Vande Bharat Express: స్పీడ్ పెంచిన వందే భారత్ ఎక్స్ప్రెస్.. తగ్గిన హైదరాబాద్ టు బెంగళూరు జర్నీ టైమ్.!!
రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇకపై హైదరాబాద్- బెంగళూరు వందేభారత్ రైలులో ప్రయాణించే వారు కాస్త ముందుగానే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ మేరకు కాచిగూడ- యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వేగాన్ని పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ప్రసిద్ధి చెందాయి. సాధారణ రైళ్లతో పోలిస్తే చాలా వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్ రేళ్లను విడతల వారీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. కాగా త్వరలో వందే భారత్ సాధారణ్, స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కాచిగూడ(హైదరాబాద్)- యశ్వంత్పూర్(బెంగళూరు) మధ్య సేవలందిస్తున్న వందేభారత్ రైలు స్పీడ్ను వేగవంతం చేసినట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు బుధవారం(డిసెంబర్ 20న) ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ప్రయాణ సమయం 15 నిమిషాలు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.
కాచిగూడ- యశ్వంత్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణానికి ఇంతకుముందు 8 గంటల 30 నిమిషాలు పట్టేది. దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనతో ప్రయాణ సమయం ఇప్పుడు 8 గంటల 15 నిమిషాలకు చేరుకుంది. ఈ సవరించిన షెడ్యూల్ కూడా గురువారం (డిసెంబర్ 21) నుంచి అమల్లోకి వచ్చింది.

సవరించిన షెడ్యూల్ ప్రకారం కాచిగూడ(Kachiguda)- యశ్వంత్పూర్(Yeshwanthpur) వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇక నుంచి ఉదయం 5.45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. యశ్వంత్పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
కాచిగూడ (హైదరాబాద్) - యశ్వంత్పూర్ (బెంగళూరు) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ రైలు 100 శాతం ప్రయాణీకుల సామర్థ్యంతో నడుస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్తో పాటు అందులోని అత్యాధునిక సౌకర్యాలతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులను ఆకర్షిస్తోంది.
కాగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి 15, 2023న ప్రారంభమైంది. ఏపీలోని సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ స్టేషన్లలోనే ఆగుతుంది. అనంతరం ఏప్రిల్ 8, 2023న తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలును మోదీ ప్రారంభించారు. హైదరాబాద్- తిరుపతి మధ్య ప్రయాణించే ఈ రైలు కేవలం 8 గంటల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంటుంది.
సాధారణ రైళ్లలో 24 కోచ్లు ఉండగా.. అదే వందేభారత్ ఎక్స్ప్రెస్లో కేవలం 16 బోగీలు మాత్రమే ఉంటాయి. వందే భారత్ రైళ్లలో అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. వందే భారత్ ఆటోమేటిక్ డోర్ల నియంత్రణను పూర్తిగా డ్రైవర్ కలిగి ఉంటారు. ప్లాట్ఫారమ్ ఉన్న చోట మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. డోర్లు మూసిన వెంటనే వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








