భారతదేశపు తొలి వాణిజ్య ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లాంట్ ప్రారంభం
భారతదేశంలోనే మొట్టమొదటి వాణిజ్య ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లాంట్ ప్రారంభమైంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల నాగ్పూర్లో ఈ భారతదేశపు తొలి ఎల్ఎన్జి ప్లాంట్ను ప్రారంభించారు.

ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, ఇంధన రంగంలో ఇటువంటి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాల ప్రాముఖ్యత ఎంతైనా ఉందని ఈ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు.

భారతదేశపు తొలి వాణిజ్య ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జి) ప్లాంట్ను నాగపూర్-జబల్పూర్ హైవే సమీపంలోని కంపతి రోడ్లో ప్రారంభించారు. బైద్యనాథ్ ఆయుర్వేద గ్రూప్ ఈ ప్లాంట్ను స్థాపించింది. ఎల్ఎన్జి (లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్) కూడా సహజ వాయువు (న్యాచురల్ గ్యాస్) మాదిరిగా పనిచేస్తుంది.

న్యాచురల్ గ్యాస్ వాయు రూపంలో ఉంటే, ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ద్రవ రూపంలో ఉంటుంది. దేశంలో ఎల్ఎన్జి, సిఎన్జి లేదా ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం లభిస్తుందని గడ్కరీ తెలిపారు.

ఎల్ఎన్జి స్వచ్ఛమైన మరియు ఆర్థికంగా తక్కువ ధర కలిగిన ఇంధనం అని, ఇది రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుందని ఆయన అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి కోసం ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.

దేశంలో స్వదేశీ ఇథనాల్, బయో సిఎన్జి, ఎల్ఎన్జి, హైడ్రోజన్ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించే విధానాన్ని తాము రూపొందించామని, ఫలితంగా దేశంలో పెట్రోలియం దిగుమతులు తగ్గుతాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పెట్రోల్తో పోల్చితే ఇథనాల్ను వాహన ఇంధనంగా ఉపయోగించడం వల్ల లీటరు ఇంధనానికి రూ.20 వరకూ ఆదా అవుతుందని గడ్కరీ తెలిపారు. వివిధ ప్రత్యామ్నాయ ఇంధనాలపై మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు.

వరి, మొక్కజొన్న మరియు చెరకు మిగులు ఉత్పత్తులను ఉపయోగించి ఇథనాల్ ఇంధనాన్ని తయారు చేయవచ్చని, ఫలితంగా ఇది పంటల వ్యర్థాన్ని కూడా నివారిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, ఎల్ఎన్జి యొక్క ఆర్ధిక ప్రయోజనాలను కూడా మంత్రి తెలియజేశారు.

సాధారణ ట్రక్ ఇంజన్ను ఎల్ఎన్జి ఇంజన్గా మార్చడానికి సగటున సుమారు రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని, ట్రక్కులు సగటున ఏటా 98,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నందున, వాటని ఎల్ఎన్జికి మార్చడం వల్ల కేవలం 9-10 నెలల్లోనే ఒక్కో వాహనంపై సుమారు రూ.11 లక్షలు ఆదా చేయవచ్చని, తద్వారా ఈ ఇంజన్ మార్పిడి ఖర్చును సులభంగా తిరిగి పొందవచ్చని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా, భారతదేశంలో బహుళ ఇంధనాలను సపోర్ట్ చేసే, ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ల గురించి మాట్లాడిన గడ్కరీ, రానున్న మూడు నెలల్లో ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని, ఇది ఆటోమొబైల్ తయారీదారులకు, ముఖ్యంగా ఫోర్ వీలర్లు మరియు ద్విచక్ర వాహనాలకు లబ్ధి చేకూరుస్తుందని అన్నారు.

పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా పూర్తిగా 100 శాతం బయో-ఇథనాల్ (జీవ ఇంధన)తో నడిచే ఇంజన్ను ఫ్లెక్-ఫ్యూయెల్ ఇంజన్ అంటారు. అంటే, ఇది పూర్తిగా పెట్రోల్తో అయినా పనిచేస్తుంది లేదా పూర్తిగా జీవ ఇంధనంతోనైనా పనిచేస్తుంది. బ్రెజిల్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications








