2047 నాటికి ‘వికసిత్ భారత్' లక్ష్యంగా పనిచేస్తున్నాం : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రధాని మోదీ
2047 నాటికి 'వికసిత్ భారత్'(Viksit Bharat) లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం ఆటో మొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2024(Bharat Mobility Global Expo 2024) లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
నిన్నటి(ఫిబ్రవరి 1) నుంచి రేపటి(ఫిబ్రవరి 3) వరకు దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ అప్కమింగ్ కార్లు, బైక్లను ప్రదర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి నేడు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆటోమొబైల్ కంపెనీల అధికారులను మరియు ఇతరులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇందులో మొబిలిటీ రంగం పాత్ర కీలకమని ఆయన వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ పాలనతో ప్రపంచంలోనే భారత్ మూడవ అతిపెద్ద ఎకానమీగా అవతరించిందని మోదీ పేర్కొన్నారు.
2014కు ముందు తొలి 10 ఏళ్లలో దేశంలో దాదాపు 12 కోట్ల వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయని ప్రధాని మోదీ తెలిపారు. కాగా, 2014 నుంచి దేశంలో 21 కోట్లకు పైగా వాహనాల విక్రయాలు నమోదయ్యాయని వివరించారు. గత పాలనలో ప్రతి ఏటా సుమారు 2,000 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతుండగా, ఇప్పుడు 12 లక్షల ఈవీల సేల్స్ నమోదవుతున్నాయని తెలిపారు. గత పదేళ్లలో ప్యాసింజర్ వాహనాలు సుమారు 60 శాతం పెరుగుదల నమోదు చేశాయన్నారు.

అదేవిధంగా రవాణా రంగానికి తాజా బడ్డెట్లో కేటాయింపులపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో రవాణా సౌలభ్యాన్ని పెంచడానికి ప్రకటించిన 3 రైల్వే ఎకనామిక్ కారిడార్లు కూడా దేశ జీడీపీ అభివృద్ధికి దోహదపడతాయని ప్రధాని మోదీ అన్నారు. ఆటో రంగంలో పరిశోధనలు మరియు పరీక్షలను మరింత మెరుగుపరిచేందుకు నేషనల్ ప్రాజెక్ట్కి రూ. 3,200 కోట్లు కేటాయించామన్నారు.
నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ సహాయంతో, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కొత్త ఊపందుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు. అంతే కాకుండా EVల స్వీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సుమారు రూ. 10 వేల కోట్లను పెట్టుబడి పెట్టిందని మోదీ తెలిపారు. ట్రక్కులు, టాక్సీలు నడిపేవారు, డ్రైవర్లు దేశ సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమని పేర్కొన్నారు.

గూడ్స్ రవాణాలో భారీ వాహనాల డ్రైవర్లు కొన్ని గంటలపాటు నిరంతరాయంగా ట్రక్కులను నడుపుతారని, వారికి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. ప్రయాణ సమయంలో డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వడానికి, కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్పై పనిచేస్తోందని చెప్పారు. ఈ పథకం కింద అన్ని జాతీయ రహదారులపై డ్రైవర్ల కోసం ఆధునిక భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు.
కాగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో వివిధ స్టాల్స్ను ప్రధాని మోదీ సందర్శించారు. కొత్త వాహనాలు, కాన్సెప్ట్ వాహనాలు, సంబంధిత విడిభాగాల ప్రదర్శనను కూడా మోదీ తిలకించారు. భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024ని నిర్వహిస్తోంది. మొబిలిటీ గ్లోబల్ హబ్గా భారత్ పాత్రను ప్రదర్శించడమే ఈ ఈవెంట్ లక్ష్యం.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 50కి పైగా దేశాల నుంచి 600కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. కాగా భారత్లోనే మొట్టమొదటి మెగా మొబిలిటీ-షో ఇదే కావడం విశేషం. ఈ ఈవెంట్లో టాటా మోటార్స్, మారుతి సుజుకి, హోండా, టీవీఎస్ ఇంకా పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు.. తమ కాన్సెప్ట్ వాహనాలతో పాటు అప్కమింగ్ ప్రొడక్ట్లను ప్రదర్శిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








