ఒకే ఏడాదిలో 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 473 మంది, లిస్ట్లో ఆంధ్ర, తెలంగాణ.. ఏరులై పారిన రక్తం
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ప్రతి సంవత్సరం లక్షలాది కుటుంబాలను కబళిస్తున్నాయి. సంఖ్యల రూపంలో చూస్తే ఇవి కేవలం గణాంకాలు అనిపించవచ్చు, కానీ వాటి వెనుక వేల కుటుంబాల కలలు, ఆశలు, జీవితాలు చెదిరిపోతున్నాయి. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, హెల్మెట్ - సీట్బెల్ట్ వంటి ప్రాథమిక భద్రతా నియమాలను విస్మరించడం ఈ విషాదానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం పేపర్ తెరిస్తే రోడ్డు ప్రమాద వార్త తప్పక కనిపించడం సహజమైపోయింది. ఒక కుటుంబానికి ప్రధాన బలమైన వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, అది ఆ కుటుంబానికి కోలుకోలేని విషాదాన్ని మిగుల్చుతుంది. చిన్న పిల్లల విద్య, వృద్ధుల సంరక్షణ, కుటుంబ భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజాగా విడుదల చేసిన నివేదిక వాస్తవాన్ని చూపిస్తుంది. కేవలం 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 1.72 లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోవడం మన దేశ రోడ్లపై భద్రత ఏ స్థాయిలో ఉందో బహిర్గతం చేస్తోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే కూడా ఆందోళన కలిగించే పెరుగుదలనే చూపుతోంది.

2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4.2 శాతం, మరణాల సంఖ్య 2.6 శాతం పెరిగింది. అంటే, భద్రతా చర్యలు పెరిగినా, అవగాహన కార్యక్రమాలు కొనసాగినా, ఇంకా ప్రమాదాల విషాద గణాంకాలు పెరుగుతూనే ఉన్నాయి. 2023లో నమోదైన 1,72,890 రోడ్డు ప్రమాద మరణాలలో, పాదచారులు, సైకిల్దారులు, ద్విచక్ర వాహనదారులు కలిపి మొత్తం 68 శాతం వాటాను కలిగి ఉన్నారు.
అంటే, రోడ్డు మీద నడిచే, తక్కువ రక్షణ కలిగిన వర్గాలే ఎక్కువగా బలైపోతున్నాయి. 2023లోనే 35,000 మందికి పైగా పాదచారులు మరణించారు, ఇది 2022 కంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక క్షణం నిర్లక్ష్యం, ఒక తప్పు నిర్ణయం లేదా రక్షణ చర్యలు పాటించకపోవడం, ఇవన్నీ ప్రాణాలు పోయే పరిస్థితికి దారితీస్తున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల కారణంగా 4,62,825 మంది గాయపడ్డారని నివేదికలో తేలింది.

2023లో దేశవ్యాప్తంగా నమోదైన 4,80,583 రోడ్డు ప్రమాదాల్లో 1,50,177 అంటే 31.2% జాతీయ రహదారులపై, ఎక్స్ప్రెస్వేలు సహా, చోటుచేసుకోగా, మరో 1,05,622 (22.0%) రాష్ట్ర రహదారులపై, మిగిలిన 2,24,744 (46.8%) ఇతర రహదారులపై జరిగాయి. అంటే, దేశంలో ఎక్కడ ప్రయాణించినా ప్రమాదం పొంచి ఉన్నదన్నది ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. సగటున భారతదేశంలో ప్రతి రోజు 473 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.
దాదాపు ప్రతి గంటకు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక గంటలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అంటే, ఒక చిన్న గ్రామం మొత్తాన్ని ఒక్క రోజులో రోడ్డు ప్రమాదాలు మింగేస్తున్నాయి అన్నట్టే. రాష్ట్రాల వారీగా ఈ పరిస్థితిని పరిశీలిస్తే మరింత కలవరపాటు కలిగించే గణాంకాలు బయటకొస్తాయి. జాతీయ రహదారులపై అత్యధిక ప్రమాదాలు తమిళనాడులో నమోదయ్యాయి. అయితే, ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య మాత్రం ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉంది.

అంటే, ప్రమాదాలు ఎక్కువగా జరిగేది ఒక రాష్ట్రంలో ఉండగా, మరణాల తీవ్రత మాత్రం మరొక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నదని ఇది చెబుతోంది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఆందోళన కలిగించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2023లో జాతీయ రహదారులపై 8,276 ప్రమాదాలు చోటుచేసుకుని దేశవ్యాప్తంగా 7వ స్థానంలో నిలిచింది. తెలంగాణ కూడా అంత దూరం వెనుకపడలేదు. 8,103 ప్రమాదాలతో దేశంలో 8వ స్థానాన్ని దక్కించుకుంది.
మరణాల పరంగా ఆంధ్రప్రదేశ్ 3,806 మరణాలతో 8వ స్థానంలో ఉండగా, తెలంగాణ 3,058 మరణాలతో 9వ స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలే కాదు, వాస్తవానికి ప్రతి కుటుంబానికి నిండా నష్టాన్ని తెచ్చిన విషాద గాథలు. ఈ పరిస్థితిని అరికట్టడం కోసం భారతదేశం 2030 నాటికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగే మరణాలు, గాయాలను కనీసం సగానికి తగ్గించాలని సంకల్పం తీసుకుంది.


Click it and Unblock the Notifications








