సీట్బెల్ట్ అలారంలు మ్రోగకుండా చేసే పరికరాల అమ్మకాలను నిలిపివేయమని అమేజాన్ను కోరిన ప్రభుత్వం
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సీట్ బెల్ట్ ధరించని కారణంగా చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించిన సంగతి తెలిసినదే. దేశంలోనే ఇది హై-ప్రొఫైల్ కార్ యాక్సిడెంట్ కావడం మరియు చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఇప్పుడు దేశంలో ఇది పెద్ద చర్చనీయాశంగా మారింది.
Recommended Video
ఈ నేపథ్యంలో, దేశంలో సీట్ బెల్ట్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇకపై, కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సీట్ బెల్టులను ధరించే నిబంధనల్లో సవరణలు చేయడంతో పాటుగా, సీట్ బెల్టు అలారంలు మ్రోగకుండా చేసే పరికరాలను కూడా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా, ఇందుకు సంబంధించి ఇలాంటి పరికరాలను ఆన్లైన్ విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ప్రముఖ ఆన్లైన్ రీటైల్ కంపెనీ అమేజాన్ను భారత ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తోంది.

కార్లలో సీటు బెల్ట్ అలారంలను నిలిపివేయడానికి రూపొందించిన పరికరాలను విక్రయించడాన్ని తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాయిటర్స్కు నివేదించారు. వాస్తవానికి, అటువంటి పరికరాల విక్రయం చట్టవిరుద్ధం కానప్పటికీ, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్పర్సన్ సైరస్ మిస్త్రీ మరియు అతని సహ-ప్రయాణికుడు జహంగీర్ పండోల్ మరణించిన తర్వాత అవి పరిశీలనలోకి వచ్చాయి.

గడచిన ఆదివారం నాడు సైరస్ మిస్త్రీ గుజరాత్లోని ఉద్వాడ నుంచి ముంబైకి బయలుదేరారు. ఆ సమయంలో కారులో మిస్త్రీతో పాటుగా జహంగీర్ పండోల్ (వెనుక సీటులో ప్రయాణీకుడు), అనహిత పండోల్ (కారు డ్రైవ్ చేస్తున్నవారు), డారియస్ పండోల్ (ఫ్రంట్ ప్యాసింజర్) ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి, డివైడరును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో సీట్ బెల్టులు ధరించకుండా కూర్చున్న సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్ ఇద్దరూ మరణించగా, ముందు సీట్లలో సీట్ బెల్టులతో ప్రయాణిస్తున్న అనాహిత పండోల్ మరియు ఆమె భర్త డారియస్ పండోల్ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో కారులో ప్రయాణించే ప్రయాణీకులందరికీ సీటు బెల్టులు ధరించడం తప్పనిసరి చేస్తామని, కారు వెనుక సీటులో వాటిని ధరించకుంటే జరిమానా విధిస్తామని మంగళవారం గడ్కరీ చెప్పారు. ముందు సీట్లలో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకోకుంటే ప్రభుత్వం ఇప్పటికే జరిమానాలను విధిస్తోంది. అయితే, ఈ పాత రూల్ వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణీకులకు వర్తించదు. దీంతో సీట్ బెల్ట్ నిబంధనల్లో కూడా సవరణలు చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన చెప్పారు. త్వరలోనే మార్గదర్శకాలను వెల్లడిస్తామన్నారు.

గతబుధవారం రాయిటర్స్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఫ్రంట్ సీట్లలో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రస్తుతం ఎలాగైతే తప్పనిసరి అలారం సిస్టమ్ ఉందో, అదే అలారం సిస్టమ్ ను వెనుక సీట్లలోని ప్రయాణీకులకు కూడా తప్పనిసరిచేయనున్నట్లు ఆయన చెప్పారు. నేటి ఆధునిక కార్లలో ఫ్రంట్ సీట్లలో కూర్చున్న ప్రయాణీకులు, కారు ఆన్ అయిన తర్వాత సీట్ బెల్టులు ధరించకపోతే అలారం (సీట్ బెల్ట్ రిమైండర్) నిరంతరంగా మ్రోగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇదే అలారం వెను సీట్లలోని ప్రయాణీకులకు కూడా వర్తించనుంది.

అయితే, ఈ అలారం సౌండ్ను ఆఫ్ చేసేందుకు మరియు సీట్ బెల్ట్ ధరించకుండా తప్పించుకునేందుకు చాలా మంది బయటి మార్కెట్లో లభించే సీట్ బెల్ట్ క్లిప్ లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటివి ఆన్లైన్లో కుప్పలుతెప్పలుగా లభిస్తుంటాయి. ముందు సీటు ప్రయాణీకులు సీట్ బెల్టులను ఉపయోగించనప్పుడు మోగే అలారంను దాటవేయడానికి సీట్ బెల్ట్ స్లాట్లలో చొప్పించగల ఒక రకమైన మెటల్ క్లిప్ను అమెజాన్లో విక్రయిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో, తక్షణమే వాటి అమ్మకాలను నిలిపివేసేలా ఆన్లైన్ రీటైలర్లకు నోటీసులు పంపామని ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదాల కారణంగా గత ఏడాది సుమారు 1.5 లక్షల మంది మరణించారని గడ్కరీ చెప్పారు. ఓ నివేదిక ప్రకారం, 2021లో భారతదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డుపై మరణిస్తున్నట్లు తేలింది. ఒక్క మహారాష్ట్రలోనే ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 59,000 మందికి పైగా మరణించగా, 80,000 మందికి పైగా గాయపడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలలో సుమారు 11 శాతం కంటే ఎక్కువ మరణాలకు ప్రయాణీకులు సీటు బెల్ట్లను ఉపయోగించకపోవడమే కారణమని భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2020 పేరుతో విడుదలైన నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే, కార్లలో ఒకప్పుడు ఆప్షనల్గా మాత్రమే లభ్యమైన ఎయిర్బ్యాగ్ల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న కార్లలో రెండు ఎయిర్బ్యాగ్లు (డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) మాత్రమే తప్పనిసరి చేయబడ్డాయి. అయితే, వచ్చే అక్టోబర్ నుండి దేశంలో విక్రయించబడే అన్ని కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వలన కార్ల ధరలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








