మహాత్మా గాంధీ వద్ద ఒక్క కారు కూడా ఉండేది కాదా..?
అహింసా మార్గంలో స్వాతంత్ర్య సంగ్రామం జరిపిన మన జాతిపిత (ఫాదర్ ఆఫ్ నేషన్) మహాత్మా గాంధీ (పూర్తి పేరు: మోహన్దాస్ కరంచంద్ గాంధీ) జన్మదినం నేడు (అక్టోబర్ 2వ తేది). ఈ సందర్భంగా మనం ఆయను ఓసారి గుర్తు చేసుకుందాం. మన గాంధీ తాత అక్టోబర్ 2, 1869లో జన్మించారు. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావటంలో ఈయన పాత్ర చాలా కీలకమైనది.
మహాత్మా గాంధీ పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ, విలాసాలకు మాత్రం దూరంగానే బ్రతికాడు. అన్ని విలాసాలను త్యజించి ప్రజల కోసం పోరాటం మొదలు పెట్టాడు. చేతితో నేసిన పంచె కట్టుకొని, భుజం మీద కండువా వేసుకొని గాంధీజీ నడిచి వస్తుంటే, ఆయనకు జనం బ్రహ్మరథం పట్టేవారు. గాంధీజీ తన జీవిత ప్రయాణంలో ఎక్కువ దూరం కాలిబాటనే ఎంచుకునేవారు.
భారతదేశపు చరిత్రలో చెరగని ముద్ర వేసుకొన్ని బాపూజీ ఉపయోగించిన వస్తువులు, తిరిగిన/గడిపిన ప్రదేశాలు కూడా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకొని, చరిత్ర పుటల్లో మరపురాని ఘట్టాలుగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆయన కాలు మోపిన కొన్ని పురాతన కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మహాత్మా గాంధీ వద్ద అప్పట్లో కారు కొనుగోలు చేసేంత సంపద ఉన్నప్పటికీ, ఆయన ఎన్నడూ వాటిపై వ్యామోహ పడలేదు. అప్పట్లో కారు కలిగి ఉండటం అంటే, పెద్ద హోదాను కలిగి ఉండటంగా భావించే వారు. మహాత్మా గాంధీ ఒక్క కారు కూడా యజమాని కాలేకపోయారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

గాంధీజీ కారును కొనకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కారులో ప్రయాణించారు. అలా ఆయన ప్రయాణించిన కార్లలో ఒకటి ఈ పురాతన ఫోర్డ్ కారు. మహాత్మా గాంధీ ఈ కారులో ప్రయాణించిన తర్వాత, ఈ కారుకు మంచి పాపులారిటీ వచ్చింది.

బాపూజీ 1927లో ఉత్తరప్రదేశ్లోని బరేలీ సెంట్రల్ జైలు నుంచి ఈ ఫోర్డ్ టి సిరీస్ కారులో ప్రయాణం చేశాడు. ఆ తర్వాత ఈ కారు ఎన్నో చేతులు మారి ప్రస్తుతం పూనేలోని అబ్బాస్ జండేవాలా వద్దకు చేరింది.

పురాతన కార్లను సేకరించడమంటే అబ్బాస్కు భలే సరదా. అతని వద్ద సుమారు 30 పురాతన కార్లు ఉన్నాయి. పూనేలోని వివిధ పురాతన కార్ల షోరూమ్లలో ఈ కారును ప్రదర్శించటం కూడా జరిగింది.

అప్పట్లో ఈ ఫోర్డ్ టి సిరీస్ కారు అత్యంత ఖరీదైన మరియు ప్రాచుర్యమైన కార్లలో ఒకటి. ఒకరంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు ఎలాగో అప్పట్లో ఫోర్డ్ టి సిరీస్ అలాగన్నమాట.

బాపూజీ ప్రయాణించిన కార్లలో చెప్పుకోదగిన మరొక కారు రాజ్కోట్ మహారాజుకు చెందిన 'స్టార్ ఆఫ్ ఇండియా' అనే పురాతన రోల్స్ రాయిస్ కారు.

ఈ కారును మహారాజు కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ రాజ్కోట్ రాజ కుటుంబానికి మహాత్మా గాంధీ తండ్రి కరంచంద్ దివాన్గా పనిచేసేవారు. ఈ కారులో మహాత్మా గాంధీ, ఇంగ్లాండ్ రాణిలు ప్రయాణించారని చెప్పుకుంటారు.

మహాత్మా గాంధీజీకి 1928లో స్థాపించిన కుమార్ టాక్సీస్తో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. 1928లో ఎస్. కృష్ణన్ మరియు కె.బి. కుమరన్లు ఈ కంపెనీను ప్రారంభించారు. ఈ కంపెనీ బాపూజీ కూడా ఓ కస్టమరే. 1928లో గాంధీజీ 'ఓవర్ల్యాండ్ విప్పెట్' అనే కారులో ప్రయాణించారు.

అప్పట్లో 'ఓవర్ల్యాండ్ విప్పెట్' కారు ధర ఎంతో తెలుసా.. కేవలం 825 రూపాయల 12 అణాలు మాత్రమే. అంతేకాదు అప్పట్లో ఒక లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు మాత్రమే. కుమార్ టాక్సీస్కు చెందిన 'ఓవర్ల్యాండ్ విప్పెట్' కారులో గాంధీజీ తొలిసారిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ కారుకు 'జోసెఫ్ మిరాండా' అనే వ్యక్తి డ్రైవర్గా ఉన్నాడట.

గాంధీజీ రెండోసారి కుమార్ టాక్సీస్ వద్దకు వచ్చి కారును అద్దెకు అడిగినప్పుడు ఇది వరకు డ్రైవ్ చేసిన మిరాండానే డ్రైవర్గా కావాలని ఆయన కోరారని మోహన్ దాస్ పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మోరాజీ దేశాయ్, జేఆర్డి టాటా, ఏబి వాజ్పేయి, విజయ మాల్య, ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్లు కూడా ఒకప్పుడు ఈ కుమార్ టాక్సీక్ కస్టమర్లే. ఇప్పటికీ ఈ సంస్థ కార్యకాలాపాలు నిర్వహిస్తోంది.

జనవరి 30, 1948వ తేదీన గాడ్సే ఘాతుకానికి మన గాంధీ తాత బలయ్యారు. గాడ్సే తుపాకీతో గాంధీజీ కాల్చడంతో హేరామ్ అంటూ ఒక్కసారిగా నేలకు ఒరిగిపోయాడు. గాంధీజీ అంతిమ యాత్రలో లక్షలాధి మంది భారతీయులు పాల్గొని ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు.


Click it and Unblock the Notifications








