలిచిపోయింది.

ఈ మార్గం గుండా నిత్యం వందలాది రవాణా నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేసే పనామాకు చెందిన ఎవర్గ్రీన్ అనే భారీ నౌక సూయజ్ కాలువ మార్గంలో అడ్డంగా ఇరుక్కుంది. ఈ నౌక యజమానిక జపాన్కు చెందిన వ్యక్తి, ఇందులో 25 మంది సిబ్బంది ఉన్నారు, వారంతా భారతీయులేని ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిసింది.

సూయజ్ కాలువను అడ్డుగా బ్లాక్ చేస్తున్న ఈ భారీ నౌక కాలువకు రెండు వైపులా ఇసుకలో కూరుకుపోయింది. దీని ఫలితంగా కాలువకు ఇరువైపులా ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ఈ మార్గం గుండానే మనదేశానికి క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. ఇప్పుడు ఈ మార్గంలో వందలాది చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

ఎవర్గ్రీన్ నౌక ఈ కాలువను బ్లాక్ చేయటంతో రోజుకి దాదాపుగా వెయ్యి కోట్ల డాలర్లు నష్టం వస్తున్నట్టుగా అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు గంటకు సుమారు 2 వేల 600 కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లుతోంది. అంటే రోజుకు 62 వేల 400 కోట్లు. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికే 3 రోజులైంది. అంటే దీని వల్ల ఇప్పటికే లక్షా 87 వేల 200 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిపోయింది.

భారత్ సహా మరెన్నో ప్రపంచ దేశాల క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనా ఈ ప్రమాదం భారీ ప్రభావాన్ని చూపనుంది. ఈజిప్ట్లో ఉన్న ఈ సూయజ్ కాలువ మొత్తం పొడవు 120 మైళ్లు. వాణిజ్య రవాణా కోసం ఈ కాలువను పూర్తిగా మనుషులే నిర్మించారు. ఈ కాలువలో కొన్ని ప్రాంతాల్లో మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది.

అలాంటి ఓ ప్రదేశంలోనే ఎవర్గ్రీన్ నౌక కాలువకు అడ్డుగా ఇరువైపులా బురదలో కూరుకుపోయింది. ప్రయాణంలో ఉన్నప్పుడు వచ్చిన తుఫాన్, భారీ గాలుల కారణంగా నౌక దిశ తప్పిందని చెబుతున్నారు. భారీ యంత్రాల సాయంతో నౌకకు ఇరువైపు ఉన్న మట్టిని తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎవర్గ్రీన్ నౌక చాలా భారీగా ఉంటుంది. పొడవులో ఇది ఐఫిల్ టవర్ కంటే పెద్దది, సుమారు మూడు ఫుట్బాల్ గ్రౌండ్ల పరిమాణంలో ఉంటుంది. ఈ నౌకలో మొత్తం పన్నెండు అంతస్తులు ఉన్నాయి. ఇది సుమారు 1300 అడుగుల పొడవు, 193 అడుగుల వెడల్పును కలిగి ఉంటుంది.

ఎవర్ గ్రీన్ నౌక ప్రమాదం కారణంగా భారతదేశానికి రావల్సిన 13 మిలియన్ బారెల్స్ ముడి చమురును తీసుకొస్తున్న 10 నౌకలు సముద్ర మార్గంలోనే నిలిచిపోయాయి. దీని కారణంగా భారత్కు క్రూడ్ ఆయిల్ దిగుమతి ఆలస్యం కానుంది. ఫలితంగా, మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సుమారు 120 మైళ్లున్న సూయజ్ కాలువను 1869లో నిర్మించారు. ఈ కాలువ ఉత్తరాన ఉన్న మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్ దేశాల నుంచి చమురు యూరప్ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలన్నా ఈ కాలువే ఆధారం.

మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. ప్రపంచంలోని మొత్తం వాణిజ్య నౌకల్లో 30 శాతం నౌకలు ఈ కాలువ మీదుగానే ప్రయాణిస్తాయి. ప్రమాదంలో చిక్కుకున్న ఎవర్గ్రీన్ భారీ నౌకను బయటుకు తీసేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. ఇందుకు ఖచ్చితంగా ఎన్ని రోజుల సమయం పడుతుందనేది వారు చెప్పలేకపోతున్నారు.

ఎవర్గ్రీన్ నౌక ఇప్పటికే ఫుల్ కెపాసిటీతో ప్రయాణిస్తోంది. ఇందులో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు ఉన్నట్లు సమాచారం. మరికొన్ని రోజులు ఈ కాలువ ఇలానే బ్లాక్ అయితే, యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావటం ఖాయమని తెలుస్తోంది. సరుకు రవాణా నిలిచిపోవటం కారణంగా ఇంధన మరియు నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications








