రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం.. ఆ 725 స్టేషన్లలో ఇక గందరగోళం ఉండదు..!!
గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, స్టేషన్ల ఆధునికీకరణ పనులను ముమ్మరంగా చేస్తోంది. 2019 నుంచి వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణాన్ని కొంత వరకు సౌకర్యవంతంగా మార్చింది. చాలా మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించాలనే ఆసక్తి చూపించే విధంగా సౌకర్యాలను ఏర్పాటుచేసింది.
కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అధిక ధరల కారణంగా చాలా మంది సామాన్యులు వీటిలో ప్రయాణానికి వెనక్కి తగ్గారు. దీంతోపాటు సామాన్యుల రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు దేశవ్యాప్తంగా నాన్ ఏసీ బోగీలతో కూడిన రైళ్లను నడపాలని భావిస్తోంది.

వీటన్నింటితోపాటు రైల్వే శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైల్వే ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యం కోసం పర్యాటక ప్రాంతాల్లోని చిన్న స్టేషన్లను సమీపంలోని ప్రముఖ ప్రాంతాల పేర్లతో లింక్ చేసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించే వారు సరైన స్టేషన్ను ఎంచుకోవడం సులభం అవుతుందని రైల్వే చెబుతోంది.
ఉదాహరణకు సారనాథ్ ప్రాంతం వారణాని నుంచి సుమారు 10 కిలోమీటర్లు దూరం ఉంటుంది. సారనాథ్ ప్రాంతానికి వెళ్లే పర్యటకులు.. రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ప్రయత్నించినప్పుడు సారనాథ్ స్టేషన్ వారణాసి స్టేషన్తో లింక్ చేసినట్లు కనిపిస్తుంది. దీంతో ప్రయాణికులు సరైన ప్రాంతానికి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

తొలిదశలో 175 నగరాల్లోని 725 స్టేషన్లను లింక్ చేసినట్లు తెలుస్తోంది. జులై 21 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు, పర్యాటకుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన స్టేషన్లను మోడల్ స్టేషన్లలుగా రైల్వే అభివృద్ధి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణం, వరంగల్ సహా మరికొన్ని రైల్యే స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
* దేశవ్యాప్తంగా వలసకూలీలు, రద్దీగా ఉన్న ప్రాంతాల మధ్య వందే భారత్ ఫీచర్లతో అప్గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్రిజర్వడ్, సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్లతో కొత్త రైళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ మోడల్ రైళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ రైలు పేరును ఇంకా ఖరారు చేయలేదు. కానీ సామాన్యులకు మెరుగైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైళ్ల ఉద్దేశంగా తెలుస్తోంది.

ఈ రైళ్ల రెండు చివర్లలో రెండు ఇంజిన్లు ఉంటాయి. పుష్- పుల్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇంజిన్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో తయారు చేస్తున్నారు. రైలు కోచ్లను చైన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో (ICF) తయారు చేయనున్నారు. ప్రస్తుతం ఐసీఎఫ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కోచ్లను తయారు చేస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి రానున్న రైళ్ల అన్ని కోచ్లు నాన్ ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. సామాన్య ప్రజల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటాయి. ఈ రైళ్లలో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్వడ్ కోచ్లు, 2 సెకండ్ లగేజీ, దివ్యాంగులకు అవసరమైన కోచ్లు ఉంటాయి.
ఈ రైళ్లు సుదూర ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలుస్తోంది. వలస కార్మికులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలను కలుపుతూ అందుబాటులోకి తీసుకు రానున్నారని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఈ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








